14, ఫిబ్రవరి 2012, మంగళవారం

శ్రీరామరాజ్యం చలనచిత్రం యొక్క ఆర్థిక పరాజయం

ఇటీవల ఒక గూగుల్ గుంపులో జఱిగిన చర్చ

ఒక సభ్యుడు

మిత్రులారా ! నేను సర్వదా ఆధ్యాత్మిక/ పౌరాణిక చలనచిత్రాల విజయాన్ని కోరుకుంటాను. కానీ నేను శ్రీరామరాజ్యం చూడలేదు. కొన్నిరోజులు పోయినాక ఎలాగూ CDs వస్తాయి గదా ! ఇంట్లోనే చూసుకుందామని ! అయితే ఆ సినిమా ఎక్కువ ప్రదర్శనాకేంద్రాల్లో బాగా ఆడలేదని వార్తలొచ్చాయి. దాని నిర్మాత నష్టాల్లో ఉన్నాడని కూడా చెబుతున్నారు. ఇది విన్నాక ఒక రామభక్తుడుగా నాకు బాధ కలిగింది, "ఇలా ఎందుకు జఱిగిందా ?" అని ! 

౧. బాపులాంటి దర్శకేంద్రుడు, నందమూరి బాలకృష్ణలాంటి జనరంజక కథానాయకుడూ పనిచేసిన ఈ చలనచిత్రం ఎందుకిలా అంచనాలు తప్పింది ? వయోవృద్ధత్వం వల్ల బాపుగారిలో దర్శకత్వపటిమ మందగించిందా ? లేదా అదే కారణం చేత బాలకృష్ణ ఆ పాత్రకి సరిపోలేదా ? లేక బాలకృష్ణ మూర్తిమత్త్వానికి (image) ఆ పాత్ర సరిపడలేదా ? లేక ప్రజలు "లవకుశ" రామారావుగారితో బాలకృష్ణని పోల్చుకొని తిరస్కరించారా ? 

౨. అంతకంటే ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మిక, హిందూవాసనలు తగ్గిపోతున్నాయా ? ఆద్యంతమూ కుసంస్కారభూయిష్ఠమై, ఒక సాధారణ మగవాణ్ణి భగవంతుడిలాంటి సర్వశక్తిమంతుడిలా చూపిస్తూ తప్పుడు సందేశాలిచ్చే దూకుడు, బిజినెస్‌మాన్‌లాంటి చెత్తాగ్రేసరాలకి రోజుకు రు.50 లక్షలూ, కోటి, రెండుకోట్ల చొప్పున వసూళ్ళు కావడమేంటి ? మన నిజమైన సాంస్కృతిక మహాపురుషుల జీవితచరిత్రలు ఇలా బోల్తాపడడమేంటి ? జనాల్లో ఆదర్శవాదం తగ్గిపోతోందా ? తప్పుడు నమూనాపాత్రల (false role models) వెంటపడుతూ సిసలైన ఆదర్శపురుషుల్ని బుట్టదాఖలా చేసే స్థాయికి వీళ్ళు దిగజాఱిపోయారా ? అంటే 'లవకుశ' కి అఖండవిజయాన్ని చేకూర్చిన అలనాటి ప్రేక్షకుల తరం దాటిపోయి ఇలాంటి అప్రయోజక తరం మనకి సంప్రాప్తమయిందా ? 

౩. ఏ సినిమాకైనా ప్రేక్షకురాళ్ళ ఆదరణ కీలకం. ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మ లాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ? వీళ్ళు మన అంచనాలకి మించి జనంలోకెళ్ళి విజయం సాధించారా ? వీళ్ళ విజయం ఈ సినిమా పరాజయం రూపంలో వ్యక్తమవుతోందా ? 

ఆలోచించండి.

రెండో సభ్యుడు 

ఒకటి - ఆధ్యాత్మిక భావాలు జనంలో సన్నగిల్లుతున్నాయి అనడానికి సందేహించనక్కరలేదు. గుంపులుగుంపులుగా కనపడుతున్న భక్తసందోహాలలో ఎక్కువగా భయమే తప్ప భక్తి కనిపించడం లేదు. మనసున భక్తి నిండివున్న నాటితరంలో లవకుశకున్న ఆదరణ నేడు లేకపోవడానికి ఇదొకకారణం. గతంలో మాస్ హీరోలుగా గుర్తింపున్న జూనియర్ ఎన్ టి ఆర్ , అల్లు అర్జున్ శక్తి, బద్రి  చిత్రాల పరాజయంలో  ఏదో హైందవవ్యతిరేకుల పాత్రకూడా ఉండవచ్చనిపించింది . ఎందుకంటే అవి హైందవభావాల ప్రచారంతో కూడుకుని ఉన్నాయి కనుక . ఇక రామాయణం లాంటి మహాకావ్యాన్ని తెఱకెక్కించేటప్పుడు నాడు ఉన్న నటులలో దైవభక్తి పరాయణులు మమేకమై నటించారు. నేడు కేవలం డబ్బుకు నటించే వారి వల్ల పవిత్రభావాలు పలికించటం దర్శకులకు వీలుకాలేదేమో ననే అనుమానం ఉంది.

మూడోసభ్యుడు

 జనం ఆధ్యాత్మిక భావాల్ని కేవలం గృహస్థానికే పరిమితం చేసుకున్నట్లుగా గోచరిస్తుందండి. చలనచిత్రాల విషయంలో ఐతే కుటుంబసమేతంగా వెళితే రూ500/ అంతకంటే ఎక్కువ అవుతుంది. చిత్రనిర్మాణవ్యయం కూడా ఆధ్యాత్మిక మఱియు చెత్తాగ్రేసరాలకి  చాల వ్యత్యాసం ఉండటం , టికెట్ ఖరీదు మఱియు నమూనానటుల పారితోషికాలు  తగ్గితేనే కానీ పౌరాణిక చిత్రాలకూ , కుటుంబకథాచిత్రాలకూ మళ్ళీ ఆదరణ రాదు. 

నాలుగో సభ్యుడు

బద్రి, శక్తి సినిమాల పరాజయానికి కారణం, బలహీనమైన కధ, అతి బలహీనమైన కధనం. ఇక శ్రీరామరాజ్యం సినిమాకి వచ్చేసరికి, చిత్ర నిర్మాణ వ్యయం బాగా ఎక్కువ అవడం వల్ల ఆర్ధికంగా పరాజయం పాలయ్యి ఉండవచ్చు. కానీ చాలా చోట్ల ౫౦ రోజులు దాటి ఆడింది. ప్రస్తుత మల్టీప్లెక్స్ థియేటర్ల కాలంలో ఒక తెలుగు సినిమా ౫౦ రోజులు ఆడిందంటే అది చాలా బాగున్నట్లే. మన తెలుగు సినిమాలలో భారీ చిత్రాలు విజయం సాధించాలంటే అందుకు తగ్గ స్టార్‌డమ్ ఉన్న కధానాయకులు కూడా ఆ సినిమాలకు అవసరం. "32 కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాకు సరిపడా స్టార్‌డ‍మ్ బాలకృష్ణకు ఉందా ?" అంటే అనుమానమే!!!

ఐదో సభ్యుడు


ఇవన్నీ కాక, నాకు మఱొక కారణం కూడా కనబడుతోందండీ. అది, మనలాంటివారిలోనే (నాతో కలుపుకుని) తరువాత తీఱిగ్గా ఇంట్లో చూద్దాంలే అని సినిమాతెఱపై చూడకపోవటం.

ఆఱోసభ్యుడు

౧) మెటీరియలిజమ్ 
౨) విలువలు మారడము 
౩) సెక్యులరైజేషన్ ఆఫ్ హిందువులు 
౪) సెక్యులర్ ఎడ్యుకేషన్ 
౫) కొత్త జెనరేషన్స్ 
౬) Saturation of Entertainment Industry (Cinema, TV, Internet, YouTube,Smart Cell Phones, Texting, etc) 
౭) ఇతరములు 



ఏడో సభ్యుడు

"ఈ పరాజయం వెనుక భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి పాపులారిటీని దెబ్బకొట్టిన రంగనాయకమ్మలాంటి మార్క్సిస్టు, ఫెమినిస్టు శక్తుల పాత్ర ఎంత ?" అని ప్రశ్నిస్తున్నారు మీరు.

భగవంతునికి పాపులారిటీయా? దాన్ని మానవమాత్రులు దెబ్బకొట్టడమా?

మొదటి సభ్యుడు 

ఆర్యా !  ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ గత దశాబ్దాల్లో భగవదవతారాల్లో ఒకదాని మీద విస్తారంగా దుష్ప్రచారం చేసిన మాట వాస్తవమే కదా ? ఆ ప్రచారానికి తలొగ్గి చాలామంది నాస్తికులై రాములవారిని పూజించడం మానేసిన మాట కూడా వాస్తవమే కదా ? ఒకప్పుడు రాష్ట్రమంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో జఱపబడ్డ శ్రీరామనవమి, దాని కోసం వేసిన పందిళ్ళూ, ఆ 9  రోజుల కార్యక్ర్తమాలూ ఈనాడు సంపూర్ణంగా అదృశ్యమైపోవడానికి కారణం ఈ ప్రచారం కాదా ? ఈ ప్రచారంతో తెలుగుస్త్రీల మనసుల్ని కలుషితం చేయడం విజయవంతంగా జఱిగింది కదా ? ఎంత భగవంతుడైనా ఈ దుష్ప్రచారానికి రాములవారు గుఱయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా ?

ఎనిమిదో సభ్యుడు

నాకు మటుక్కు చిత్రం నచ్చిందండీ. చాల కాలం తరువాత ఆంగ్లాధ్రమిశ్రమ సంభాషణలు లేకుండా తీసిన చిత్రం కావడం ఒక పెద్దకారణం. నచ్చని చిన్నచిన్న విషయాలు కొన్ని ఉన్నాయి కానీ మొత్తం మీద మంచి చిత్రమే. అయితే ఆర్థికంగా విజయవంతం కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది.  బాగానే డబ్బు కూడబెట్టిందని ఎక్కడో చదివిన గుర్తు.

మొదటి సభ్యుడు

తొలిరోజు వసూళ్ళు బావున్నాయని నేనూ చదివాను. తొలిరోజున రూ.5 కోట్లు వసూలు చేసిందట. కానీ తరువాతి వారాల్లో అంత ఊపు కనిపించలేదని విన్నాను. కొన్ని ప్రదర్శనకేంద్రాల్లో బాగా ఆడినా ఎక్కువ చోట్ల సగటు-సరాసరిగా ఆడడం చేత లాభం మాత్రం రాలేదంటున్నారు. నష్టం వచ్చిందా ? లేదా ? వస్తే ఎంత ఎంత ? ఇలాంటి వివరాలు మనకి తెలీదు.

నాలుగోసభ్యుడు

శ్రీరామరాజ్యం పుస్తకంగా రాబోతుంది...

తొమ్మిదో సభ్యుడు

"మంచి ప్రారంభవసూళ్లు వచ్చాక కూడా నిలదొక్కుకోలేదు" అని అందఱూ చెపుతున్నదే. నా దృష్టిలో ప్రస్తుత స్థితికి కారణాలు-

 ౧. బాపు దర్శకత్వలోపమైతే కాదు. అది నిస్సందేహంగా ఒప్పుకోవల్సినదే. ప్రతీ ఫ్రేమూ ఎంతో అందంగా ఒక చిత్రకారుని కుంచె నుంచి వెలువడినట్లు ఉంది. చాలా సన్నివేశాల చిత్రీకరణ అత్యున్నత స్థాయిలో ఉంది. అద్భుతమైన గ్రాఫిక్సు వాడుకున్నారు.

౨. సినిమా చూసిన వారెవఱైనా వెంటనే చెప్పే విషయం ఈ సినిమా శ్రీరాముని రాజ్యం గుఱించి కాదు, సీతా దేవి వనవాసం గుఱించి అని. ఈ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహపడి ఉంటారని చెప్పగలను.

౩. బాలకృష్ణ గత చిత్రాలైన "పాండురంగడు" వంటి చిత్రాల ప్రభావం పడి ఉండవచ్చు.

౪. ఆఖరుకు దేవుని చిత్రంలో కూడా నందమూరి భజనను పక్కకు పెట్టకపోవటం ( ఒక సన్నివేశంలో రఘువంశ మహారాజులను చూపించే క్రమంలో రామారావును కూడా చూపించడం జఱిగింది. ఈ సన్నివేశానికి అనుకోని స్పందన కూడా లభించింది)

౫. అక్కినేని వారు వాల్మీకి పాత్రను అత్యద్భుతంగా పోషించారని అనేక వెబ్ సైట్ ఘనులు సెలవిచ్చినప్పటికి ప్రేక్షకులను రంజింప చెయ్యలేకపోయారు.

౬. ఎప్పుడైతే ప్రేక్షకులు సినిమా "ఇది శ్రీ రాముని రాజ్యం కాదు, సీతా వనవాసం" అని గ్రహించారో వెంటనే వద్దన్నా ఆనాటి లవకుశ గుర్తుకు వస్తుంది. వెనువెంటనే బాలకృష్ణను రామారావుతో, నయనతారను అంజలీ దేవితో మఱియు నాగయ్య గారితో నాగేశ్వరరావును పోల్చడం మొదలు పెట్టారు. అందువల్ల ప్రేక్షకులు నిండుభోజనం కాదు సగం భోజనమే తిన్నామన్న భావన వచ్చి ఉండవచ్చు.

౭. ఇక సంగీతం, ఇళయరాజా మంచి సంగీతాన్నే అందించినా, లవకుశ తో పోల్చినప్పుడు ఆ స్థాయిలో రంజింపచేయదు 
 
౮. ఇక, అన్నిటికన్నా ప్రధానం యువ ప్రేక్షకులకు హిందూ సినిమాల మీద ఆసక్తి సన్నగిల్లడం.

౯. ఎప్పుడైతే  ప్రేక్షకులు లవకుశ తో పోల్చారో వృద్ద మఱియు కుటుంబ ప్రేక్షకుల సంఖ్య హటాత్తుగా పడిపోతుంది. అదే  సమయంలో యువ ప్రేక్షకుల అనాసక్తి కూడా ఇతోఽధికంగా సాయం చేసింది.

౧౦. అలాగే గత దశాబ్దంలో  హిందూ భక్తి సినిమాల పేరుతో తీసిన సినిమాల (పాండురంగడు, రామదాసు వగైరా) వల్ల ఇకపై రాబోయే భక్తీ సినిమాల మీద అనాసక్తి పెరుగుతోంది. 

....గారు అనుకున్నట్టు "శక్తి, బద్రీ నాద' లాంటి సినిమాల పరాజయానికి బీజం సినిమా విడుదల అయ్యాక కాదు, ప్రారంభ దశలోనే పడిపోయింది. పిచ్చి పిచ్చి కధలు, దానికి తోడూ హీరో గాలిలోనే ఉండేలా పోరాటాలు చెయ్యడం.

ఈ సందర్భంగా నాదొక చిన్న సందేహం, ఉత్తర రామాయణం నిజంగా వాల్మీకి రాసినదేనా ? లేక చరిత్రలో పుట్టుకొచ్చినదా?

మొదటి సభ్యుడు

ఉత్తర రామాయణం (ఉత్తరకాండ) వాల్మీకిది కాదని కొందఱు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నాదీ అదే అభిప్రాయం. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

౧. పూర్వరామాయణ శైలీ, ఉత్తరరామాయణశైలీ ఒకే విధంగా లేవు. వేఱువేఱు వ్యక్తులు వ్రాసినట్లు స్పష్టంగా తెలుస్తుంది, సంస్కృతభాషా జ్ఞానం ఉన్నవాళ్ళకి !

౨. ఉత్తరరామాయణం వాస్తవానికి రావణాయణం. ఎందుకంటే అందులో చాలా భాగాన్ని రావణాసురుడి గొప్పతనాన్ని వర్ణించడానికి వినియోగించాడు రెండో వాల్మీకి.

౩. ఏడో కాండని ప్రవేశపెట్టడానికి గల అసలు కారణం (motive) ఏమిటై ఉండొచ్చునంటే - శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేసిన సమయానికి సీతమ్మవారు ఆయన దగ్గఱ లేదనే కథని కల్పించగోరడం. ఇలా కథని ట్విస్టు చేయబూనడానికి కారణం - అశ్వమేధయాగంలో పట్టపు రాణీ యాగాశ్వంతో సంభోగిస్తుందనే అపోహ. అంటే శ్రీరాములవారు అశ్వమేధయాగం చేశారంటే, అశ్వమేధయాగ నియమాల ప్రకారం సీతమ్మవారు కూడా ఇలాంటి పనేదో చేసి ఉండాలి కదా అని జనం ఊహించి ఆ తరువాత "హవ్వహవ్వ ఎట్టెట్టా" అని బుగ్గలు నొక్కుకుంటారనే భయం. సీతమ్మవారికి ప్రజల్లో ఉన్న ఇమేజిని చెడగొట్టి అసలు యావత్తు రామాయణాన్నే అసందర్భంగా, హాస్యాస్పదంగా మార్చిపారేయగలది ఈ అశ్వమేధయాగ ఘట్టం. "దీని గుఱించి ప్రజలకి ఏమని సంజాయిషీ ఇచ్చుకోవాలా ?" అని ఆలోచించి ఉత్తర రామాయణం పేరుతో ఈ "ఉత్తుత్తి" రామాయణాన్ని కల్పించాడు ఎవడో రామభక్తుడైన రెండో వాల్మీకి. కానీ ఈ ప్రయత్నంలో ఇతను (తన వ్యక్తిగత అపోహల కోణం నుంచి)  సీతమ్మవారి పరువు కాపాడాడు. కానీ తెలిసో తెలీకో శ్రీరాములవారి మీద మాత్రం చిక్కగా బుఱద చల్లేశాడు. ఫలితంగా అసలు రామాయణంలో వర్ణించబడ్డ రాములవారి గొప్పతనమంతా కొసఱు రామాయణంతో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

అసళ్ళ కంటే కొసర్లు డామినేట్ చేసేస్తూండడం కూడా కలియుగ లక్షణాల్లో ఒకటనుకోండి.


ఏడో సభ్యుడు

ఇక్కడ పట్టపు రాణీ అంటే *రాజు భార్య కాదు*, వేరే ఆడ గుఱ్ఱము. వైదిక సంస్కృతి చాలా advanced, ఇలాంటి పిచ్చి పని వాళ్ళు అనిమతించరు. అదీ ఒక రాజు మఱియు రాజు భార్య విషయములొ. అదీ ఒక public event లొ. ఇలా చూసించినవాళ్ళని రాజు ఖండఖండాలుగా నరుకుతాడేమో. మామూలు వ్యక్తే తన భార్యను ఇలాంటి పని చేయమనడు, అలాంటిది all powerful చక్రవర్తి ఎలా అంగీకరిస్తాడు!?. ఇది చీకటిలో చేసే ఏదో తాంత్రిక పద్ధతి కాదు కదా. 

ఈ అపోహ ఎలా వచ్చిందో, దీని వెనుక హిందువుల యొక్క శత్రువుల కుట్ర ఉండి ఉండవచ్చు. భారతములో ద్రౌపది ఈ పద్దతిలో పాల్గొన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు. Some one twisted or mis-interpreted this. Probably during the colonial time by some crooked మిషనరి, with malicious intentions or lack of Sanskrit knowledge. 

హిందువులు  దీని (అశ్వమేధయాగం) మూలాలు గుర్తించవలసిన అవసరము ఉంది.

మొదటిసభ్యుడు

మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఈ అశ్వమేధ ఘట్టాన్ని వర్ణించే శుక్ల యజుర్వేదం నా దగ్గఱుంది. రాజుగారి గుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాజు అంటారు. రాజుగారి ఆడగుఱ్ఱాల్లో మేలుజాతి ఆడగుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాణీ లేదా ఆశ్వమహిషి అంటారు. యజ్ఞంలో చనిపోయే ముందు ఆ అశ్వమహిషితో సంభోగించి తన వంశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ఆ గుఱ్ఱాల రాజుకు (మగగుఱ్ఱానికి) మంత్రపూర్వకంగా ఇస్తారు యాజకులు. ఇది ఒక చెట్టుని పడగొట్టినందుకు పరిహారంగా ఇంకో మొక్క నాటడంలాంటిది. కానీ చాలామంది స్వదేశీ సంస్కృత పండితులు కూడా ఇక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోలేక పట్టమహిషి గుఱించి చెబుతున్నారనుకుని బోల్తాపడ్డారు. ఇలా బోల్తాపడ్డవాళ్ళలో ఎవఱో ఒకఱు ఈ ఉత్తర రామాయణాన్ని సృష్టించి శ్రీరామచంద్రులవారికీ, ఆయన భార్యాప్రేమకీ, కీర్తికీ తీఱని ద్రోహం చేశారు. నిజానికి అశ్వంతో మానవస్త్రీలకి సంభోగం సాధ్యం కాదు. అలాంటిదానిగ్గనక సాహసిస్తే వాళ్ళు fatal గా గాయపడే అవకాశా లున్నాయి. ఏ మతమూ ఇలాంటిది ప్రిస్క్రైబ్ చేయదు.

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఈ జనాభా లెక్కల్ని ఎంతవఱకూ నమ్మొచ్చు ?

http://www.indiaonlinepages.com/population/hindu-population-in-india.... 


ఎందుకడుగుతున్నానంటే - చాలామంది దళితులూ, గిరిజనులూ క్రైస్తవమతంలోకి  మారినా కూడా కేవలం రిజర్వేషను కోసం హిందువులుగా జనాభా లెక్కల్లో నమోదయ్యారు. అందుచేత హిందువులుగా ప్రొజెక్టు చేయబడుతున్నవాళ్ళంతా వాస్తవంగా హిందువులు కారు. ఉదాహరణకి - ఆంధ్రప్రదేశ్ లో 90 శాతం కంటే ఎక్కువమంది దళితులు క్రైస్తవంలోకి వెళ్ళి చాలా సంవత్సరాలవుతున్నది. దళితుల సంఖ్య మొత్తం జనాభాలో 15 శాతం. అంటే ఏ.పి.లో ఉన్న 8 కోట్ల 46 లక్షల జనాభాలో కోటీ 27 లక్షలమంది దళితులు. కనుక వీళ్ళల్లో ఇప్పటికీ హిందువులుగానే మిగిలిపోయిన జనం అంతా కలిపి పదమూడు - పదిహేను లక్షలకి మించరు. 

ఇహపోతే రాష్ట్రజనాభాలో 8 - 9 శాతం ఉన్న గిరిజనులలో ఎంతమంది కిరస్తానం పుచ్చుకున్నారో, ఎంతమంది హిందువులుగా ఉన్నారో అస్సలు అంతు చిక్కట్లేదు. ఇహపోతే ముస్లిములు. తమ సంఖ్య రాష్ట్ర జనాభాలో సుమారు 9 శాతం అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని తనిఖీ (verify) చేయడానికి పనికొచ్చే విశ్వసనీయ ఆకరం (reliable source) ఏంటో, ఎక్కడుందో నాకు తెలీదు. ఈ క్రింది లంకె చూడండి : 


ఇలా ఓ పక్క  క్రైస్తవులేమో 15 శాతం (అన్నికులాలవాళ్ళనీ కలుపుకుని), మఱో పక్క ముస్లిములేమో (కనీసం) 9 శాతం ఉన్నారనుకుంటే ఇహ హిందువుల Brute majority ఎక్కడుంది ఈ రాష్ట్రంలో ? కాబట్టి ఇప్పుడు మనం వాస్తవంగా 70 - 75 శాతం మధ్య మాత్రమే ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతోంది. మనం గనక భవిష్యత్తులో 60 శాతానికి లోపల పడిపోయామా, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

ఈ సందర్భంగా గత శతాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్, బాంగ్లాదేశ్ లలో ఏం జఱిగిందో గుర్తు తెచ్చుకోవడం అవసరం. అక్కడ హిందువుల జనాభా పడిపోయాక వాళ్ళ మీద భౌతికదాడులూ, రక్తపాతాలూ, Ghettoisations, దోపిళ్లూ, అత్యాచారాలూ, అన్ని రంగాల్లోనూ దుర్విచక్షణ, apartheid మొదలయ్యాయి. వారి సాంస్కృతిక చిహ్నాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. ఆ బాధలు పడలేక వాళ్ళల్లో చాలామంది మతం మారారు. (అవతలివాళ్ళకి కావాల్సిందీ అదే). ఇంకొంతమంది తమ మాతృభూమి నుంచి తామే "బతుకు జీవుడా" అని పారిపోయారు.

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఎవరి కోసం ఈ వీసా ఆన్ అరైవల్ పథకం ?

http://www.immigrationindia.nic.in/visa_on_arrival2.htmhttp://www.immigrationindia.nic.in/visa_on_arrival2.htm

విసా ఆన్ అరైవల్ అనేది సక్రమముగా నడుస్తుందా? దీని ఉపయొగించుకొని జాతి వ్యతిరేక శక్తులు,ఉగ్రవాదులు సులభంగా ఇండియా వస్తారేమొ!?

అమెరికా, ఇంగ్లెండ్, ప్రాన్స్, జర్మని, జపాన్ లాంటి దేశాలే Immigration/Non-immigration పద్దతులను కఠినతరము చేస్తుంటే,  ఇండియన్ ప్రభుత్వము, ఎవరికొసము ఈ పధకాని ప్రవేశ పెట్టింది.

NRI and ప్రవాస భారతీయులకు ఈ పధకము అవసరము లేదు. NRI లు ఎప్పుడైనా రావచ్చు వీసా లేకుండా (they have Indian Passport). అలానే ప్రవాస భారతీయులు (India born persons who accepted Foreign Citizenship) సహజంగా OCI or PIO cards తీసుకుంటారు (ఈ మధ్య వేరే కొత్త పద్దతి ఎమైన పెట్టారొ తెలియదు).
 ఇండియన్ ప్రభుత్వము హిందువులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను చేస్తు, ఎవరికొసము ఈ విసా ఆన్ అరైవల్ పధకాని ప్రవేశ పెడుతున్నారు.

ఆలోచించాలి ప్రతివారూ.

1, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్యోతిష్యం ఒక అనుభవాధారిత శాస్త్రం

ఒక పాతబ్లాగునుండి యథాతథ పునః ప్రదర్శన


SUNDAY, DECEMBER 23, 2007

Is astrology scientific? -scietific method continued

ఏది విజ్ఞానం? ఏది కాదు?
తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.
మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.

ఖగోళం-జ్యోతిష్యం
ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.

Next-Is ayurveda scientific?

14 COMMENTS:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

గత కొద్ది శతాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చిన భావాలనే మీరూ రాశారు. కొత్తదనమేమీ లేదు. జ్యోతిష్యం అన్ని శాస్త్రాల వంటిదే. అంటే-ఏ శాస్త్రసత్యాలనైనా దాన్ని నేర్చుకుని ప్రయోగించి అన్వయించుకుని సాక్షాత్కరించుకోవలసినదే. జ్యోతిష్యమైనా అంతే. ఒక శాస్త్రం మీకు రానప్పుడు మీరందులో ప్రయోగాలు చెయ్యనప్పుడు మీకు దాన్ని గుఱించి మాట్లాడే అర్హత లేదు. మీకెందులో నైనా నోబెల్ బహుమతి వచ్చినా సరే ! నాకు న్యూక్లియర్ ఫిజిక్సు రాదు. అంతమాత్రాన న్యూక్లియర్ ఫిజిక్సు మొత్తం అబద్ధమైపోదు.

ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్‌ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు. విషయాల్ని వివరించడానికి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క పద్ధతినీ ఒక్కొక్క పరిభాషనీ ఆశ్రయిస్తుంది. అంతే కాక ఒక శాస్త్రపు conclusions ఆధారంగా ఇంకో శాస్త్రపు conclusions ని త్రోసిపుచ్చడం మూర్ఖత్వం. కారణం-దృశ్యమాన జగత్తులో ప్రతివస్తువుకూ విషయానికీ అనేక Dimensions, aspects ఉంటాయి. శాస్త్రాలనబడేవి వాటిని కల్పించిన మానవుల అవగాహనా పరిధికి కోణానికీ ప్రతిబింబాలు కనుక వారి వ్యక్తిత్వపు లోపాల్ని అవి కూడా జీర్ణించుకుని బాధపడుతూంటాయి. అవి మన ముందు project చెయ్యబడే విధానంలో వారి వ్యక్తిత్వపు లొసుగుల్ని సైతం ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి అవి పూర్తి సత్యాలు కావు.

ఉదాహరణకు- మీఱొక పుస్తకాన్ని బల్ల మీద పెడితే-ఒక పిల్లవాడు దాన్ని చూసి అందులో రంగుల బొమ్మలున్నాయేమో వెతుక్కుంటాడు. ఒక పాతపేపర్ల వ్యాపారి చూస్తే దాని బరువుని బట్టి దానికి ఎంత రద్దు-సామాను విలువ పలుకుతుందో అంచనా వేసుకుంటాడు. ఒక DTP operator చూసి అందులో ఏ మాత్రం Graphics నైపుణ్యం ఉందో పరిశీలిస్తాడు. ఒక రచయిత దానిలో Chapterization లాంటివి ఎంత బాగా చేశారా అని ఆలోచిస్తాడు. ఒక విద్యార్థి చూస్తే latest model paper కి పనికొచ్చే సమాధానాల కోసం అన్వేషిస్తాడు. మీరు చెప్పే శాస్త్రాలూ శాస్త్రీయ దృష్టులూ వీళ్ళవంటివే. మనకు పనికొచ్చే విషయాలకు మనం శాస్త్రాలని పేరుపెడతాం. మనకు పనికిరానివి మన దృష్టికే ఆనవు.అందవు.అర్థం కావు. ఆ విషయంలో మనం బౌద్ధిక లిల్లీపుట్లం.

గ్రహాలకు అనేక ఇతర ప్రాకృతిక దృగ్విషయాలకూ ఇలాగే అనేకమైన dimensions, aspects ఉంటాయి. వాటిల్లో కొన్ని పంచేంద్రియాలకు కనిపిస్తాయి. కొన్ని కనిపించవు. కారణం-అవి తమను తాము స్వయంగా వ్యక్తీకరించుకుంటేనే తప్ప మనం వాటి స్వరూపాన్ని తెలుసుకోలేము. అవి మీరు భావిస్తున్నట్లు ప్రాణం లేనివీ, చైతన్యం లేనివీ, వెఱ్ఱిమొఱ్ఱివీ కావు. పాత, కొత్త శాస్త్రాలు చెప్పే aspects, dimensions అన్నీ ఏకకాలంలో సత్యాలే. ఒక వ్యక్తి పొట్టివాడు అనే సత్యం అతడు బలవంతుడు అనే సత్యాన్ని ఆటోమేటిగ్గా ఖండించదు. అలాంటివే, పైకి ఘర్షిస్తున్నట్లు కనిపించే ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల conclusions కూడా.

ఇహపోతే "శాస్త్రీయం".

ఇది ఈమధ్యకాలంలో చాలా దుర్వినియోగానికి గురౌతున్న పదం. A highly vulgarizerd term as well. శాస్త్రీయమంటే- ఈ కాలంలో ఒకటే అర్థం -"నాకు తెలిసిన పదజాలాన్నే నువ్వు వాడాలి. వేఱే పదజాలం వాడితే నేను భరించలేను. ఈ ప్రపంచంలో అన్ని విషయాల వివరణా నేను నేర్చుకున్న సైన్సు కోడిలో, నా టెక్నాలజీ కుంపట్లో ఇమడాలి. అలా ఇమడకపోతే నువ్వు చెప్పే విషయానికి నేను unscientific అని బ్రాండు వేస్తాను." ఇది భాష గుఱించిన తగవు మాత్రమే. ఇది తెలుసులేక కొంతమంది సంప్రదాయవాదులు కూడా ప్రాచీన శాస్త్ర సూక్తులకు ఆధునికుల్ని ఒప్పించాలనే వ్యర్థమైన పట్టుదలతో కోడి-కుంపటి భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు.

వాస్తవం చెప్పాలంటే-ఇప్పుడు సైన్సు పేరుతో, శాస్త్రీయత పేరుతో చెలామణి అవుతున్నది-తెల్లవాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం. వాళ్ళు విషయాల్ని అర్థం చేసుకోవడానికి దూఱిన ఒక సంకుచిత గూభ్యం.అది మనం కూడా అంగీకరిస్తే మనం మంచివాళ్ళం. లేకపోతే పిచ్చివాళ్ళం.

Mallik said...

లలితా సుబ్రహ్మణ్యం గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఒకప్పుడు విశ్వం ఒక్కటే అనే వారు. విశ్వం అంచులు ఎక్కడి వరకూ ఉన్నయో ఎవరైనా చెప్పగలరా? ఆ అంచుల అవతల ఏమైనా ఉన్నయేమో చెప్పగలరా? పైగా ఈ మధ్య రీసెర్చిలో అనేక విశ్వాలు ఉన్నాయని చెపుతున్నారు. దీనంతటికీ మూలకారణుడు లేక కారణురాలు యెవరు? యెవరైనా చెప్పగలరా? కొన్నిటికి సమాధానాలు ఉండవు.

oremuna said...

వాదనలో తిమ్మిని బమ్మిని చేయడానికి కాకుండా జ్యోతిష్కాన్ని ఎందుకు నమ్మాలో ఓ ఐదు ఉదాహరణలు చెప్పగలరా?

ఎందుకు నమ్మకూడదో చెప్పడానికి చాలా ఉదాహరణలు కళ్ళ ముందే కన్పిస్తున్నాయి.
1. మన పత్రికల్లో వచ్చే దినవారఫలాలు
2. మన ఉగాది పంచాంగ శ్రవణంలో వర్షాల రాకపోకలు
3. నాడీ జ్యోతిష్క్యం
...

ఇలా కోకొల్లలుగా చెప్పవచ్చు

జ్యోతిష్కం ఓ బలహీనత/ బలహీనతను మాపుకొనె సాధనం తప్ప మరేమీ కాదు!

innaiah said...

I understand your reactions and comments.
Let us see the position from positive side.
Take astrology in India. It depends on nine planets.
Rahu and Ketu are non existent. So the count is seven.
Moon is not planet. It is satellite to earth.
The count becomes six.
Sun is not planet. It is self luminous body. It is star. The count remains five only.
If the major premises is wrong, naturally conclusions cannot become right.
There must be some connection between persons and planets. What is that connection? Without knowing the verified connection how can it possible to predict?
Let us think and proceed in stead of hastily come to comments.
Stars mentioned in astrology are not available for test.
The constellations are shapes mentioned by our people which are not verifiable.They are not in existence.
Think and proceed carefully before come to comments

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎవరు చెప్పినదీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. మీరు జ్యోతిష్యాన్ని ఖండించే ముందు దాన్ని నేర్చుకుని ఫలితాలు సరిచూచుకుని ఖండించండి. జ్యోతిష్కులమని చెప్పుకునేవాళ్ళ వ్యక్తిగత లోపాలకు ఒక శాస్త్రాన్ని నిందించకండి. అలా నిందించాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతీ చికిత్స తీసుకుని మఱీ చనిపోతున్న కోట్లాదిమంది శవాల సాక్షిగా అల్లోపతీ వైద్యవిధానాన్ని కూడా నిందించాల్సి వస్తుంది. వాతావరణ శాస్త్రజ్ఞుల weather forecasts ని కూడా నిందించాల్సి వస్తుంది. ఏ శాస్త్రంలో నైనా సిద్ధాంతభాగం ఉన్నంత ఖచ్చితంగా ఫలితభాగం ఉండదు.

ఇహపోతే, రాహుకేతువుల సంగతి. భూమి orbit చంద్రుడి orbit తో సమద్విఖండన చేసే బిందువుల మధ్య కుడియెడమల దూరాలకు మన పూర్వీకులు రాహుకేతువులని పేరుపెట్టారు. వాటి వల్ల భవిష్యత్ ఫలితాల్లో తేడా వస్తున్నట్లు గ్రహించడం వల్ల వాటిని కూడా గ్రహాలన్నారు. గ్రహాలంటే planets అనుకోకండి. జ్యోతిశ్శాస్త్రం చెప్పే గ్రహాలు planets గుఱించి మాత్రమే కాదు, జాతకం మీద ప్రభావం కలిగించే యావత్తు జ్యోతిస్సుల (Luminary bodies) గుఱించి. మీరు జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఇలాంటివన్నీ బోధపడతాయి. ఇలా కూర్చుంటే ఏమీ తెలియదు.

ప్రస్తుతం scientific పేరుతో చెలామణీ అవుతున్నది ఒక గూభ్యాలోచన విధానం. ఈ విధానంలో ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి ఆ విధంగా నిర్మించబడలేదు. ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి. మనకు తెలియనంత కాలం ఏమీ లేదనుకుంటాము. ఇప్పుడు scientific అని భావించబడుతున్న అనేక విషయాల గుఱించి గతంలో అలాగే అనుకున్నాం. అయితే జ్యోతిష్యం మన పూర్వులు మనకంటే ముందే ఆలోచించినది కావడం వల్ల దాని క్లెయిములు, అన్నీ తెలుసుననుకుంటున్న మన అహంకారానికి గొడ్డలిపెట్టులా ఉన్నాయి. ఒకటి ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకోవాల్సి వస్తుందనే భయంతో అన్నిటినీ ఊచమట్టుగా త్రోసిపుచ్చడానికి ఆధునిక మానవుడు అలవాటు పడ్డాడు. కాని నిజం నిప్పులాంటిది. ఒకప్పుడు మానవ నాగరికతలో జ్యోతిష్యం లేదు. తరువాత కొన్ని వందల సంవత్సరాల పరిశోధనా పరిశీలనా ఫలితంగా ఆ శాస్త్రం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు "కాదు" అంటే తాత్కాలికంగా విజయం మీదే. కాని మానవ కుతూహలం "కాదు, కూడదు"ల దగ్గర ఆగిపోదు. కుతూహలాన్ని ఎవరూ నిషేధించలేరు. అది మళ్ళీ ఆవిర్భవిస్తుంది. మీరు ఆకాశాని కెత్తుతున్న so-called scientific people నుంచే పునర్జన్మ ఎత్తుతుంది.

"నాకు తెలియదు" అని ఒప్పుకోవడం ఒకప్పటి మర్యాద. "నేను నమ్మను" అనడం ఈనాటి ఫ్యాషన్. మన:స్థితి మాత్రం ఒకటే.

"అది వాడి రక్తంలోనే ఉందిరా !" అని వెనకటి తరం వాళ్ళు అంటే, మొన్నమొన్నటి దాకా నవ్వారు-రక్తంలోనే అన్నీ ఉంటాయా ? అంటూ ! ఇప్పుడు ప్రతిదానికీ జీన్సుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎవరు గెలిచారు ?

అందుచేత, మన పూర్వీకుల్ని వఠ్ఠి వెధవాయిలుగా శుంఠలుగా త్రోసిపుచ్చకండి. మీరు అనుకుంటున్నట్లు కాదు. మీకు సంస్కృతం రాకపోవడం, ప్రాచీన గ్రంథాలు చదవకపోవడం-ఇలాంటి పొఱపాటు అభిప్రాయాలకు కారణం. ప్రతి వృద్ధుడూ ఒకప్పుడు మనలాంటి యువకుడేనని అర్థం చేసుకోండి.

బ్లాగేశ్వరుడు said...

నేను తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారితో ఏకిభవిస్తున్నాను. జ్యోతిష్యశాస్త్రము కూడా ఒక సైన్సు వంటిది.

innaiah said...

Scientific method follows self correction. Never claimed omniscience, omnipotence. That is essential difference between belief and research.Blind belief in the old systems and ancient people is not monopoly of east, it is similar in west too.
Astrology is not proved scientific anywhere. But some astrologers claimed it as scientific to get respectability.
James Randi put 5 crores of rupees in the trust and offered to give to anyone who establishes the scientific nature of astrology.
please go and see website at:
www.randi.org and find details.

innaiah said...

The burden of proof always remains with those who claim scientific status to astrology.If some one says-come what may- I blindly adhere to my belief, there cannot be argument and reason

వింజమూరి విజయకుమార్ said...

వాదనతో తిమ్మిని బమ్మిని చేయడానికి యిది చదువురానోళ్ళ చోటు కాదు. చదువుకున్నోళ్ళుండే చోటు. ఇక్కడ వాదనకి సరైన ప్రతివాదన చూపి వాళ్ళ వాదన తిప్పికొట్టడం జరిగి తీరుతుంది. అసలు తాడేపల్లి గారి వాదన ఒక base మీద నిలబడినట్టు, వాదనకి ఒక stand ఉన్నట్టు అన్పించదు. ఉదాహరణకి ఇది చూడండి. "ప్రకృతిలో ప్రతిదానికీ ఇంకో విషయంతో గొలుసుకట్టు సంబంధాలున్నాయి" అన్నారీ వ్యాఖ్యలలోనే. అదే విధంగా "ఒక శాస్త్రపు సూత్రాలని ఇంకో శాస్త్రపు పరిభాష (terminology)తో వివరించబూనుకోవడం నిష్‌ప్రయోజనం. అజ్ఞానపూర్వకం కూడా. Mathematics పరిభాషతో గాని దాని ప్రయోగసరణితో గానీ మీరు Zoology, biology principles ని వివరించజాలరు." ఇలా అనడం వైరుధ్యం కాదా. ప్రకృతితో అంతటికీ గొలుసు కట్టు వున్నప్పుడు లెక్కలకీ, జువాలజీ కీ గొలుసుండదా? సృష్టినంతటినీ ఏక సూత్రబద్ధం (ఒకే గొలుసుతో కలపబూనడం)చేయబూనిన ఐన్ స్టీన్ లెక్కల్లో సాపేక్ష సిద్ధాంతం (భౌతిక శాస్త్రం) చెప్పలేదా? ఈ మాట చూడండి. ఇది Science గురించి తెలిసిన ఏ వ్యక్తీ అనకూడని మాట. "ఏ పదార్థానికా పదార్థం, ఏ వస్తువుకా వస్తువు ఇతర పదార్థాలతోను వస్తువులతోను సంబంధం లేనిదిగా భావించబడుతూ అపార్థం చేసుకోబడుతూ ఉంటుంది." ఐన్ స్టీన్ దగ్గర నుండీ ఏ బుర్రున్న శాస్త్రవేత్తా "ఏ పదార్ధానికా పదార్థం" భావనలో వుండడు.ఐన్ స్టీన్ దాకా ఎందుకు mathematics తో నేను నా http://abhinayani.blogspot.com లో 'ఇంటి పేరు పురుషుడిదే' వ్యాసంలో లెక్కల మూలాలతో జీన్స్ నీ, జీన్స్ తో 'ఇంటిపేరు'నీ వివరించగలిగితిని కదా. జీన్స్ Zoology, biology ల్లో భాగం కాదా? చేతనయితే ఆ విషయం ఎవరైనా పూర్వపక్ష చేసి చూపండి. అయినా ఇప్పటి వరకూ ప్రామాణికం లేదనుకున్నప్పుడూ, ప్రస్తుతానికి సైన్సుదే విజయం అనుకున్నప్పుడూ, ఎప్పుడో నిరూపణకి రాబోయే వ్యక్తిగత విశ్వాసాల్ని జనాల నెత్తిన రుద్దబూనడం ఎంత వరకూ సమంజసం?

వింజమూరి విజయకుమార్ said...

ఇంతకు ముందు నేనొక వ్యాఖ్య రాయడం జరిగింది. అందులో జ్యోతిష్యాన్ని వకాల్తా పుచ్చుకున్న వ్యక్తి వ్యాఖ్యానం లోని లోపాల్ని బహిర్గతం చేయడం జరిగింది.

ఇప్పుడు బ్లాగ్విషయం గురించి. జ్యోతష్యశాస్త్రం శాస్త్రీయమో కాదో నాకు తెలీదు. కానీ నా వ్యక్తిగతంగా మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయాలే వున్నాయి. మచ్చుకి రెండు చెపుతాను. నాకు 1993 మార్చి 10 వ తేదీతో రాహు మహాదశ పూర్తయి, గురు మహాదశ మొదలైంది. నా అపాయింట్ ఆర్ఢరు 17-03-1993 న టైపు అయింది. నేను 30వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. అలాగే మా బాబు పుట్టే సమయానికి వాడికి సింహరాశిలో కేతు మహాదశ నాల్గవపాదంలో(ఈ కేతు నాల్గవ పాదం లోనే యన్.టీ.ఆర్ మరణించింది) యిక రెండు రోజులే మిగిలివున్నాయి. విచిత్రంగా ఆ రెండు రోజులూ బాబుకి గ్యారంటీ యివ్వలేమన్నారు డాక్టర్లు. ఎలాగో ఇంటెన్సివ్ కేర్ లోనే ఆ రెండ్రోజులూ గడిచాయి. ఇక వాడికి శుక్ర మహాదశ ప్రారంభమయింది.ఆ తర్వాత అంతా శుభమేననుకోండి. అలా చెప్పాలంటే చాలానే వున్నాయి. అయినా నా వ్యక్తిగత నమ్మకాన్ని నేను శాస్త్రబద్ధం చేయబోను. అలాగే జరగనివి కూడా చాలా వున్నాయి. హిట్లర్ జాతకంలో కుజుడి స్వస్థానాలైన మేష, వృచ్ఛికాల్లో ఏదో ఒక దాన్లోనే కుజుడున్నాట్ట. అందుకే అతడు లోక కంటకుడయ్యారంటారు. కానీ, నేను మేషంలో కుజుడున్న వ్యక్తుల్ని ఇద్దర్ని చూసాను. వాళ్ళు చాలా మంచి వ్యక్తులూ, ముఖ్యంగా కోప స్వభావం లేని వారూనూ.

ఇక మీరు యోగ సిద్ధాంతం కూడా విజ్ఞాన వ్యతిరేక వాదం అన్నారు. ఒక మాటనుకుందాం. విజ్ఞానం అనంతమైనది. అదెప్పుడూ అనంతంగా తెలుసుకుంటూ పోవాల్సిన విషయం. ఇక మనిషి జీవిత కాలం పరిమితమైనది. అలా విజ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవడంలోనే మనిషి మరణించడమూ జరిగిపోతుంది. ఇక మానవజీవితానికి పరమార్థం యేమిటనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. అందుకే పెద్దలు మనం మనసులో పోగు చేసి పెట్టుకున్న విజ్ఞానం (ఇది పరిమితమైనది)గతం రూపంలో వుండి, అది వర్తమానాన్ని ప్రభావితం చేస్తూ భవిష్యత్తుని కలుషితం చేస్తున్నదంటారు. గతం లోంచి మనం సృజించిందేదైనా అది పాతదైన గతానికి మరో రూపమే కానీ అసలైన సృజనాత్మకం కాదంటారు. అసలైన సృజనాత్మక శక్తి మనసు గతంతో నిండిపోకుండా ఖాళీగా వున్నప్పుడే కొత్తది అందులోకి ప్రవేశించడానికి వీలుంటుందంటారు. అది తెలుసుకోడానికి మనం వర్తమానాన్ని గతంతో నింపకుండా ఋజువు చేసుకొని వ్యాఖ్యానించాలి గానీ, యిలా విజ్ఞానం ఋజువు పరచిన నియమాలను పాటించాలనడం భావ్యం కాదు గదా. ఆ నియమాలను పాటిస్తే అది మళ్ళీ మనం గతాన్ని practice లేదా exercise చేస్తున్నట్టే అవుతుంది గదా. అందుచేత యోగసిద్ధాంతం అనేది ఒక పేపర్ మీద పెట్టగలిగిన map కాదనీ, అది beyond thought అనావరణంగా వున్న మనసులో మాత్రమే చొరబడడానికి వీలుండే సృజనాత్మకమైనదనీ, దాన్ని వ్యక్తి తనంతట తాను ఋజువు చేసుకోవాల్సివుంటుందనీ, అంతా సైన్సుకి అణుగుణంగానే వుండాలను కోవడమూ తప్పేనేమోననీ విన్నవించుకుంటున్నాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నా వాదనలో లేని లోపాల్ని కనుగొని బహిర్గతం చేసిన వింజమూరిగారికి నెనర్లు.

1. ప్రకృతిలో ఒక విషయానికి మఱో విషయంతో గొలుసుకట్టు సంబంధం ఉండడం.

2. ఒక శాస్త్రపు పరిభాషతో ఇంకో శాస్త్రాన్ని వివరించబూనుకోవడం.

ఈ రెండూ ఒకటేనా ? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లోపం ఎవరి వాదనలో ఉందో మీకే అర్థమౌతుంది.

మీకర్థం కాకపోతే నేనే చెబుతాను.

ప్రకృతి ఏ శాస్త్రాలూ లేనిది. మానవుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నవాడు. మానవుడి శాస్త్రాలన్ని తనకు అర్థమయ్యే విధంగాను తనకర్థమైనదాన్ని ఇతరులకు బోధపఱిచే విధంగాను ఏర్పఱచుకున్న సంకేతావళితో కూడుకొన్నవి. ఒక శాస్త్రపు సంకేతాలు ఇంకో శాస్త్రానికి వర్తించవు. ఒక శాస్త్రంలో నిజనిర్ధారణకు వాడే ప్రయోగసరణి ఇంకో శాస్త్రానికి అన్వయించదు.

ఈ ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చిందో గమనించండి. గ్రహాలకూ మనిషి జీవితానికీ సంబంధం ఉందని నేను చెప్పిన సందర్భంలో వచ్చింది. ఇతర శాస్త్రాల ఆధారంగా జ్యోతిష్యం మీద తీర్పు చెప్పడం తప్పనీ జ్యోతిశ్శాస్త్రాన్ని దాని సొంత సూత్రాల మీదా దాని సొంత నిజనిర్ధారణపద్ధతి మీదా అర్థం చేసుకోవాలనీ చెప్పిన సందర్భంలో వచ్చింది.

ఒక ప్రక్క సోదాహరణంగా నా వాదనని బలపరుస్తూ మఱో ప్రక్క నా గుఱించి ప్రతికూల ప్రస్తావన తేవడం సందర్భోచితమేనా ? లేక దీనికేమైనా నేపథ్యం ఉందా ?

సరే ! కానివ్వండి. మీ ఇష్టం.

-ఇట్లు భవదీయుడు

(జ్యోతిష్యం తరఫున వకాల్తా పుచ్చుకున్న ఒక వ్యక్తి)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఇన్నయ్యగారూ !

"జ్యోతిష్యం ఒక విశ్వాసం కాబట్టి అది అలా ! సైన్సు సైన్సే కాబట్టి ఇది ఇలా..." అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అభినందనలు.

నా ప్రశ్న ఏమిటంటే-సైన్సుగా చెలామణీ అవుతున్నదాంట్లో విశ్వాసాలకు స్థానమే లేదా ? సైన్సు అంటే సెల్ఫు కరెక్షన్ అని చెప్పారే ! జ్యోతిష్యం కూడా అంతేనని మీకు తెలియదు. ఇక్కడ సమస్య జ్యోతిష్యంతో కాదు. దానికి మూఢవిశ్వాసమని పేరుపెట్టి దాన్ని గ్రుడ్డిగా త్రోసిపుచ్చేవాళ్ళ గ్రుడ్డి-చెవిటి మనస్తత్వంతో ! దానికలా పేరుపెట్టి ఎప్పుడైతే కళ్ళు మూసేసుకున్నారో అప్పుడు దానిమీద ఇలా బురద జల్లుతూ శతాబ్దాల తరబడి వ్యాసాలూ బ్లాగులూ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అబద్ధమని కొన్నివేల సంవత్సరాలుగా చాలామంది మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా జ్యోతిష్యం చనిపోలేదు. దాని లెక్కలూ విశ్లేషణా జనానికి తమ వ్యక్తిగత జీవితాల్లో ఫలితాలు చూపిస్తున్నంతకాలం అది చనిపోదు. ఇతరుల అనుభవాల్ని త్రోసిపుచ్చినంత తేలిగ్గా ఎవరూ తమ వ్యక్తిగత అనుభవాల్ని త్రోసిపుచ్చలేరు.

సైన్సు చదువుతున్నవాళ్ళంతా అందులోనివన్నీ సత్యాలని అర్థమయ్యాక ఆ కోర్సుల్లో చేరారా ? లేక చేరాక అవి సత్యాలని తెలుసుకున్నారా ? మొదటిది నిజమైతే వాళ్ళు చేరాల్సిన అవసరం లేదు. రెండోది నిజమైతే సైన్సు సత్యమనే ప్రచారం వల్ల చేరారని చెప్పాల్సి ఉంటుంది. మఱి సైన్సు విషయంలో positive bias లేదని ఎలా అంటారు ? మఱి జ్యోతిష్యం దగ్గరికొచ్చేసరికి negative bias సృష్టించడానికి మీవంటివారు ఇతోధికంగా కృషి చేస్తున్నారు కదా ! ఇదేనా scientific method అంటే ?

నా వ్యక్తిగత విశ్వాసాల్ని జనం మీద రుద్దుతున్నానని వింజమూరిగారు అన్నారు. జ్యోతిష్యం నా ఒక్కడి వ్యక్తిగత విశ్వాసమైతే ఆ శాస్త్రాన్ని నేను సృష్టించి ఉండాలి. కాని నేను సృష్టించలేదని అందరికీ తెలుసు. ఒకవేళ జ్యోతిష్యం వ్యక్తిగత విశ్వాసమైతే అలాంటి వ్యక్తిగతవిశ్వాసం మీద దాడి చెయ్యడానికి ఎందుకిలా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు ? "ఎవడి పిచ్చి వాడికానందం" అని వదిలెయ్యొచ్చు గదా ?

innaiah said...

చర్చ్గ లొ వ్యక్తిగత దూషణ వలదు.
జ్యొతిశ్యం శాస్త్రం అయితే అంగీకరించడానికి సిధం.ఎలాగో చెపాలి.
గ్రహాలకు మనుషులకు సంబంధం చూపాలి.
తారలకు మనుషులకు సంబంధం తెలుపాలి.
లేని గ్రహాలు రాహు కే తు ఎలా మనుషులమీద ప్రభవం చూపుతాయి ?
శాస్త్ర పధతి లొ పెత్తనం వుందదు .రుజువు అవసరం. రుజువు కొరకు ఆగాలి. మన పెద్దలు చెప్పారు గనక రుజువు అదగరాదు అనదం శాస్త్రం కాజాలదు.

ముందు అమ్మవారు, తరువాతే అయ్యవారు !

ప్రపంచానికి తండ్రే కాదు, తల్లి కూడా ఉందని చెప్పే ఏకైక మతం హిందూమతం. ఇతర ధర్మాలలో స్త్రీదేవతల్ని పూజించడాన్ని పాషండ సంప్రదాయంగానూ, witchcraft గానూ భావిస్తారు. కానీ మనకి స్త్రీదేవతలందఱూ పరమపురుషుడి భార్యగా అభివర్ణించబడిన జగన్మాత యొక్క అంశలే, అవతారాలే. ఎవఱీ జగన్మాత ? అనడిగితే, ఈ చరాచరవిశ్వమూ, ప్రకృతీ అంతా జగన్మాతే. ఈ ప్రపంచం చైతన్యరహితమైనది కాదు. ఇది మనలాగే ప్రాణం కలిగినది. ఇది చాలా తెలివైనది. అలాంటి ఈ విశ్వమే జగన్మాత. "ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్" అని అభివర్ణించారు లక్ష్మీ అష్టోత్తర శతనామస్తోత్రపు మొట్టమొదటి శ్లోకంలో ఆవిణ్ణి ! సంపదలన్నీ ప్రకృతి (natural resources) నుంచి సంప్రాప్తించాల్సిందే కనుక లక్ష్మీదేవికి గల మొట్టమొదటి నామం ప్రకృతి అని పూర్వీకులు తెలియజేశారు.

అలాంటి ఈ ప్రకృతి యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోలేక జనం భ్రమలో ఉన్నారు. దాన్ని నిర్జీవంగా భావిస్తున్నారు. అయితే ఎలా భావిస్తే ఆ ఫలితమే వస్తుంది. మన దేహంలో నివసించే బ్యాక్టీరియా, వైరస్సులక్కూడా తామొక చైతన్యస్వరూపమైన మానవదేహంలో ఉన్నామని తెలీదు. మన పరిస్థితీ అదే. ఆమెలోంచే మనమంతా ప్రభవించాం. ఆమెలో భాగంగా జీవిస్తున్నాం. చివఱికి ఆమెలోనే కలిసిపోతాం. ఈ జీవం, ఈ ప్రాణం, ఈ దేహం, దీనిక్కావాల్సిన ఆహారం ఆమెలోంచి ప్రభవించాయి. ఆమె పరమపురుషుడి యొక్క మానసస్వరూపం, ఆయన యొక్క సంకల్పం కావడం వల్ల మనక్కూడా మనస్సునీ, సంకల్పాల్నీ కలిగిస్తున్నది ఆమే. Science and technology ఇత్యాది పేర్లతోనూ, Nuclear energy, Laws of nature, ప్రభృతినామాలతోనూ మనం ఈ కాలంలో అధ్యయనం చేస్తున్నది అమ్మవారినే. అదే సమయంలో అమ్మవారు వీటన్నింటినీ మించినవారు కూడాను. అంటే అమ్మవారికి ఈ శాస్త్రాల రూపంగా కొన్ని నియమాలు (rules) ఉన్నాయి. అయ్యవారికి అవి లేవు. కానీ ఏ విధంగానైతే అయ్యవారిలో దివ్యాంశలూ, రాక్షసాంశలూ రెండూ ఉన్నాయో అలాగే అమ్మవారిలో సైతం అవి అంతే స్థాయిలో ఉన్నాయి.

అమ్మవారు అయ్యవారి మానసస్వరూపం కావడం వల్ల ఆమెకీ, ఆయనకీ అంతర్గతంగా భేదం లేదు. "వారిది భార్యాభర్తల సంబంధం" అని హిందూపురాణాలు వర్ణిస్తున్నప్పటికీ ఈ రెండు మహోన్నత, అత్యున్నత శక్తుల (Supreme powers) మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటనేది ఇంకా మనకి అవగాహన కావాల్సి ఉంది. అయితే వారిద్దఱూ ఖచ్చితంగా ఉన్నారనేది మాత్రం హిందూ ఋషులు కొన్నివేలసార్లు ప్రత్యక్షంగా అనుభూతి పొంది దర్శించిన సత్యం. కనుక వారి వాక్యానుసారంగా మనం ఆ సత్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా ఉపాసించక తప్పదు.

"పరమపురుషుడి భార్య అయిన జగన్మాతని ఎందుకు ముందు పూజించాలి ? సాధారణంగా భార్యాభర్తల సంబంధంలో భర్తకే అగ్రతాంబూలం కదా ? ఆ రకంగా చూసినప్పుడు ముందు పూజించాల్సింది భర్తనే (పరమపురుషుణ్ణే) కదా ?" అనడిగితే, ఆ దృష్టితో ఈ ఉపదేశాన్ని చూడకూడదని మనవి. అదే విధంగా Female first లాంటి ఆధునిక ఫెమినిస్టు ధోరణిలోంచి కూడా దీన్ని చూడకూడదు. లోకరీతి రివాజుల ననుసరించి పై ప్రశ్న సహేతుకమే. కానీ అదే లోకరీతి ప్రకారం - ఏ బిడ్డడికైనా తండ్రి ఉన్నాడనే సత్యం ముందు తల్లి ద్వారానే తెలుస్తుంది. అంటే "తల్లే సత్యం, తండ్రి అసత్యం’ అని కాదిక్కడ అర్థం. తల్లి అనే పరిభావన (concept) అంతకంటే ఉచ్చతరమైన తండ్రి అనే పరిభావనని (higher concept) జాడమాత్రంగా సూచిస్తూ, ఆయన దగ్గఱికి త్రోవచూపేదే తప్ప దానికదే ఏకైక పరిభావన కాదు. అక్కడితో ఆగిపోయేవారు మూర్ఖులు.

ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవనంలో కూడా ప్రకృతే మన చుట్టూ కనిపిస్తున్నది. ఈ ప్రకృతి అనే దృశ్యమానస్వరూపం (visible concept) వెనక ఆమె భర్త అయిన పరమపురుషుడు అనే అదృశ్య సమున్నత స్వరూపం (invisible higher concept) దాగున్నాడు. ఈ ప్రకృతిని అధిగమిస్తే తప్ప ఆ పరమపురుషుణ్ణి చేఱుకోలేం. ఈ ప్రకృతికే మాయాశక్తి అని పేరు. ఎందుకంటే ఈమె భగవంతుడి మాయాశక్తి. ఈ మాయాశక్తి వలన మన జ్ఞానం కప్పబడుతున్నది. అలా కప్పబడడం వల్ల మనం అజ్ఞానులమనీ, అల్పజీవులమనీ, మనకేమీ తెలీదనీ, చేతకాదనీ అనుకుంటున్నాం. ఆ జ్ఞానం తిరిగి వెలికివస్తే మనమే భగవత్ స్వరూపులమనీ, మానవాత్మ పరమాత్మకే చిన్నప్రతిబింబం (miniature) అనీ గ్రహిస్తాం. అలా జ్ఞానం తిరిగి ప్రకాశమానం కావాలంటే ఈ మాయాశక్తి కప్పిన ఆచ్ఛాదనని తొలగించుకోవాలి. మనంతట మనం తొలగించుకోలేం. మనకా శక్తి లేదు. ఏ తల్లి ఈ ఆచ్ఛాదనని మనమీద కప్పిందో ఆవిడే దయదల్చి దీన్ని తొలగించి "అరుగో మీ నాన్నగారు" అని చూపాల్సి ఉంది. అందుకే ముందు ఆవిణ్ణి ప్రసన్నురాలిని చేసుకోవాలనడం.

ఆమె మన యెడ ప్రసన్నురాలైతే మనకి తగిన సద్గురువుని తప్పకుండా చూపించి ఆయన ద్వారా మనకి పరమాత్మదర్శనం చేయిస్తుంది. శ్రీరామకృష్ణపరమహంసగారి జీవితంలో ఇలాగే జఱిగింది. శ్రీ వైష్ణవులు కూడా అందుకే ముందు లక్ష్మీపూజ చేసినాకనే విష్ణుపూజ చేస్తారు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి