30, జనవరి 2012, సోమవారం

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?-4 (సమాప్తం)

మూడో సభ్యుడు :


....గారూ ! మీ పాయింట్ నాకర్థమయింది. కానీ నా పాయింటే మీకర్థం కాలేదు.
మన సంస్కృతి పూర్తిగా బయటినుంచి వచ్చినదని నేనసలు అనలేదు. నేనలా అంటే నాకూ రోమిలా ధాపర్ లాంటి మార్క్సిస్టులకీ తేడా ఉండదు. నేనన్నది - ఈసంస్కృతి లేదా మతం ఒకప్పుడు అంతర్జాతీయ జీవనవిధానం గనుక ఇది ఒకప్పుడు ఒక అంతర్జాతీయ co-operative effort కావచ్చునంటున్నాను. ఈరోజు అనేక నాగరికతల సమాచారం క్రమక్రమంగా వెలుగులోకి వస్తున్నది. దక్షిణ మఱియు మధ్య అమెరికాలలో బయటపడ్డ వాస్తూ, శిల్పాలూ పోల్చిచూసి మాయా, ఇన్కా నాగరికతలు కొంపదీసి హైందవం కాదు గదా ? అనే సందేహానికి పరిశోధకులు లోనవుతున్నారు. న్యూజీలాండ్ లోని మయొరి తెగవారు పూజించే నూకాల్ అనే దేవత పేరుని బట్టి వీరికీ నూకాలమ్మని పూజించే తెలుగువాళ్ళకీ ప్రాచీనకాలంలో ఏమైనా సంబంధం ఉందా ? అని కూడా అనుమానిస్తున్నారు. అలాగే ఆఫ్రికాలో Blacks మాట్లాడే ఒలంగ్ భాష ప్రాచీన తెలుగే కావచ్చునని కూడా సందేహిస్తున్నారు.



అంటే సంస్కృతులూ, నాగరికతలూ తామిప్పుడు ఎక్కడ ఉన్నాయో పూర్వకాలంలో కూడా అదే చిరునామాలోనివసించేవి అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పలేం. ఎక్కడో ఇజ్రాయేల్ లో పుట్టిన ఓల్డ్ టెస్టమెంట్ ని జపాన్ లో క్రైస్తవుడు చదువుతాడు. ఒకవేళ భవిష్యత్తులో ఇజ్రాయేల్ లో జనమంతా ఓల్డ్ టెస్టమెంట్ ని మర్చిపోయిన తరువాత కూడా జపాన్ లో దాని పారాయణ కొనసాగుతుంది. ఆ తరువాత "ఓల్డ్ టెస్టమెంట్ కి జన్మస్థానం జపానే" అని జనం అనుకోవడం మొదలు పెడతారు. హిందూమతాన్ని అనుసరించే బాలిద్వీపం (ఇండోనీశియా) లో బ్రహ్మపురాణం తప్ప వేఱే పురాణం తెలీదు. ఇండియాలో బ్రహ్మపురాణం పేరు తెలుసు గానీ దాన్ని చదివేవాళ్ళెవఱూ లేరు. అంతమాత్రాన బ్రహ్మపురాణానికి బాలిద్వీపమే మూలస్థానం అనుకోలేం కదా ?



అందుచేత జనంలాగే సంస్కృతులు కూడా వలసపోతాయి. జనంతో పనిలేకుండా, ఒంటరిగా కూడా వలసపోతాయి. జాతులు సంపూర్ణంగా అంతరించిపోయినాక కూడా వారి సంస్కృతి ఇంకో జాతి ద్వారా కొనసాగించబడుతుంది. సంస్కృతం మాట్లాడిన ఆర్యులు ఈరోజు లేకపోయినా వారి సంస్కృతిని మనం భుజాన వేసుకున్నట్లే. అయితే ఆ ఆర్యులసంస్కృతి కూడా పూర్తిగా వారి స్వామ్యమే కాకపోవచ్చు. వారికి పూర్వం వారి సాంస్కృతిక పితలు వేఱే ఎవఱైనా ఉండి ఉండొచ్చు. అలాగే ఈ జాతి కొనసాగకపోయినా, దీని సంస్కృతిని ఇంకో దేశమేదైనా భుజాన వేసుకుంటుంది.



ఇది ఒకప్పుడు అంతర్జాతీయ జీవనవిధానం గనుకనే ఏ ఇతర దేశాల మతాల్లో గానీ,
సంస్కృతిలో గానీ గోచరించని భావసహిష్ణుత, వాదసహిష్ణుత, విశాలదృక్పథం ఈ మతంలో కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. అలా కాక ఇది ఇతర మతాల్లా మొదట్లో ఒక స్థానిక భూఖండానికి పరిమితమైన నమ్మకం అయితే వాటిలాగే ఇది కూడా పరమ సంకుచితంగా, ద్వేషమయంగా ఉండి ఉండేది.


తొమ్మిదో సభ్యుడు :


నా పరిశోధనలో నాకు మొట్టమొదటి అడ్డంకి సంస్కృతము తెలియకపోవడం. ఆంగ్ల అనువాదాల మీదా, తెలుగు/హిందీ అనువాదాల మీద ఆధారపడటం. ఎవరైనా నా ఈ సమస్యను తీరిస్తే/నేర్పిస్తే నేను మఱింత శొధించగలను. పైగా PIE సిధ్ధాంతం ఎలాగో వాదనలో ఉంది. దీని వలన మఱింత అడ్డంకి.



ఐతే నా పరిశోధనలకి నేను ఎంచుకునే అంశాలు కూడా ఉన్నాయి.



1. జెనెటిక్ స్టడీస్


2. ఆర్కియాలాజికల్ స్టడీస్


3. సాంస్కృతిక పరంపర


4. ఋగ్వేదం లోని ముఖ్యమైన అంశాలు


5. సంస్కృతము (భాష ప్రయుక్త పరిశోధన)


6. భౌగోళిక జ్ఞానం


7. పరంపరాగతంగా వస్తున్న కథలు, చరిత్రలు



మీ పాయింటు నాకు అర్థమయింది. కాకపోతే నేను చెప్పబోయే అంశాలు పై వ్యాసం అంతా రాయకపోతే సరిగ్గా చెప్పలేనేమో అని ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది నాకు. మీ పాయింటుకే వస్తున్నాను నా తదుపరి వేగులో.



మీరన్నట్టు అంతర్జాతీయ సహకార యత్నమే అయినప్పటికి దాని వలన ఉపయోగం ఏముంది ? నష్టముందో లేదో నాకు తెలీదు కాని హైందవ సిధ్ధాంతాలని పరిరక్షించుకోవాలంటే, దీని ఆనవాళ్ళు ఇతర చోట్ల ఉన్నాయి అన్న వాదనను తోసిపుచ్చాలి. నేనోసారి ఒక పాకిస్తానీయుడితో సంభాషించాను. మన ఆలయాలపై జరిగిన దాడి గురించిచర్చిస్తున్నప్పుడు అతని సమర్థింపు నాకు నచ్చలేదు కాని అతను చెప్పిన విషయం మాత్రం నాకు నచ్చింది ఎందుకంటే అది అతని తరపు వాదన. అందులో నిజాన్ని నిర్దాక్షిణ్యంగా త్యజించాడు. (నేను అతనిలా కాదు లేండి. మీరన్నట్టు తెఱుపుడు మనసుతోనే అంగీకరిస్తున్నాను పరిశోధిస్తున్నాను). కాబట్టి నేను అటువైపుగా (మీ పాయింటు వైపు) అంత దృష్టి సారించలేదు కాని కొంత హింట్ నా దగ్గఱ ఉంది.



నేను భాష ప్రయుక్త పరిశోధన మీద ఎక్కువ మక్కువ చూపించలేదు. ఎందుకంటే దీని వలన ఎన్నో సమాధానాలు దొరకని సవాళ్ళు వెళ్ళడవుతాయి. వాటన్నికి తర్కం లేని అనుకోలు జోడించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. వేదయుక్తమైన సంస్కృతము ఇప్పుడు చూస్తున్న సంస్కృతం యొక్క పూర్వ రూపం. వేద సంస్కృతము రూపాంతరం చెందిన (క్లాసికల్) సంస్కృతానికి సమకాలీనం కావచ్చు. ఈ మాట అనడానికి ఒక కారణం ఉంది.



పాణిని తన నిర్మాణాత్మక సంస్కృత వ్యాకరణ రచనలో వేదసంస్కృతానికి ప్రత్యేకభాగాన్ని ఏర్పఱిచినారు. వేదంలోని మంత్రాల కొఱకు ప్రత్యేకంగా వేదసంస్కృతాన్ని తయారు జేసినారు. ఈ వేదసంస్కృతానికి ప్రత్యేక వ్యాకరణం ఉంది. ఇది క్లాసికల్ సంస్కృతము కాదు. ఇంతకు మించి నేను భాషాప్రయుక్త పరిశోధన చేయదలచుకోలేదు. ఇష్టమూ లేదు. ఎందుకంటే ఇందులో అనుకోళ్ళు (assumptions) ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మళ్ళీ దారి దొఱకని ఇతర వాదనలకి దారి తీస్తున్నాయి. భాష మీద పట్టు లేకపోవడం వలన నేను దీనిని ఆధారం చేసుకుని మిగతా విషయాలు చూస్తున్నాను. సంస్కృతము గుఱించే నేను చేయలేదు. ఐతే ఇప్పుడు దీని గుఱించి కూడా నా పట్టికలో పెట్టుకుంటాను. తా.....గారూ, మీకు ధన్యవాదములు.



మూడో సభ్యుడు :



మీరన్నది నిజమే. భాషాపరిశోధన ఎక్కువభాగం అనిరూపిత అనుకోళ్ళ (unsubstantiated assumptions) మీద ఆధారపడి ఉంటుంది. దాని బదులు మీరాశ్రయించిన జన్యుపరమైన, పురావస్తుపరమైన లేదా సాంస్కృతిక ఆధారాల మీద ఊనుకోవడం ఎక్కువ సమంజసం.



చరిత్రపూర్వయుగంలో మానవజాతికంతటికీ కలిపి ఒకే మతం, ఒకే ఆధికారిక భాష ఉండేవని Eric von Daniken కూడా అన్నాడు. ఆ మతం సనాతన ధర్మమేననీ, ఆ భాష సంస్కృతమేననీ మనం మొదట్నుంచీ చెబుతూ వస్తున్నాం. అవి ఈరోజున ఈ భూమితో, ఈ జనజాతితో ఐడెంటిఫై చేయబడుతున్న మాట వాస్తవం.



తొమ్మిదో సభ్యుడు :



.....గారూ ! మీ ప్రశ్న కి జవాబు చెప్పడానికి కొంచెం జంకుతున్నాను. .....గారు అన్నట్టు ప్రతీసారి పురాణాలని శాస్త్రీయంగా విశ్లేషించి మన ఋషులను బోనెక్కించాల్సిన అవసరం లేదు. "ఎవరన్నా అడిగితే ఏం చెప్తాం ?" అని మీరు అన్నందుకు ఆలోచించి ఈ ప్రత్యుత్తరం ఇస్తున్నాను. పెద్దలు ఎవరైనా నా విశ్లేషణని సవరించండి, తప్పులుంటే.



1. నా ఉద్దేశంలో మత్స్య, కూర్మ, వరాహ, వామన అవతారాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వామన పురాణం కూడా ఎన్నో వామన అవతారాలను కూడా పేర్కొంది. అందుకే ప్రహ్లాదుడు వామనుడిని దర్శించి పుజించాడని అందులోనే ఉంది.



2. అవతారాల వరుస గుఱించి చెప్పాలంటే, ఇంతకు ముందు గడిచిపోయిన మనువులను కూడా కలుపుకుని భగవంతుడు యే విధంగా సర్వకాల సర్వావస్థలయందూ ఈ భూమి మీద తన కర్తవ్యాన్ని పాలన చేసాడో అని చెప్పడం ఒక కారణం కావచ్చు అందుకే అవి అటు ఇటుగా కనిపిస్తాయి మనకి పురాణాలలో.



3. ఐతే ప్రత్యేకంగా చెప్పబడిన మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు మాత్రం cosmic లేదా ప్రకృతి సంబంధిత అవతారాలు కావచ్చు. అవి పెద్ద పెట్టున జఱిగి ఉండచ్చు. ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహకల్పప్రారంభంలో లేదా గత కల్ప అంత్యప్రళయకాలం నుండి మొదలయి ఉండచ్చు. ఇది నేటి నుంచి కొంచెం పూర్వ దూర కాలపు చరిత్ర గానే పరిగణించాల్సి వస్తుంది. (దీని బట్టి నా వఱకు నా అనుకోలు ఏంటంటే మనం చరిత్రని శ్వేతవరాహకల్పప్రారంభం నుంచి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి అని స్పష్టమవుతుంది.)



4. శ్వేతవరాహకల్పం అంటే బహుశా మహా యుగచక్ర క్రమగమనం వద్ద జఱిగిన వరాహ అవతారమని కదా స్పష్టమవుతోంది. ఇంకొంచెం హేతుబద్ధ శోధన అవసరం ఇక్కడ.



5. మన ప్రభుత్వ భూమినిర్మాణశాస్త్ర అధ్యయనసంస్థ ప్రకారం హిమాలయాల శిఖరాల పైన సముద్ర సంబంధిత శిలా/జీవధాతువుల అవశేషాలు లభించాయి. నాకనిపించింది ఏంటంటే ఒకప్పుడు మన ఉత్తరప్రాంతమంతా సముద్రగర్భంలో మునిగి ఉండేది, హిమాలయాలు ప్రకృతిసహజంగా పైకెత్తబడక ముందు.



హిమాలయాలు నీటిలో మునిగి ఉన్నప్పుడు మత్య్సావతారము. ఇక్కడ నుండి జలప్రాణులు ఉద్భవించినవి కాబోలు (మత్స్య అనేది అర్ధమైంది) . వందల కోట్ల సంవత్సారల క్రితం ఉత్తర హిమాలయాల దగ్గఱ Tectonic upliftment జరిగిందని అంతర్జాతీయ భౌగోళిక పరిశోధన ధ్రువపఱిచింది. ఇది కూర్మావతారం కావచ్చు. అవి సముద్రగర్భం నుండి పైకెత్తబడినప్పుడు వరాహావతారము అంటే ప్రళయం నుండి తిరిగి భూమి ఉద్భవించి కొత్త కల్పానికి నాంది పలకడం. అందుకే శ్వేతవరాహకల్పే అని కదా సంకల్పం చెప్పుకుంటాం. (ఇంతకీ నా విశ్లేషణ ఈ సంకల్పశ్లోకాలతోనే మొదలయి ఈ విధంగా చెప్పగలిగాను).



తెలియాల్సినవి :



1. కూర్మం అని ఎందుకు?


2. వరాహమని ఎందుకు?



మూడో సభ్యుడు :


కొన్ని అవతారాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి కావు. అవి కల్పాంతం దాకా
దేవాలయాలలో అర్చామూర్తుల రూపంలో కొనసాగుతాయి. ఆ రకంగా ప్రహ్లాదుడు వామనుణ్ణి దర్శించే సంభావ్యత ఉంది. ఒక అవతారాన్ని ధరించిన దేవుడు ఆ అవతారం ఇంకా భూమ్మీద ఉండగానే వేఱొక అవతారాన్ని కూడా ఏకకాలంలో ధరించే వెసులుబాటు ఉంది. ఉదాహరణకి - పరశురాముడు - అయోధ్యారాముడు. వేదవ్యాసుడు - శ్రీకృష్ణుడు. అలాగే వరాహమూర్తి - వేంకటేశ్వరుడు.


ఏడో సభ్యుడు :



మన ఋషులను బోనెక్కించడమని కాదు , నా ఉద్దేశ్యమేమంటే, చాలామంది అవతారక్రమాన్ని
జీవపరిణామ క్రమంతో పోల్చి చూడటం చేత, "నాకు మత్స్యావతారం (నీటిలో మొదటి జీవం ), కూర్మ (నీరు-భూమి ఉభయచరం ), వరాహ (భూమిపై మొదటి జీవం ), నారసింహ (మనిషి జంతువు ), వామన (పొట్టిమనిషి ), పరశురామ (మనుషుల్లో మృగరూప క్రూరత్వాన్ని ఉన్నవారందఱిని నాశనం చేసినవాడు ), రామ (పరిపూర్ణ మనిషి ), కృష్ణ (మనిషికి సామాజికజీవనంలో ఎలా జీవించాలో మార్గదర్శనం) ఇలా పరిణామక్రియలన్నీ మనవాళ్ళు వివరించారు అని అనిపిస్తోంది.


"అదే సరైన క్రమం" అని చాలామంది నిర్ధారించేసుకుంటున్నారు, దానికి భిన్నంగా ఱేపు ఎవఱైనా కొంత ఆలోచన ఉన్నవాడు, నేను చెప్పిన విషయాన్నే ఉదాహరణగా చూపించి, "ఇదంతా అబద్దం, ఇది బ్రాహ్మణులు చేసిన అతుకుల బొంత" అంటే సమాధానం చెప్పగల ప్రామాణిక పరిశోధన కావాలి అని.


మీరన్న విషయాన్నే తీసుకుందాం,



ఏ కల్పం అయినా వరాహమూర్తి మాత్రమే భూమిని ఉద్ధరిస్తారు,అంటే ప్రతీసారీ ఒక కొత్త వరాహకల్పం మొదలౌతుందా? అన్ని కల్పాలు వరాహ కల్పాలేనా(వామన పురాణం కూడా ఎన్నో వామన అవతారాలను కూడా పేర్కొంది. అందుకే ప్రహ్లాదుడు వామనుడిని దర్శించి పుజించాడని అందులోనే ఉంది. ) ప్రహ్లాదులవారు వామనుడిని దర్శించడంలో తర్కం ఉంది, మానవసంబంధాల ప్రకారం కూడా అది ఒప్పుకోవచ్చు, ప్రహ్లాదుడు, బలికి తాత కాబట్టీ, వామనావతారం బలిని కడతేర్చడానికి వచ్చింది కాబట్టీ.



మఱి ఇదే క్రమంలో ఆలోచిస్తే, మత్స్యం,వరాహ, నారసింహ,కూర్మ, వామన .... ఇలా వస్తుంది వరుస..... అప్పుడు మీరు చెప్పిన వివరణ దీనికి అతకదు.

ఎరిక్ వాన్ డానికెన్ రాసిన Chariots of Gods అనే పుస్తకాన్ని మీరు పరిశీలించినట్లైతే చాలా మతాల్లో ఒకే రకమైన కధలూ , పాత్రలూ కనపడతాయి, ఏ రకమైన సంబంధమూ లేకుండా ఇంతింత దూరాల్లో ఉన్న ప్రదేశాల్లో ఒకే రకమైన గాధలు ప్రచారంలో ఉన్నాయంటే ఆలోచించాల్సిన విషయమే కదా. ఎవఱైనా ధ్యానంలో ఈ విషయాన్ని గమనించగలవారెవఱన్నా ఉంటే ప్రయత్నించి తెలుపగలరు....



తొమ్మిదో సభ్యుడు :



మీరు చెప్పేది డార్విన్ సిధ్ధాంతానికి సరిపోతుంది కాని మన పురాణ చరిత్రకి అతకడం లేదు. మానవులు మంచు యుగానికే ఉన్నారు అంతకు పూర్వం కూడా ఉన్నారు. మంచు యుగం 13 వేల సంవత్సరాల క్రితం అంతరించింది. మళ్ళీ భవిషత్తులో వస్తుంది.



"వామనావతారం పొట్టిమనిషి, పరశురాముడు అడవిజాతి లక్షణాలు, రాముడు పరిపూర్ణమనిషి" అంటే వాళ్ళ సమకాలీనుల్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇదొక్కటి కొంచెం చెప్పండి చాలు.



(సమాప్తం)

25, జనవరి 2012, బుధవారం

ఈనీచుడు ఇలా ఇంకోమతం పై వాగుంటే వీడికేగతి పట్టేది ???

హిందూ ఫాసిజమే భారత్‌కు హాని
- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా[andhrajyothy.daily 25.1.012]

'ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా?' (జనవరి 17, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో హిందూ మతంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా హిందూ మత సంస్థలకు, మేధావి వర్గాలకు, ప్రభుత్వానికి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె.అరవిందరావు (పూర్వ డిజిపి) కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అయితే ఈ వ్యాసం మొత్తాన్ని పరిశీలిస్తే అందులో అయన హిందూ ఫాసిస్టు ధోరణి, పోలీసు తత్వం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.

కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం' ద్వారా దేశంలో అంతర్యుద్ధాన్ని పురిగొల్పుతున్నారన్నది అరవిందరావు ప్రధాన ఆరోపణ. హిందూయిజం 'చచ్చి పోయింది లేక చచ్చి పోతోందనే' ఐలయ్య వాదనతో నేను పూర్తిగా ఏకీభవించను. కాని హిందూయిజమే ఈ దేశంలో అన్ని సమస్యలకు మూలకారణం అనే వాదనతో ఏకీభవిస్తాను. ఈ విషయాన్నే ఐలయ్య తన పుస్తకంలో చాలా బలంగా చెప్పారు.

అణగారిన కులాలు, జాతులు ఈ దేశానికి మహోన్నతమైన జ్ఞానాన్ని, ఉత్పత్తిని అందిస్తుండగా అగ్రకులాలు మాత్రం మోసం చేయటమే పెట్టుబడిగా చేసుకొని అణగారిన కులాలను దోపిడీ చేస్తూ వారి జ్ఞానాన్ని వారిది కాకుండా చేశాయి. ఆ శ్రమజీవుల సంపదను వారికి దక్కకుండా చేశాయి. ఐలయ్య తన పుస్తకంలో ప్రధానంగా చెప్పిందేమిటంటే - ఈ దేశంలో జ్ఞానం అజ్ఞానంగా, అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతుంది; దీనిని తిరగరాయటం ద్వారానే అణగారిన కులాల్లో మనో ధైర్యాన్ని నింపగలం. హిందూ మతం పేరుతో ప్రచారమవుతున్న బ్రాహ్మణ వాదాన్ని బొంద పెట్టడం వల్లనే ఇది సాధ్యమవుతుంది.

అనాదిగా ఎన్నో దాడులు ఎదుర్కొన్నా హిందూ ధర్మం/మతం మన దేశంలో ఇంకా బలంగా ఉండడానికి కారణం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన సమన్వయ దృక్పథమే అని అరవిందరావు చెప్పారు. ఇది ఆయన అవగాహనా రాహిత్యమే. ఈ విషయాన్నే చాలామంది పదే పదే ఉటంకిస్తుంటారు. వాస్తవానికి ఆర్యుల తరువాత ఈ దేశంపై దండెత్తి వచ్చిన (పారశీకుల నుంచి బ్రిటిష్ వారి వరకు) ఏ ఒక్కరూ హిందూ మత సంప్రదాయాల్ని కించపరచడం కాని, ధ్వంసం చేయటం కాని చేయలేదు. ముస్లిం రాకతోనే హిందూ మతం పుట్టింది.

అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు. హిందూ ప్రాచీన దేవాలయాలన్నీ ముస్లిం పాలకుల కాలంలోనే నిర్మించబడ్డాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. ముస్లిం పాలకులు కూడా వాటిని ప్రోత్సహించారు. ముస్లింలు రాకముందు ఈ దేశంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదన్న సంగతి చారిత్రక సత్యం. భద్రాచలం రాముల వారి గుడి ఒక ముస్లిం పాలకుని కాలంలోనే నిర్మించబడ్డ సంగతి మరువరాదు.

హిందూయిజానికి ఏ ఫిలసాఫికల్ పునాదులు లేవు. ఉన్నదల్లా హింసాత్మకమైన ఫాసిస్టు ఫిలాసఫీనే. క్రైస్తవం, ఇస్లాం లేక మరి ఏ మతం తీసుకున్నా మానవత్వమే ప్రధాన భూమికగా చేసుకొని నిర్మించబడ్డాయి. ఇస్లాం పవిత్ర గ్రంథమైన 'ఖురాన్'ను చదివితే ఎటువంటి కరుడుకట్టిన తీవ్రవాది (పోలీసు భాషలో) అయినా మానవతావాదిగా మారగలడు.

ఖురాన్‌లోని ప్రతి పుట కూడా ఒక వ్యక్తి ఏ విధంగా మంచి మనిషిగా జీవింపవచ్చో చెబుతుంది. అలానే బైబిల్ కూడా. మరి హిందూ పురాణాలు, భగవద్గీత ఏం చెబుతున్నాయి? హింస, ఆధిపత్యం, అణచివేత, దోపిడీ గురించే వర్ణనలు ఉంటాయి. ప్రతి హిందూ దేవుడు ఎవరో ఒకర్ని (శూద్రులను) చంపటానికే పుడతాడు.

హిందూయిజంలోని ఈ హింసాత్మక స్ఫూర్తే ఈ దేశానికి ప్రధాన శత్రువు. కంచ ఐలయ్య మాత్రం కాదు. ఈ దేశంలో టెర్రరిజానికి మొదట పునాదులు వేసింది హిందూయిజమే. పోలీస్ డిజిపిగా పనిచేసిన అరవిందరావుకు ఈ విషయం తెలియదని నేను అనుకోను. జాతీయోద్యమకాలంలో వచ్చిన తీవ్రవాదానికి స్ఫూర్తినిచ్చింది భగవద్గీతయే. జాతీయ తీవ్రవాదులుగా ముద్రపడ్డ తిలక్ మొదలుకొని అరవింద ఘోష్ వరకు హిందూ ఫాసిస్టు హింసతోనే స్ఫూర్తి పొందారు. చివరకు జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చింది కూడా ఒక హిందూ ఫాసిస్టు అన్న విషయాన్ని మరువకూడదు. ఈ ధోరణులు రోజురోజుకు విస్తరించి, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి.

హిందూ మతం ఉదార తత్వాన్ని చూసి మనమందరం గర్వ పడాలంటారు అరవిందరావు. హిందూ మతంలో ఉదారత ఉంటే ఈ రోజు దేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు ఎందుకు అభద్రతా భావంతో జీవిస్తున్నారు? ఎందుకు వారిపై ప్రతిరోజు ఏదో ఒక మూలన దాడులు జరుగుతున్నాయి? అసలు వారి సంస్కృతిని, చరిత్రను సమానంగా గౌరవిస్తున్నామా? హిందూయేతర మతస్థుల చరిత్ర, సంస్కృతి గురించి మన పాఠశాలల్లో మచ్చుకైనా బోధిస్తున్నామా?

ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. పరమతాన్ని గౌరవించే చరిత్ర హిందూ మతంకు లేదు. బౌద్ధ మత వ్యాప్తిని చూసి తట్టుకోలేక పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సేనాని చివరి మౌర్య చక్రవర్తిని హతమార్చాడు. చంపింది ఒక్క చక్రవర్తినే కాని ఈ సంఘటన మహత్తరంగా విరాజిల్లుతున్న బౌద్ధ మతాన్ని తుద ముట్టించి బ్రాహ్మణ వాదాన్ని పునర్నిర్మించింది. ఈ పునాది మీదనే గుప్తులకాలంలో బ్రాహ్మణుల స్వర్ణయుగం విలసిల్లింది.

ఇటువంటి సంఘటనలు హిందూ పురాణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ పురాణాలు కట్టు కథలే అయినప్పటికీ వీటి ప్రభావం భారత సమాజంపై చాలా బలంగా ఉంది. ఈ కథలన్నీ శూద్ర, అతి శూద్ర, ఆటవిక జాతులను, స్త్రీలను అణచి వేయటానికే రాయబడ్డాయి. ఒక ఆటవికుడు విలువిద్యలు నేర్చుకోవద్దని ఏకలవ్యుడి బొటన వేలును నరికి వేయించటం, ఒక శూద్రుడు వేదాలు చదువకూడదనే ఆంక్షతో శంభూకుడిని హతమార్చడం, ఒక శూద్రుడు పాలకుడు కాకూడదని బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

మరి అణగారిన కులాలు, జాతులు ఏమని గర్వపడాలి? వారి వంశీయులను మట్టుబెట్టిన హిందూ ఫాసిజంను చూసి గర్వపడాలా? అసలు అరవిందరావు బ్రాహ్మణుడుగా హిందూ పురాణాలను చూసి గర్వపడగలరా? గర్వంగా చెప్పుకోదగిన ఒక్క హిందూ దేవుడైనా ఉన్నాడా? శ్రీరాముడు ఏ విధంగా కౌసల్యకు జన్మించాడో వారి పిల్లలకు చెప్పగలరా?

అంతా ఎందుకు వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకొని కుటుంబ సమేతంగా వినగలరా? మన ఊరి భాషలో చెప్పాలంటే రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు. ఈ కథలు మన పిల్లలకు చెప్పితే మన ఆడపిల్లలు బైట తిరగగలరా? ఈ పురాణాలన్నీ అణచివేత గూర్చి చెప్పుతుంటే వీటిని చూసి ఎలా గర్వపడగలం? హిందూయిజంకు ప్రజాస్వామిక పునాదులు లేకపోవటం వల్లనే విదేశాలకు వ్యాప్తి చెందలేక పోవటమే కాక దేశంలోనే కోట్లాది ప్రజలకు దూరంగా ఉంది.

ఐలయ్య ఎందుకు హిందూ మతాన్నే నిందిస్తున్నారని అరవిందరావు ప్రశ్నించారు. మేధావులు కులానికి, మతానికి, దేశానికి అతీతంగా ఆలోచిస్తారు. అయితే ఒక వరవడి ఏమంటే దోపిడీకి, పీడనకు గురవుతున్న ప్రజల పక్షాన నిలబడుతారు. అలా నిలబడే వారిని 'ఆర్గానిక్ ఇంటలెక్చ్యువల్' అంటారు. ఐలయ్య ఈ కోవకు చెందినవారు. హిందూ ఫాసిజంకు బలవుతున్నది అణగారిన కులాలు, ముస్లిం, క్రైస్తవులే కాబట్టి ఐలయ్య టార్గెట్‌గా హిందూయిజమే ఉంటుంది.

దళిత ఉద్యమాలను, మానవహక్కుల ఉద్యమాలను అరవిందరావు పరోక్ష యుద్ధంతో ముడిపెట్టి చూడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. అది ఆయన తప్పుకాదు. మన విద్యా విధానం తప్పు. మన విద్యా విధానం మనల్ని మనుషులుగా తీర్చిదిద్దడం లేదు. కేవలం ఆడ్మినిస్ట్రేటర్స్, టెక్నోక్రాట్స్‌గా తయారుచేస్తుంది. మరో వైపు ఈ దేశ మతంగా ప్రచారం పొందుతున్న హిందూయిజం మానవతా విలువలకు దూరంగా ఉంది. ఈ పరిస్థితుల నుంచే దళిత, మానవ హక్కుల ఉద్యమాలు వచ్చి ఈ దేశంలో అంతరిస్తోన్న మానవ విలువలను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.

విచిత్రం ఏమంటే మానవహక్కుల గూర్చి అడిగితే రాజ్యం, వారిని ఫాసిస్టులు, టెర్రరిస్టులుగా ముద్ర వేస్తుంది. ఈ ఉద్యమాలు దేశాన్ని, జనాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. విచ్ఛిన్నమయిన బతుకుల్లో కొంత ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయి. ఒక విధంగా రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక విలువలను, హక్కులను ప్రజల్లోకి తీసుకొనివెళ్ళి వారికి ఈ వ్యవస్థ మీద కొంత నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ఉద్యమాలే లేకుంటే ఐలయ్య చెప్పే అంతర్యుద్ధం ఈ దేశంలో ఇప్పటికే వచ్చి వుండేది.

అరవిందరావు చెప్పినట్లు విదేశీ విచ్ఛిన్నకర శక్తులను దేశంలోకి ఆహ్వానిస్తున్నది దళిత, మానవ హక్కుల సంఘాలు కాదు. ఈ దేశ బడా పెట్టుబడిదారులు, హిందూ ఫాసిస్టులే ఆ పనిచేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నది ఎవరు? ఈ రోజు ప్రజల జీవితాలను ధ్వంసం చేస్తున్నది బహుళజాతి సంస్థలు కాదా? అణు ఇంధన సహకార ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం కాదా? పౌర ప్రయోజనాలకు ఉద్దేశించిన అణు ఇంధన సాంకేతికతలను సైనిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమనేది చాలా సులువన్న విషయం అరవిందరావుకు తెలియందికాదు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా? రేపు అమెరికా మన దేశంపై అణ్వస్త్ర దాడి చేస్తే దిక్కెవరు? ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తున్నది హిందూ ఫాసిస్ట్‌లు, పెట్టుబడిదారులే అన్న విషయం అరవిందరావు గుర్తించాలి. దళిత, మానవహక్కుల ఉద్యమాలు ఈ దేశంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి.

- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ


[ విదేశీ బిస్కెట్లకాశపడి మాతృభూమిని,సంస్క్రుతి ని నాశనమొనర్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఊరుగుక్కలు ,గుంటనక్కలు తాముచేస్తున్న దౌర్భాగ్యపు పనులను ఇతరులపై ఎలా ఆపాదిస్తారో తెలుసుకోండి . ఇలాంటీవారికి కనీసపత్రికావిలువలుకూడా పాటించకుండా అవకాశమిస్తూ మనలను అవమానిస్తున్న యాజమాన్యాలకు మీ నిరసన తెలుపండి . అదే ఇతరమతాలపై ఎవరన్నా పైవిధంగా దాడిచేస్తే ఇప్పటికే ఏంజరిగి ఉండేదో మనందరికీ తెలుసు . ఈవ్యాసం ప్రచురించినందుకు మనసులో బాధకలిగిన ప్రతి ఒక్కరూ కనీసం సదరు పత్రికాధిపతులకు తమస్పందనతెలియజేయాలని మనవి . మీస్పందనలను ఆపత్రికకు పంపాల్సిన చిరునామా

ఇదే editor@andhrajyothy.com

పురాతన ఈజిప్టులో శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారా ?-3

పదో సభ్యుడు :



..... గారూ, దేవనాగరికాక వేఱే లిపి అంటే తమిళుల గ్రంథలిపి వంటిదంటారా? నా అసలు ప్రశ్న. మీరు సంస్కృతానికి దేవనాగరి కాక వేఱు లిపి ఉండి ఉండాలి అనుకోవటానికి కారణం నాకు సరిగా అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా?


....గారూ, ఆసక్తికరంగా ఉన్నాయి మీరు చెప్పే విషయాలు. .....గారు అన్నట్టుగా, చాలా క్రొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొనసాగించగలరు.



మూడో సభ్యుడు :



సంస్కృతానికి పూర్వనాగరికతలో - అంటే ప్రళయానికి ముందు - బ్రాహ్మీలాంటిది కాకుండా ఇంకేదో లిపి ఉండి ఉండాలి. అదేంటో దాని యథార్థస్వరూపం మనకి తెలిసే అవకాశం ఇప్పుడు లేదు. సంస్కృతం అంతర్జాతీయ భాషగా గల పూర్వనాగరికత 5,000 సంవత్సరాల క్రితమే నశించిపోయింది గనుక ! ఆ తరువాత మానవజాతి అంతా మొదట్నుంచీ మొదలుపెట్టుకుంటూ రావాల్సి వచ్చింది గనుక ! నా అంచనాలో అది ఈనాటి రోమన్ లిపి లాంటిది. అపరిపక్వదశలో ఉన్న ఈ ఊహల్ని నేనిప్పుడు సిద్ధాంతం చేయలేను. చేయకూడదు కూడా ! కానీ ఎవఱైనా దీనిమీద పరిశొధిస్తే బావుంటుందని కొంత ఇక్కడ వ్రాస్తున్నాను.


రోమన్ లిపిలో అక్షరాలకి ఒక ప్రత్యేక ధ్వనికి కమిట్ కాని పరిప్లవ వర్ణాలు (Dynamic characters) ఉన్నాయి. ఉదాహరణకి - Rama. దీన్ని రామ అని పలకొచ్చు. రమా అనీ పలకొచ్చు. colleague దీన్ని కలీగ్ అనొచ్చు. లేదా కొలీగ్ అనీ అనొచ్చు. put లోని u నే but లో అకారంగా పలకొచ్చు. అలాగే [i] ని ఇకారంగాను పలకొచ్చు. ఐకారంగానూ పలకొచ్చు. ou ని ఓకారంగా, ఉకారంగా, ఊకారంగా, ఔకారంగా ఇన్నిరకాలుగా పలకొచ్చు. Y ని యకారంగానీ పలకొచ్చు


ఈ లక్షణాన్ని సంస్కృత పదాలతోనూ, వర్ణాలతోనూ సరిపోల్చి చూడండి. లేదా ఈ సంస్కృతపదాల్ని రోమన్ లో వ్రాసి చూడండి.


పరిప్లవ - పారిప్లవ

కత - కాత్యాయన

విశేష - వైశేషిక

కురు - కౌరవ

వ్యాకరణ - వైయాకరణ

న్యాయ - నైయాయిక

రామ : -రామో (సంధిలో) = ఎందుకంటే విసర్గ ముందున్న అకారాన్ని హ్రస్వ ఓకారంగా పలకాలి. అలా పలికితేనే ఈ సంధికార్యానికి అవకాశం. (రామొహ్) -


ఇక్కడ ఒకారానికీ, అకారానికీ అభేదం - అచ్చం రోమన్ లిపిలో మాదిరే ! ఈ లక్షణం ఈనాడు ఈ గడ్డమీద మనకి సంస్కృత ఉచ్చారణలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పరిప్లవ ఉచ్చారణ మీద ఆధారపడి సంస్కృతంలో ఏకంగా ప్రత్యయాలే ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. ఆ మొదటి సంస్కృతలిపిని సవ్యంగా (left to right) వ్రాసేవారో, అపసవ్యంగా (right to left) వ్రాసేవారో మఱెలా వ్రాసేవారోమనకి తెలీదు.మొత్తమ్మీద అది అచ్చుల్నీ, హలుల్నీ (vowels and consonants) విదగొట్టి అక్షరాల్ని పక్కపక్కన వ్రాసే తరహా లిపి అని నా ఊహ. ప్రాచీన నాగరికతలో అన్ని సమాచార వినిమయాలూ ఆ పూర్వలిపిలోనే జఱిగుంటాయి. బ్రాహ్మిలాంటి Complex script లో అయ్యుండదు. ఉదాహరణకి భరద్వాజమహర్షి సూచించిన విమాననిర్మాణం ఇత్యాదుల్లో కూడా!


తొమ్మిదోసభ్యుడు :



మీరంటున్నారు "పూర్వం ఎక్కడెక్కడైతే హిందూమతం ఉండేదో అదల్లా భారతదేశం అనుకోవడం సరైన కోణం కాదనుకుంటా. నిజానికి ఈ విషయంలో చాలా confusion ప్రచారంలో ఉంది. " అని ! పై వేగు (mail) లో చెప్పినట్లు ఈ భూమండలం మొత్తం ఒకే నేల, ఒకే ధర్మం, ఒకే సంస్కృతిగా విలసిల్లింది. 19 వ ఇక్ష్వాకు రాజైన అసితుని పాలనలో విధ్వంసాలు చెలరేగాయి. అప్పటివఱకు వసుధైక కుటుంబం. కనుక ఈ భూమండలమంతా హిందూమతమే ఉండేది. దానికి మాతృస్థానం ఈ భరతవర్షమే. విదేశీయులే ఈ మతాన్ని స్థాపించారని మీరు అంటే ఆ స్థాపన ఈ భరతవర్షంలోనే జరిగింది కనుక ఈ సనాతనధర్మం ఈ పుణ్యభూమి నుండే ప్రపంచమంతా వ్యాపించింది అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

మీరు ఆ తరువాత ఇలా అంటున్నారు : "భారతదేశం అనేది ఒక ఆధునిక రాజకీయ పరిభావన. ఇది ఇటీవలి British ideological construct. ఇది ప్రాచీనం కాదు. ప్రాచీనకాలంలో తెలిసినవి భరతవర్షం,భరతఖండం మాత్రమే. అయితే ఇవి రాజకీయ స్వరూపాలూ కావు. సాంస్కృతిక స్వరూపాలూ కావు. భౌగోళికాలు మాత్రమే." అని !


సమయాభావం వల్ల సగం టైప్ చేసి డ్రాఫ్ట్ లో వదిలేసాను. ఇప్పుడు ఇది పూర్తి చేసి మీ తదుపరి వేగుకి సమాధానం ఇవ్వదలచుకున్నాను.



ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా, ఆసేతు హిమాచలం నుండి దక్షిణ కొసల వరకు ఒకే సంస్కృతి భాసిల్లినా, కృష్ణుని కాలంలోను అంతకు పూర్వం కూడా ఈ సువిశాల భూమండలం మొత్తం (వివిధ వర్షాలు, ద్వీపాలు) కూడా సనాతన ధర్మమే మతంగా నిలిచింది అప్పట్లో. ఐతే మీరు అనేది ఈ మతం ఎక్కడో ఉండి ఉండచ్చు అక్కడ అంతరించి ఇక్కడ నిలబడి ఉండచ్చు అని. పాత కాలం రోజుల్లో ఈ విషయం విశ్వాసాల మీద ఆధారపడేది. ఈ కాలంలో బాహ్యస్వరూపాలతో నిరూపిస్తే తప్ప నమ్మరు. కనుకనే నా సోర్సెస్ జెనెటిక్ స్టడీస్, ఆర్కియోలాజికల్ పరిశొధనలే అయి ఉంటాయి.


ఇక్కడ నా వాదనలు అన్ని కేవలం సనాతన ధర్మమే కాదు AIT/AMT కూడా కలుపుకుని విషయాలు వ్రాస్తున్నాను.


ఒక చిన్న ఉదాహరణ చూద్దాం : మన తెలుగునాడు చాలా వైశాల్యం కల రాష్ట్రం. దీని రాజధాని భాగ్యనగరం. మన ముఖ్య పనులకు, చదువులకు, ఉపాధులకు, వర్తకాలకు ఎక్కువగా రాజధాని మీదే ఆధారపడతాం. ఆధారపడటం అనేది పక్కన పెడితే రాజధానితోనే ముడిపెట్టుకుంటాం. చదువులకు రాజధానినే మొదటగా ప్రిఫర్ చేస్తాము. ఇదే విధంగా, ఈ ద్వీపాలు ఉన్నప్పటికి వాటన్నిటికి కేంద్రీకృతమైన వర్షం ఈ భరత వర్షం. ద్వీపం జంబుద్వీపం. భూమండలం మొత్తం ఒకే రాజరికం నడిచిన కాలంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి జ్ఞానులు, ఋషులు తపశ్శక్తితో వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని సరస్వతీనది తీరాన ఈ పుణ్యభూమి పైనే వికసింప చేసారు అని చెప్పవచ్చు. ఐతే వీళ్ళంతా మ్లేచ్చులు అనకూడదు. తపస్సుకి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి తిరిగొచ్చారని కూడా చెప్పవచ్చు. అప్పటికి భౌగోళిక స్వరూపాలు వేరు. ఇప్పుడున్నంత దూరదూర దేశాలుగా అప్పుడు లేవు. పైగా భూమండలం మొత్తం ఒకే సార్వభౌమాధికారం. చాలా వరకు అన్ని దేశాలు దగ్గరదగ్గరగానే ఉండేవి. వలసలు కేవలం తీరాల వెంబడి కాలిబాటనే జరిగేవి కాబట్టి ఒక మనిషి తన జీవిత కాలంలో దూరదూరాలు ప్రయాణించే వారు. వివిధా రాజ్యాలు, రాజులు, వర్షాలు ఉన్నప్పటికి వాటన్నిటికి సార్వభౌమాధికారం ఈ భరతవర్షంలోనే ఉండేది. మిగతా చోట్లా బహుశా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సామంత రాజ్యాలు అయి ఉండవచ్చు. కాని అవన్ని స్వయం ప్రతిపత్తి కలిగినవి కావు. (ఇది ఎలాగో మునుముందు చర్చను బట్టి సాక్ష్యాలతో వివరిస్తాను). ఇంతవరకు మీరు ఒప్పుకుంటారని అనుకుంటాను.


ఒకవేళ పై పాయింట్ మీకు సమ్మతం లేని ఎడల ఇంకో ఉదాహరణ చెప్తాను. రెండు వేల సంవత్సరాలకి పూర్వం క్రీస్తుమతం లేదు. ఇస్లాం అంతకన్నా లేదు. ఈశా అని పిలవబడే వ్యక్తి తన జ్ఞానార్జన కొరకు ఈ నేల మీదనే అడుగు పెట్టాడు. ఈ ధర్మం యొక్క మూలాలు వేరే ఉన్నట్టు అయితే ఆ ప్రదేశాల ప్రాముఖ్యత గుర్తించక పోరు. అక్కడ దర్శించక పోరు. వాటి వివరణ ఈరోజుకి మనం వింటూ ఉంటామేమో.్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భగవంతుని స్వరూపాలు జన్మించారు. అందరికి ఈ ధర్మమూలం ఈ పుణ్యభూమే అని ఇక్కడే వాళ్ళ తపశ్శక్తిని పెంపొందించుకున్నారు.


ముందు చెప్పుకున్నట్టుగా ఈ భూమండలం మొత్తం ఒకే సాదృశ్యం కలిగిన ధర్మం అవడం చేత, ప్రధాన కార్యాలయమయినట్టు వంటి ఈ భరతవర్షం (ఆర్యావర్తం) లోనే చోటు చేసుకున్నాయి. మిగతావన్ని బ్రాంచీలని అనుకోవచ్చుగా. ఇంతవరకు ఈ పరంపర కలియుగప్రారంభం వరకు నడిచింది. భారతంలో కలిసిన దేశాలు దీనితో అనుసంధానించి ఉండేవి. ఒక్కోసారి కొన్ని కలిసేవి కొన్ని విడిపోతూ ఉండేవి. తదనుగుణంగా మ్లేచ్చులవడం, అవకపోవడం జరిగేది.


ఈ ధర్మం బయట నుంచి వచ్చినది కానే కాదు. ఎంత కాలగతిలో కలిసిపోయినా పురావస్తు పరిశోధనలో ఇన్ని సంవత్సరాలుగా వాటి ఆనవాళ్ళు దొరకకుండా ఉండవు. కాని ఇంతవరకు లభించిన ఆనవాళ్ళు అన్నిటికి ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయి. పైగా ఈ దేశంలో లభించిన వాటికన్న పూర్వకాలానివి మాత్రం ఇంతవరకు లభించలేదు. పరిశోధనలు మన దేశంలో సాగనివ్వడం లేదు కాని ప్రపంచం అంతా తేలికగా చేయగలుగుతున్నారు. అంత సారూప్యత కలిగిన శోధనల్లో తేలనివి వాటికి వేదం యొక్క పుట్టుపూర్వోత్తరాలలో భాగం ఉండటం లేదా ఇవి అక్కడ నుండే ఇక్కడికి వలస వచ్చాయి అనడానికి ఆస్కారం ఎంత మాత్రం లేదు.



(ఇంకా ఉంది)

24, జనవరి 2012, మంగళవారం

భారతీయిజం

బుద్ధి బలం గల బ్రాహ్మణిజం ఒక ఆధ్యాత్మిక మార్గం. అది మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల ద్వారా కుల, వర్ణ రహిత జ్ఞానానికి పెద్దపీట వేసి మానవ సమాజాన్ని కర్మబద్ధంగా నడిపిస్తోంది. కాలాంతరంలో కండబలం తోడయి జ్ఞానదీపం కొడిగట్టి మసకబారుతూ అజ్ఞానంలోకి జారిపోతోంది. నిష్ప్రయోజనంగా మారింది. అందుకే బుద్ధి బలం, కండబలం సమాంతరంగా దేని పని అది చేసుకుపోవాలే తప్ప బుద్ధిబలాన్ని కండబలం శాసించడం మానవ జాతి నాశనానికి దోహదమవుతోంది.


మొదట బుద్ధిబలానికే పెద్ద పీట. ఆలోచన నుండే ఆచరణ సాధ్యం. ఆలోచనే కార్యరంగానికి మూలం. శాస్త్రం ఆలోచన ఎప్పుడూ లోక కల్యాణానికే దోహదపడుతుంది. అదే మన భారతీయ శాస్త్రాలకున్న ఇజం. ఆ దిశలోనే ఆచరణ కూడా కొనసాగాలి. మతాలు మానవ మనుగడకే కాని మారణ హోమానికి కాదు. హిందూమతం లేదా సంస్కృతి ఎల్లప్పుడూ మంచి, చెడులను విశ్లేషించి మంచిని ఆశ్రయించి కొనసాగించమని బోధిస్తోంది. నిర్గుణోపాసననే అంతిమ లక్ష్యంగా చేసుకొన్న హిందూ ఆధ్యాత్మికత సగుణోపాసనతో అభ్యసించి తన గమ్యాన్ని చేరుకుంటుంది.

తనకు కనపడే బుద్ధిజీవి మానవుడు కాబట్టి సగుణోపాసనలో దైవానికి కూడా మానవరూపాన్ని ఆపాదించి ముఖానికంటే పాదాలకే అధిక ప్రాధాన్యత నిచ్చి, శ్రీ చరణాలను ఆశ్రయించి మోక్షాన్ని ఇవ్వమని వేడుకుంటోంది. శాస్త్రాలను నిషేధిస్తే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఏర్పడదు. అసలు ఆధ్యాత్మికత అనే పదానికి ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం అనే పదాలు జోడించడమే అవివేకం. మన సంస్కృతిలో ఆధ్యాత్మికత అనేది ఒక అనిర్వచనీయమైన భావన. తనని తాను మరిచిపోయి పరమాత్మలో లీనమవడమే ఆధ్యాత్మికత. సకల సృష్టినీ సమభావంతో చూడడమే ఆధ్యాత్మికత.

శాస్త్రాలు ఎప్పుడూ ఖచ్చితత్వాన్ని పాటిస్తాయి. కాలానుగుణంగా మనం ఉపయోగించుకోవాలి తప్ప అసూయ, అహంకారంతో విమర్శించి మరింత అజ్ఞానంలోకి పడిపోకూడదు. హిందూమతమంటేనే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు. ప్రస్తుతం మనమనుకొంటున్న సైన్సుకు మూలం మన వేదాలే అనే విషయాన్ని తెలుసుకోనంత కాలం మనం అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటాం.

ఖగోళం, అంతరిక్షం, శక్తి, ప్రాణం, ప్రయాణం అనే బీజభావాలకు నాంది వేదాలే కదా! మాతృప్రేమలో మలినం ఉండదు. బిడ్డ ప్రేమలో మలినం ఉండొచ్చు. వేదాలు తల్లిలాంటివి. మానవుడే మాతృహింసకు పాల్పడి రాక్షసునిగా మారుతున్నాడు. మాతృప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం తెలియకున్నాడు. ఇంద్రియం నుండి మానవజాతి జనించింది కాని అవయవాల నుండి కాదు. వేదాలు, భగవద్గీతలో కులాల గురించి ప్రస్తావించలేదు. నాల్గవ అధ్యాయం జ్ఞాన యోగంలో

చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః |
తస్యకర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయమ్ ||

అని కృష్ణభగవానుడు వివరించాడు. మానవులలో స్వాభావికంగా ఉండే ప్రకృతి గుణముల నుండి పుట్టే కర్మల ననుసరించి మానవజాతిని నాలుగు వర్ణ విభాగాలుగా పేర్కొన్నాడు తప్ప పుట్టుక నుండే కులము, వర్ణము ఏర్పడతాయని కాదు. మానవుడు ప్రకృతిలో ఒక భాగం. తమ గుణాలను తద్వారా కర్మలను సంస్కరించుకొంటూ భగవానుడు పేర్కొన్న చాతుర్వర్ణాలతో స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చు. ప్రకృతిని ఆరాధించిన బుద్ధి వశం చేసుకొనే దశకు చేరింది.

ఈ పరిణామ క్రమంలో వర్ణాశ్రమ ధర్మాలను విడనాడి కులమతాల ఉచ్చులో బిగుసుకుంటున్నాము. పాలకుల చట్టాలు కూడా మరింత విభేదాలు, అంతరాలను ప్రోత్సహించేవిగా ఉండడం మన దురదృష్టం. సమాజ సంస్కరణ వాదులు ముందు కులమతాల ప్రాతిపదికన ఉన్న, వస్తూన్న చట్టాలను ప్రతిఘటించి సమాజ స్థాపనకు కృషిచేయాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన సంస్కృతి బోధించిన వసుధైక కుటుంబ భావన నెరవేరుతుంది. అంతే తప్ప సంకుచిత దృష్టితో, ద్వంద్వ భావాలతో రంధ్రాన్వేషణలు చేసినంతకాలం అరాచకం తాండవిస్తూనే ఉంటుంది.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు

నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో...

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి