25, ఏప్రిల్ 2010, ఆదివారం

ఎట్టకేలకు అసలు విషయానికొస్తున్న పాశ్చాత్యులు

మనకు ఇంగ్లీషువారు (ఇంగ్లీషు క్రైస్తవులు) చేసిపోయిన అతిఘోర అన్యాయాల్లో ఒకటి - మన చరిత్ర యొక్క ప్రాచీనతని బాగా తగ్గించి చూపి దాన్ని ఇటీవలిదిగా ప్రచారం చేయడమేనని అందఱికీ తెలుసు. ఆ క్రమంలో వేదాలు క్రీ.పూ. 1500 నాటివిగా ప్రచారమయ్యాయి. రామాయణమేమో క్రీ.పూ. 1000 కి కాస్త అటూ ఇటూగా జఱిగుంటుంది అనేశారు. అలాగే భారతీయ రాజవంశాల అనుక్రమమంతా మార్చేశారు. తేదీలన్నీ తలకిందులు చేశారు. మొత్తమ్మీద మన చరిత్ర మనకే కొఱుకుడు పడకుండా అస్తవ్యస్తం, అకటావికటం చేసి పోయారు.

నలభయ్యేళ్ళ క్రితం బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం గారనే మహానుభావుడు విజయవాడలో నివసించేవాడు. ఆయన ఆ రోజుల్లో "కలిశక విజ్ఞానము" అనే పేరుతో అనేక చరిత్రసంపుటాలని వెలువఱించారు. వాటిల్లో కొన్ని నేను చిన్నప్పుడు చదివాను. బ్రిటీషువారు ఏయే కారణాల చేత, ఏయే పద్ధతులలో భారతీయుల చరిత్రని వక్రీకరించారో అందులో ఆయన సప్రమాణంగా నిరూపించారు. "ఈ వక్రీకరణ చాలావఱకు ఉద్దేశపూర్వకం కాగా కొంతవఱకు దుర్‌భ్రమల వల్ల కూడా జఱిగింది" అని ఆయన వ్రాసినదాన్ని బట్టి తెలుస్తోంది. ఉదాహరణకి - ఇంగ్లీషువాళ్ళు మన చరిత్రతేదీలన్నీ మార్చిపారేయడానికి గల ఒక ప్రధాన కారణం - ఇండియాని పరిపాలించిన ప్రాచీన పారశీక రాజులలో ఇద్దఱు సైరస్‌లు ఉన్నారు. ఆ యిద్దఱినీ ఒక్కఱే అనుకొని భ్రమించి మొదటి సైరస్ యొక్క సమకాలీన సంఘటనల తేదీలన్నీ రెండో సైరస్ యొక్క తేదీకి అనుగుణంగా మార్చేశారట. ఇలాంటి వందలాది చారిత్రిక సూక్ష్మాల్ని గాలించి పట్టుకొన్న మహామేధావి కోట వెంకటాచలం గారు చివఱి రోజుల్లో సన్న్యాసాశ్రమ స్వీకారం చేసి పరమపదించారు. ఆయన పుస్తకాలు ఇప్పుడు ఎక్కడున్నాయో నాకు తెలియదు. వాటిని ఎవఱైనా పునర్ముద్రించి, ఇంకా ఇంగ్లీషు, హిందీ, శ్పానిష్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, అరబిక్ భాషలలోకి కూడా తర్జుమా చేసి వ్యాపింపజేస్తే బావుణ్ణు. "కోట వెంకటాచలం గారి పుస్తకాలే నిజమైన భారతదేశ చరిత్ర" అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు స్వయంగా వాక్రుచ్చిన సంగతిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది.

కానీ ఇవేవీ తెలియక పోయినా పాశ్చాత్య చరిత్రకార ప్రపంచంలో కూడా ఇంగ్లీషువారి చరిత్రకల్పనలపై ఇటీవల పునరాలోచన బయలుదేఱింది. ఈ పునరాలోచనకు కొన్ని కారణాలున్నాయి.

౧. ఇటీవల కనుగొన్న సరస్వతీనది యొక్క అంతర్ధానకాలం - వేదకాలంగా బ్రిటీషు చరిత్రకారులు చెప్పిన క్రీ,.పూ. 1500 కంటే చాలాముందు (సుమారు క్రీ.పూ.2000 - అంటే 4 వేల సంవత్సరాల క్రితం) జఱిగినట్లు భూగర్భశాస్త్ర పరిశోధనల ద్వారా తేలడం. వేదాల్లో సరస్వతీనదిని వర్ణించినట్లుగా గంగానదిని వర్ణించడం జఱగలేదు. అదీగాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన బలరాముడు "సరస్వతీనది ఇదివఱకటిమల్లే నిరంతరాయంగా ప్రవహించడంలేదనీ, ఈమధ్యఅప్పుడప్పుడు ఎండిపోతోం"దనీ శ్రీకృష్ణుడితో చెప్పిన మహాభారతఘట్టం. అంటే సరస్వతీనది ఎండిపోవడం మహాభారత కాలం (క్రీ.పూ.3000) లో మొదలై అటుపిమ్మట వెయ్యేళ్ళకి పూర్తిగా ఎండిపోయిందని తెలుస్తోంది. సరస్వతీనది ఎండిపోవడమూ, దాని పరీవాహక ప్రాంతాల్లో వెలసిన సింధునాగరికత కుప్పకూలడమూ ఒకేసారి జఱిగినట్లు కనిపిస్తున్నందువల్ల సింధునాగరికత కూడా అప్పటి (మహాభారతకాలంనాటి) వైదిక నాగరికత కంటే భిన్నమైనదని బ్రిటీషు చరిత్రకారులు ఊహించినది వాస్తవం కాదేమోననే అనుమానాలు పాశ్చాత్య ప్రపంచంలో రేకెత్తుతున్నాయి.

౨. యూదుల ప్రాచీనత : ఓల్డు టెస్టమెంట్ ఆధారంగా యూదులు నాలుగువేల సంవత్సరాల నాటి జాతి. వారు మొదట్లో బ్రాహ్మణులని కొందఱు పాశ్చాత్యులు అభిప్రాయపడుతూండగా, బ్రాహ్మణులే యూదుల సంతానమని ఇంకొంతమంది పాశ్చాత్యులు వాదిస్తున్నారు. యూదుల ఆత్మగౌరవ భావన పెచ్చుమీఱిన ఈ రోజుల్లో వారు తమ జాతి ఔన్నత్యం కోసం తమకంటే ఎక్కువ ప్రాచీనత కలిగిన బ్రాహ్మణులతో తమకు ఎక్కడో, ఏ కాలంలోనో బాదరాయణ సంబంధం ఉన్నదని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారనేది స్పష్టం. ఈ తాపత్రయం వల్ల వారు భారతీయ గ్రంథాల అధ్యయనాన్ని ముమ్మరం చేసి బ్రిటీషు చరిత్రకారుల లొసుగులన్నీ బయటపెడుతూండడం మనకు కలిసొస్తున్న అంశం.

౩. గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహం : బ్రిటీషు చరిత్రకారుల ననుసరించి బుద్ధుడు క్రీ.పూ.500 నాటివాడు. మనకు భారతదేశ పాఠశాలల్లో కూడా అలా అనే నేర్పుతున్నారు. కానీ పదేళ్ళ క్రితం గ్రీసులో బయటపడ్డ బుద్ధవిగ్రహాన్ని కార్బన్-14 టెస్ట్ చేయగా అది క్రీ.పూ.1,800 నాటిదని తేలింది. 2,500 ఏళ్ళనాటి బౌద్ధం అనే మాట దూదిపింజలా తేలిపోవడంతో ఇప్పుడు పాశ్చాత్యులు కిం కర్తవ్యం ? అని తలలు పట్టుకుంటున్నారు.

అందుచేత ఇప్పుడు అనేక మంది పాశ్చాత్య రచయితలూ, వెబ్‌సైట్లవారూ కూడా మనసు మార్చుకొని హిందూమతాన్ని కనీసం 5000 సంవత్సరాల నాటి ప్రపంచపు అత్యంత ప్రాచీనతమ ధర్మం (The oldest religion of the world) అని పేర్కొనడానికి సంశయించడం లేదు. ఉదాహరణకి - ఈ క్రింది లంకెలోకి వెళ్ళి అక్కడి యానిమేషన్ పిక్చర్ చూడండి.

http://mapsofwar.com/images/Religion.swf

ఏదేమైనా నిజం నిప్పులాంటిది. కదూ ?

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి