23, అక్టోబర్ 2010, శనివారం

సౌందర్యచిట్కాలు (Beauty Tips)

లుక్కు మారితే లక్కు మారుతుంది. అందుకే అందంగా పుట్టాలనీ, అందంగా తయారవ్వాలనీ చాలామంది కోరుకుంటారు. ఈ అందం అనేది ఒక సాపేక్షభావన (Relative concept) అని ఈస్థటిస్టుల అభిప్రాయం. ఆఫ్రికన్ల అందం కాన్సెప్టూ, భారతీయుల అందం కాన్సెప్టూ ఒకటి కావు. అలాగే వీరివీ తక్కిన జంబూద్వీపవాసులవీ ఒకటి కావు. అందం అనేది దాన్ని చూసే కళ్ళల్లో ఉంటుందని అందుకే పెద్దలు చెబుతూ వచ్చారు. ఇతరులకు అందంగా కనిపించకపోయినా ప్రతితల్లికీ తన బిడ్డ ముద్దులు మూటగట్టేస్తూ ఉంటాడు. అయితే అందంగా ఉండడంలో చాలా మతలబులున్నాయని చాలామందికి తెలియదు. అందం ఒక బాధ్యత. ఎందుకంటే అందం ఒక సంపద, ఒక వారసత్వం. అందం ఒక మత్తుమందు.

అయితే - చూడగానే ఆకట్టుకునే సూదంటుఱాయిలాంటి వ్యక్తిత్వం, చూపు తిప్పుకోలేనంత సుందరరూపం మొదలైన వాటితో ఎన్ని ఇబ్బందులున్నా ఫర్వాలేదనుకొని అవే కావాలని ప్రగాఢంగా అభిలషించేవారు వాటిని సాధించే ప్రక్రియలో కూడా చాలా ఇబ్బందులున్నాయని గ్రహించాలి. అందం యొక్క భౌతికస్వరూపమే ఎక్కువమందికి ఎఱుక. దాని ఆధ్యాత్మిక స్వరూపం గుఱించి చింతన చేసేవారు అఱుదు. అందం అంతిమ ఫలస్వరూపమే తప్ప దానికది ఒక స్వతంత్ర స్వమూర్తి (independent entity) కాదు. ఈ అంతిమ ఫలాన్ని కాచిన ఆ అందమైన వృక్షం పేరేంటి ? అందాన్ని మించిన ఆకర్షణపరిమళాన్ని వెదజల్లే ఆ పూలతీగ ఎక్కడిది ?

మానవుడి గొప్పతనాలన్నీ ఆతనియందు భగవంతుడు ప్రసన్నుడై ప్రసాదించగా వ్యక్తమౌతున్న భగవద్ విభూతులేననీ, అవి ఆయన ఆస్తి అనీ, ఒక తండ్రి తన ఆస్తిని కుమారులకు పంచి యిచ్చినట్లుగా ఆయన మనకు వాటిని పంచి యిస్తాడనీ గతంలో ఒకసారి ఒక ప్రసంగంలో అన్నాను. అదే అందానిక్కూడా వర్తిస్తుంది. మన అందం ద్వారా వ్యక్తమయ్యేది నిజానికి మనం కాము, ఆ భగవంతుడే. ఈ ముఖాలు భగవంతుడివి. ఈ శరీరాలు భగవంతుడివి. ఈ ఆకర్షణశక్తి భగవంతుడిది. మనం వాస్తవంగా భూతకాలిక పిండాలం, భవిష్యత్ శవాలం మాత్రమే. భౌతికమైన అందం మానసికమైన అందానికి ప్రతిబింబం మాత్రమే. అవ్యక్తుడైన పరమాత్మకు వ్యక్తరూపమే ఈ ప్రపంచం. అదే విధంగా సూక్ష్మమైన మనస్సు ధరించిన స్థూలరూపమే ఈ శరీరం. ఏదో ఒక జన్మలో ఒకనాడు మనం చేసిన మంచి ఆలోచనలు ఈ జన్మలో మన అందంగా వ్యక్తమౌతున్నాయి.

అందానికి ఏ ఆధ్యాత్మిక సత్యం వర్తిస్తుందో అందవిహీనత్వానికీ అదే సత్యం వర్తిస్తుంది. అంటే పూర్వజన్మలో మనం చేసిన అందవికారపు ఆలోచనల ప్రతిఫలమే ఇప్పటి అందవిహీనత్వం. పూర్వజన్మల దాకా పోనక్కఱలేదు. ఒక వ్యక్తి ఈ జన్మలోనే హత్య గానీ మఱో దుష్టుపని గానీ చేసేటప్పుడు అతను స్వతహాగా ఎంత అందగాడైనా సరే, అతని ముఖకవళికలు అతనికి తెలియకుండానే ఎంత అందవిహీనంగా మారిపోతాయో గమనించండి. ఆనాటి ఆ ముఖకవళికలే కర్మఫలం అనే రిఫ్రిజిరేటర్ లో దాచబడి భద్రంగా అతనికి మఱుజన్మలో అందించబడతాయి. ఆ తరువాత అతను తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తననెందుకిలా భగవంతుడు అందవికారంగా పుట్టించాడో అర్థం కాక కుమిలిపోతూంటాడు. అది భగవంతుడు ఇవ్వాలనుకొని ఇచ్చిన అందవికారం కాదు. ఇతను ఒకప్పుడు కోరి యెంచుకున్నదే.

"అందమైన ప్రతివారూ మానసికంగా అందంగా ఉంటారనే హామీ ఏముంది ? ఈ అందగాళ్ళు/ అందగత్తెలు అంత మంచి పూర్వజన్మసంస్కారం గలవారైతే మఱి ఇప్పుడు ఈ జన్మలో ఆ సంస్కారం కొనసాగలేదెందుకని ? వీరిలో పిసినిగొట్లూ, కుట్రదారులూ, ద్రోహులూ, రౌడీలూ, కేడీలూ, వ్యభిచారిణులూ కూడా ఉన్నారెందువల్ల ?" అనే విచికిత్స తలెత్తుతుంది. సత్సంస్కారాలు మఱుజన్మలో కొనసాగాలన్నా దానికి మానవుడు ప్రయత్నపూర్వకంగా సంకల్పించుకోవాలి. అలా కొనసాగకుండా మధ్యలోనే చెడిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడేం చేస్తాడు ? అందుకే సాయిబాబా ఒక భక్తుడితో అన్నారు : "నా దగ్గఱికి వచ్చేవారంతా మోక్షం పొందుతారా అనుకుంటున్నావు కదూ నీ మనసులో ? ఆ మామిడిచెట్టు వైపు చూడు. అక్కడున్న పూత అంతా కాపైతే ఎంత మంచి పంట అవుతుంది ? కానీ అలా జఱగదు. పూతగానే చాలా మట్టుకు రాలిపోతుంది. కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పండ్లవుతాయి." అలాగే ఒకప్పుడు మనిషి చేసిన మంచి ఆలోచనల ఫలితంగా అతనికి మంచి రూపం లభిస్తుంది. కానీ తదనంతరం అలవాటు చేసుకొన్న, అతనికి అత్యంత ప్రియమైన దుష్టసంస్కారాలు సమాంతరంగా కొనసాగుతాయి.

మనం చేసే ప్రతి వక్రాలోచనా, పలికే ప్రతి వంకరమాటా, చేసే ప్రతివంకర చేష్టా ఆత్మతేజస్సుపై దుమ్ములా కప్పేసి దాని సౌందర్యాన్ని మఱుగుపఱుస్తుంది. ఇందుకు విపర్యస్తంగా సదుద్దేశంతో మనం చేసే ప్రతి సత్కర్మ మన ఆత్మని పరిశుభ్రం చేసే చీపురుగా ఉపయోగపడి దాని సత్యస్వరూపాన్ని వెలికి తీస్తుంది. ఆత్మే అసలైన దీపం. దేహాలు పైపై చిమ్నీలు మాత్రమే. ఆత్మ అంటే మఱింకేమీ కాదు. మనలోని సూక్ష్మ భగవంతుడే. శ్రీ రామకృష్ణపరమహంస కఠోర తపస్సాధనల్ని ఆచరించే రోజులలో ఆయన శరీరం బంగారంలా ధగధగ మెఱిసిపోతూండేదనీ దిష్టి తగుల్తుందేమోనన్న భయంతో శిష్యులు ఆయన మీద పట్టుపీతాంబరాలు కప్పేవారనీ చదివాం. కనుక సదాలోచనల ద్వారా ఆత్మతేజస్సును వృద్ధి పొందించుకుంటే శరీరతేజస్సు దానంతట అదే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది.

20, అక్టోబర్ 2010, బుధవారం

కొందఱు భార్యలు కూడా తమ భర్తలకు గురువులు కావచ్చు

శ్రీమన్ మహాభాగవతం ఏకాదశమ స్కంధంలో విశ్వగురుమూర్తి శ్రీ దత్తాత్రేయస్వాములవారు తనకు 24 మంది గురువులున్నారని వెల్లడిస్తూ వారిలో ఒక వేశ్య కూడా ఉన్నదంటారు. బహుజన పరిచితమైన మాతాపితృతత్త్వం వలెనె సకలలోక నమస్కృతమూ, మహనీయమూ అయిన గురుతత్త్వం సహితం విశ్వవ్యాప్తమైనది. సమిధలో, తదితర పారితోషికమో చేతబట్టుకొని మనం వెళ్ళి వరించిన వ్యక్తే మన గురువనీ, తదన్యులు గురువులు కారనీ పట్టుబట్టనక్కఱలేదు. గమనించి గుర్తుపడితే సమస్తసృష్టీ విశ్వగురుమూర్తియై మనకు దారిచూపుతుంది. అన్నీ, అందఱూ భగవంతుని ప్రతినిధులే. అందఱూ దారిచూపే నిమిత్తం ఆయన చేత నియమించబడినవారే. కానీ దురదృష్టవశాత్తు మనలోని బహుజన్మపరంపరాగతమైన స్వార్థం, అహంకారం, అసూయ, చిన్నచూపు, సంకుచితదృష్టి, అమార్దవం మొదలుగా గల సూక్ష్మమైన మానసిక దౌర్బల్యాల మూలాన మనం ఎల్లెడలా అంతర్నిహితంగా నిబిడీకృతమై నిత్యప్రత్యక్షభూతమైన గురూపదేశం పట్ల ప్రాలుమాలుతూ ఉంటాం.

"భార్యకు భర్త గురుమూర్తి" అని శ్రీగురుచరిత్రలో సూచించబడింది. అందుచేత ఒక శిష్యుడు తన గురువుగారికి ఏ విధంగానైతే సేవ చేస్తాడో అదే విధంగా భార్య భర్తకు సేవ చేయడం ద్వారా పరమార్థాన్ని సాధించుకుంటుందని సూచించారు. అంటే భర్తృద్రోహం గురుద్రోహంతో సమానం. గురుద్రోహం దైవద్రోహంతో సమానం. విపర్యస్తంగా ఇదే ఉదాహరణ గురు-శిష్య సంబంధానిక్కూడా చెప్పారు, ఒక మహాపతివ్రత తన భర్తను ఎలా సేవిస్తుందో ఒక శిష్యుడు కూడా తన గురువుని అలాగే సేవించాలని !

హిందూ సంప్రదాయాన్ననుసరించి భార్యాభర్తలకు అభేదం. హిందూధర్మంలో భార్యాభర్తల సంబంధం ఒప్పందమూ కాదు, కాంట్రాక్టూ కాదు, తాత్కాలికమూ కాదు. స్వసంకల్పానుసారంగా రద్దుచేసుకోదగినది అంతకంటే కాదు. తల్లివలె, తండ్రి వలె, సోదరుడి వలె అది రక్తసంబంధంతో సమానం. గురువు వలె అది ఒక ఆధ్యాత్మిక సంబంధం. అంటే భార్య అనేది భర్త యొక్క స్త్రీస్వరూపమే. అతని యొక్క మనశ్శక్తులే అతనికి సహాయపడే నిమిత్తం ఆమెగా అవతారం ధరించాయని భావించబడుతున్నది. అందుచేత ఆమె పురుషుడి శక్తిస్వరూపిణి అన్నారు. అయితే అనుభవంలో చూసినప్పుడు కోట్లాదిమంది స్త్రీలలో కొన్నివందలమందికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యం అనువర్తనీయం. మిగతా స్త్రీలంతా ఏదో పూర్వఋణానుబంధశేషం వల్ల తమ ప్రస్తుత భర్తల దగ్గఱికి వచ్చిచేఱినవాళ్ళై ఉంటారు. అటువంటివారు ఎలా వచ్చిచేఱారో అలాగే తమ ఋణం తీఱిపోగానే వెళతారు కూడా ! అదే విధంగా భర్త అనేవాడు సైద్ధాంతికంగా భార్య యొక్క పురుషస్వరూపమే. వారిద్దఱూ ఏకశరీరులు. వారిద్దఱూ ఒకఱికొకఱు ప్రతినిధులు. అందువల్లనే హిందూ ధార్మిక సంప్రదాయంలో మటుకు విడాకుల సంగతి ఎక్కడా ప్రస్తావించబడలేదు. హిందూమతం, ఒక మతంగా విడాకుల్ని అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆమోదించలేదు. అంటే హిందువులలో అవి లౌకికంగా, సామాజికంగా ఉనికిలో లేవని కాదు. చాలా ప్రాచీనకాలంలోనే విడాకులున్నాయని కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి గ్రంథాల ద్వారా తెలియవస్తున్నది. అయితే ఆ ప్రస్తావన ఇప్పుడిక్కడ సంగతం కాదు.

గురు-శిష్య సంబంధంలో శృంగారానికి తావు లేనప్పుడు భార్యతో శృంగారసంబంధం కలిగి ఉన్న భర్త ఆమెకు గురువు కావడమేంటని కొందఱి సందేహం. మనందఱికీ శృంగారం చాలా పెద్ద విషయం. కానీ దేవుడికి చాలా చిన్న విషయం. అందువల్లనే మనకీ సందేహం. మన దృష్టిలో శృంగారానికీ, ఆధ్యాత్మికతకీ చుక్కెదురు. సన్న్యాసుల ఆధ్యాత్మిక ఆదర్శాల్ని గృహస్థులు కూడా తలకెక్కించుకోవడం వల్ల ఏర్పడ్డ అయోమయమిది. కానీ గృహస్థాదర్శాలూ, సన్న్యాసాదర్శాలూ ఒకటి కావు. రెంటికీ పొత్తు కుదఱదు. ఇవి ఆధ్యాత్మిక సాధనలో రెండు వేఱు వేఱు పంథాలు, రెంటినీ కలగాపులగం చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి శృంగారమనేది నిండా ఆమోదయోగ్యమైన ఆశ్రమవిహితమైన జీవనశైలియే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోను తప్పుపట్టకూడదు. అందులో పాల్గొనకుండా బలవంతాన మానకూడదు. గృహస్థాశ్రమానికి సంబంధించినంతవఱకూ గురువులంటే శిష్యులతో/ శిష్యురాళ్ళతో శృంగారసంబంధం లేనివారు మాత్రమే కాదు, ఆ సంబంధం ఉన్నవారు కూడా గురువులే. అన్నిరకాల శృంగారాలకూ ఆశ్రమవిహితంగా స్వచ్ఛందంగా దూరమైపోయిన సన్న్యాస గురువులతో గృహస్థ గురువుల్ని పోల్చి వారిని నిందించడం సరికాదు. ఎందుకంటే ఆ సంబంధం వల్ల వారివారి గురుహోదాకు ఏ విధమైన భంగమూ వాటిల్లదు. వారి పట్ల శిష్యులు/ శిష్యురాళ్ళు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలలోను, చూపించాల్సిన పూజ్యభావనలోను సహితం ఏ విధమైన మార్పూ ఉండదు. అంటే ఆ సంబంధం ఏర్పడ్డ తరువాత కూడా ఆ గురువులు తమ తమ శిష్యులకు/ శిష్యురాళ్ళకు యథావిధిగా పూజనీయులే ఔతారు, పరిచరణీయులే అవుతారు. అయితే ఒకపక్క ఆ సంబంధాన్ని కలిగి ఉంటూ మఱోపక్క ఆ సంబంధం తమ మధ్య లేదన్నట్లు బహిరంగ ప్రదర్శన ఇవ్వడం మాత్రం భగవంతుని దృష్టిలో కుటిలత్వమూ, మహాపాపమూ అవుతుంది.

భార్యకు భర్త గురువైనట్లే, భార్య కూడా భర్తకు గురువు కావచ్చు. అంతమాత్రాన ఆమెతో కాపరం చేసే అర్హతని భర్త కోల్పోడు. అగస్త్యమహర్షి లోపముద్రాదేవి నుంచి ముందు శ్రీవిద్యోపదేశాన్ని పొంది కొంతకాలం తపస్సు చేసి సిద్ధుడైతేనే గానీ ఆమెని వివాహం చేసుకోవడానికి అర్హత లభించలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే ఆయన భార్య పూర్వాశ్రమంలో ఆయనకు గురువే. అయితే అది వారి దాంపత్యజీవితానికి ఏ విధంగానూ ఆటంకం కాలేదు.

అయితే ఈ వివరాల్ని ఈ కాలపు పురుషద్వేషులైన స్త్రీల వాదానికి ఉపబలకంగా తలవడం సరి కాదు. ప్రాథమికంగా వారి వాదాన్ని హిందూధర్మం ఆమోదించదు. ఈ పైన పేర్కొన్న సారాంశం మన సనాతన ధర్మానికి సమ్మతమైనదే. ఇది సత్యం కనుకనే ఇక్కడ చెప్పబడింది.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి