హిందూ అనుష్ఠాన వేదాంతము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిందూ అనుష్ఠాన వేదాంతము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2012, మంగళవారం

ఆధ్యాత్మికోన్నతి ఎలా కలుగుతుంది ?


Absolute emptiness is the end of all religion. Stuffing mind and life with all sorts of things goes against this. Stuffing this way, you can still be a believer but not a serious practitioner. When we could feel proud of our emptiness in stead of our full-ness, we will have reached the height of all spirituality.

సాధన దంతమంజనం (Tooth paste) లాంటిది. పళ్ళు తోముకున్నాక దాన్ని కూడా పుక్కిలించి ఉమ్మివేయక తప్పదు. అత్యున్నతస్థాయి ఆధ్యాత్మికత నాస్తికత్వాన్ని పోలి ఉంటుంది, "ముదిమి రెండవ బాల్యము" అన్నట్లు. కానీ అది నాస్తికత్వం కాదు. షిరిడీ సాయిబాబా తమ కాళ్ళతో నిప్పుకట్టెల్ని సవరించేవారు. సాధారణ మానవులు అలా చేస్తే అది నాస్తికత్వమే. కనుక సాధకులకు వర్తించే నియమాలూ, విశ్వాసాలూ అంతకంటే పైస్థాయివాళ్ళకి వర్తించవు. కాని వారు కూడా బాహ్యంగా సాధకుల లాగానే మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ ఉండాలి. కిందిస్థాయివాళ్ళ దగ్గఱ పైస్థాయి మాటలు మాట్లాడితే వాళ్ళు శూన్యవాదులూ, నాస్తికులూ అవుతారు. చిన్నపిల్లలతో శృంగారం గుఱించి మాట్లాడడం లాంటిది అది. వేమన చేసిన పొఱపాటు ఇదే. అది ఎంతవఱకూ వెళ్ళిందంటే ఆయన్ని కూడా తమలాంటి నాస్తికుడని నాస్తికులు భ్రమపడే దాకా ! 

"హిందూ ఆధ్యాత్మికత ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? మతం ఇంకా సింపుల్ గా ఉండొచ్చు గదా ?" అని అడుగుతారు కొందఱు. కానీ ఇదే తరహా ప్రశ్న ఇతర విషయాల గుఱించి వేయరు. మతమంటేనే ఈ లోకువ. "గణితశాస్త్రం ఎందుకని ఇంత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? భౌతికశాస్త్రం ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు గదా ? సాఫ్టువేర్లు ఎందుకింత గజిబిజి, సంక్లిష్టం ? కాస్త సింపుల్ గా, చిన్నపిల్లవాడు కూడా కార్యక్రమణ (Programming) చేసేలా ఉండొచ్చు గదా ?"

మతపు సంక్లిష్టత (complexity) ఎవఱి సృష్టీ కాదు. ఆ జ్ఞానం సహజంగానే చాలా జటిలమైనది, చాలా గహనమైనది. దాన్ని పూర్వఋషులు మన కోసం చాలా చాలా సరళీకరించారు. అయినా అది ఇప్పటికీ సామాన్యమానవుల అవగాహనకి అందుబాటులో లేదు. బహుశా ఎప్పటికీ ఉండదు. ఉండబోదు. మతం కడుపు నిండినవాళ్ళ కులాసా కాలక్షేపం కాదు. కడుపు నిండకపోవడం చేతనే మనిషిలో జీవితం గుఱించిన అంతర్మథనం మొదలైంది. "అనుకున్నది అనుకున్నట్లుగా ఎందుకు జఱగడం లేదు ?" అని ! 

పరమార్థాన్ని సాధించడం కోసం అవసరమంటూ శాస్త్రాల్లో చెప్పిన నియమాలు - ఉదాహరణకి, ఏకాంతవాసమూ, బ్రహ్మచర్యమూ, ఉపవాసాలూ, శమదమాదులూ, బ్రాహ్మీముహూర్తపు సాధనలూ - వీటిని నిబంధనలు (Rules) గా, నిర్బంధంగా చూడడం పొఱపాటు. ఇవి ఆత్మజ్ఞానం అనే సంఘటన జఱగడానికి దోహదపడే సానుకూలాలు (favorable circumstances) మాత్రమే. ఇవన్నీ వాటంతట సమకూడిన ఒకానొక అఱుదైన క్షణంలో మనిషిలో తటాలున అనుకోకుండా ఆత్మజ్ఞానం మెఱుపులా మెఱుస్తుంది. అంటే, ఉదాహరణకి - ఇంద్రధనుస్సు కనిపించాలంటే, ఎండ పడుతూ ఉండాలి. చిఱుజల్లు కుఱుస్తూ ఉండాలి అన్నట్లు ! కృత్రిమంగా ఎండా, చిఱుజల్లూ ఏర్పాటుచేస్తే అది Lab experiment అవుతుంది తప్ప ఇంద్రధనుస్సు అవ్వదు. అలాగే శాస్త్రంలో చెప్పారు గదా అని పై లక్షణాల్ని బలవంతాన అలవఱచుకుంటే ఆత్మజ్ఞానం కలగదు. 

ఎందుకంటే, వీటిల్లో ఏ లక్షణమూ ఒక్క జన్మలో సిద్ధించేది కాదు. అలాంటిది, అన్ని లక్షణాలూ ఒనగూడాలంటే ఎన్ని జన్మలు పట్టుతుందో ఆలోచించండి. దీని పూర్వాపర ప్రక్రియని సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనకున్న ప్రతి లక్షణం వెనుకా ఒక సంస్కారం, మన ప్రతిసంస్కారం వెనుకా ఒక ఆచరణ, ప్రతి ఆచరణ వెనుకా ఒక గుర్తోదయం (Realization) ఉంటాయి. అలాంటి అనేక గుర్తోదయాల యొక్క సమాహార రూపంగా ఒక జన్మలో ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది.


19, సెప్టెంబర్ 2012, బుధవారం

శరణాగతే అవినీతికి మందు

"నాక్కొంచెం నమ్మకమివ్వు"

ఇది ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన నినాదం. సెక్యులరిజమ్ పేరుతో, శాస్త్రీయ దృక్పథం పేరుతో దేన్నీ నమ్మొద్దని, లౌకికంగా ఆలోచించమనీ మనుషులకి చిన్నప్పట్నుంచి గ్యాసుకొట్టాక ఇహ నమ్మకాలు ఎక్కణ్ణుంచి వస్తాయి ? ఉన్న నమ్మకాలన్నీ పోయి మనుషుల్లో స్వార్థం పెఱుగుతుంది (పెఱిగింది). మూఢనమ్మకాల్ని పారద్రోలే పేరిట మంచి నమ్మకాల్ని కూడా పారద్రోలుతున్నారు, పొలాల్లో ఎండోసల్ఫాన్ వేస్తే పురుగులతో పాటు మనుషులు కూడా చచ్చినట్లు ! స్వార్థం పెఱిగిన సమాజంలో మనుషులు మానసికంగా ఒంటరివాళ్ళయిపోతారు. ఎంతగా ఒంటరివాళ్ళవుతారో అంతగా అభద్రతాభావన హెచ్చుతుంది. అభద్రత హెచ్చేకొద్ది మానసిక స్థైర్యం కోసం ధనాన్ని ఆశ్రయించడం కూడా ముమ్మరమవుతుంది. మనసు ధనం కోసం వెంపరలాడేకొద్దీ ఎంత సంపాదించినా చాలదనిపిస్తుంది. అలా అనిపించాక ఏం చేశైనా సరే, ఇంకా సంపాదించాలనిపిస్తుంది. ఎవరో ఏదో సంపాదిస్తున్నారని మనం కూడా అలా సంపాదించాలనుకోవడం. అందుకని ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా, దారి తెలిసినా తెలియక పోయినా, ఒకవేళ మనం అనుకున్నట్లు సంపాదించగలిగితే దాన్తో మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో మనకే అర్థం కాకపోయినా గుడ్డెద్దులా ఆ చేలో పడి పోవడం. ఇదొక అంతులేని అగాధపు ఊబి. ఇదొక నిరంతర అశాంతిమయమైన, పైకి జబ్బులా కనిపించని మానసిక జబ్బు.

"డబ్బు, డబ్బు, డబ్బు" అని జపం చేస్తే డబ్బొస్తుందా ?

ఎవరి డబ్బో చూసి మనం ఆబగా లొట్టలేస్తే మనకి డబ్బొస్తుందా ?

డబ్బు సంపాదించినవాళ్ళ "Celebrated seven habits" ఏంటో పొల్లుపోకుండా తెలుసుకొని మనమూ వాటిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా డబ్బొస్తుందా ?

రాదు, రానేరాదు. ఎప్పటికీ రాదు.

డబ్బుయోగాన్ని మనిషి నుదుట దేవుడు రాయాలి. అలా రాయాలంటే మన పూర్వజన్మపుణ్యం కలిసిరావాలి. మన పుణ్యం ఖాతాలో డబ్బుంటే దాన్ని ఎవఱూ ఆపలేరు. ఆ నమ్మకం నిజంగా ఉంటే వెధవపనులు చేసి సంపాదిద్దామనే సంకల్పం మనుషుల్లో కలగదు. "దేవుడున్నాడు. ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఆయన నాకూ, నా కుటుంబానికీ అన్యాయం చేయడు. నా భక్తి, నా పుణ్యం, నా మంచితనం ఇవే నా వాళ్ళని కాపాడతాయి" అని నమ్ముకుంటే అదే జఱుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరలా నమ్ముకుంటున్నారు ? ఆత్మవిశ్వాసం పేరుతో తమ జీవితాల బాధ్యత పూర్తిగా తమ మీదనే వేసుకుంటున్నారు. నిజానికి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, అలా వేసుకోవడం తప్ప, అదీ ఎవడో చవకబారు వ్యక్తిత్వ చిట్కాలు చెప్పాడని ! ఈ కాలంలో పెచ్చుమీఱిన అవినీతికి కారణం దేవుడి మీద నమ్మకం లోపించడం. ఆయన తమ సంగతీ, తమ తరువాతి తరాల సంగతీ చూసుకుంటాడని విశ్వసించకపోవడం. తమకి చెందని తమ జీవితాల బరువుని తామే మొయ్యాలనుకోవడం.

Give God a chance. Give Nature a chance. Give spontaneity a chance.

ఇదే కర్మయోగం బోధించేది. ఆ తరువాత మీ జీవితం ఎంత నమ్మలేని విధంగా ఆనందమయంగా మారిపోతుందో మీరే చూస్తారు.

14.11.2009

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

రామనామం బరువా? రామనామానికి కరువా?

జై శ్రీరాం, 
శ్రీరామదూతం శిరసా నమామి! 

 
పెఱటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు, మన సంప్రదాయం, పెద్దలు మనకిచ్చిన అతి గొప్ప మంత్రాలను మనం అలాగే నిర్లక్ష్యం చేస్తున్నాం . ’రామ’ అనే పదాన్నీ, దాని శక్తిని తక్కువగా అంచనా వేసుకుని ఎంతో కోల్పోతున్నాం. ఎవఱైనా "చాలా కష్టం వచ్చింది. ఏం చెయ్యమంటావి ?" అని అడిగితే రామనామ జపం చెయ్యమని చెప్పి చూడండి, వాళ్ళ ప్రతిచర్య గమనించండి. "ఏమిటండీ, నేను ఇంత కష్టంలో ఉండి సలహా అడిగితే మీరు సింపుల్ గా రామనామం చెయ్యమని చెప్తారేంటి ?" అంటారు. అంటే సమస్య కనపడినంత పెద్దగా, ఆర్భాటంగా, హంగుగా పరిష్కారం కూడా ఉండాలన్నమాట. "ఇంత పెద్ద తతంగం చేస్తే ఈ సమస్య తప్పింది" అని చెప్పుకోవడానికా? అలాగని ఏ క్రతువునీ నేను తక్కువ చెయ్యట్లేదు. రామనామానికి ఆ శక్తి ఉంది కాబట్టి, పెద్దలు నిరూపించి కూడా చూపించారు కాబట్టి మనం చెప్తాం. అవతలివారికి కూడా నమ్మకం ఉండాలికదా,  ఆ నమ్మకం లేకుండా, "ఏమిటో ఉత్త రామనామం చేస్తే ఈ కష్టం తీఱిపోతుందా ?" అనుకుంటే ఎలా?  

గురువుగారు ఒక కధ చెప్తూ ఉండేవారు. విభీషణుని రాజ్యంలో ఎవఱికో సముద్రం దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళవలసిన అవసరం పడిందట. రాజుగారిని అడిగితే "నేను ఒక రక్ష కట్టి ఇస్తాను, అది చేతిలో పట్టుకుని నడువు, సముద్రంలో నువ్వు మునగవు, ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షను విప్పి చూడడానికి ప్రయత్నించకు" అన్నాడట. "సరే" అని అతను బయలుదేఱాడట. సగం సముద్రం దాటేసరికి ఉత్సుకత ఆపుకోలేక, "ఏముంది ఇంత శక్తివంతమైన  రక్షలో ?" అని విప్పి చూసాడట. "రామ" అని రాసి ఉందట. అందులో ! "ఓహ్ ఇంతేనా ?" అనుకున్నాడట, బుడుంగున మునిగిపోయాడట. ఇది సమస్యల్లో ఉన్నవారికి రామనామం చెయ్యమని చెప్తే ఎదురయ్యే పరిస్థితి,. 

శ్రీరామ ప్రాతిపదికమవశేనాఽపి సంగృణన్ |
ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం తతో బుద్ధి పూర్వకమ్ ||

అని రామాయణ మాహాత్మ్యం చెపుతోంది.  "అనుకోకుండా ఐనా రాముని తలుచుకుంటే ముక్తి దొఱుకుతుంది, ఇక బుద్ధిపూర్వకంగా తలుచుకుంటేనో...?"  అని ఈ శ్లోకానికి అర్ధం. ఇక మనకు బాగా కావాల్సిన వారనో, వృద్ధిలోకి రావాలనో రామనామాన్ని సిఫారసు చేస్తామనుకోండి. ఇక మొదలుపెడతారు వాళ్ళ బాధ్యతల చిట్టాలు. "ఇన్ని బరువుబాధ్యతల్లో ఎక్కడ కుదురుతుందండీ  చెయ్యడానికి ?" అని. "ఈ మోత బరువు ఇప్పుడెందుకు, రిటైరైన తర్వాత చేస్తాలే !" అని ! ఇదొక్కటే బరువు మనకి. కానీ నిజానికి అన్ని బరువులనీ వదిలించుకునే బరువు ఇది. ఈ బరువు ఒక్కటి మొయ్యడానికి సిద్ధపడితే మిగతావన్నీ తేలికైపోతాయి, వదిలిపోతాయి. ఇది తెలియక మనం రామనామం బరువనుకుంటున్నాం. కఱువొచ్చినట్టుగా మిగతా విషయాలకోసం పరిగెడుతున్నాం. 
 
ఏదైనా ఎక్కువ వాడితే లభ్యత తగ్గి కఱువొస్తుంది. కాని రామనామం పెఱుగుతుంది, శతకోటి సూర్యుల పగిది పెఱిగి, ప్రవర్ధమానమై, లోకాన్ని కాంతిమంతం చేస్తుంది. మనం చేసే రామనామం, మనల్నే కాక లోకం మొత్తాన్నీ ఉద్ధరిస్తుంది. ఇహపరసాధకం రామనామం. అందుకే మన పెద్దలు ఊరూరా రామునికి గుళ్ళు కట్టారు. తెలిసైనా, తెలియకైనా రాముడి గుఱించి అనుకుంటారనీ, బాగుపడతారనీ వారు చేసిన పని అది. ’రామ’ అనేది ఏదో రెండక్షరాల పదం కాదు”అది రెండున్నాయి’ అనుకునే స్థితి నుండిఅంతా ఒకటే’ అనే అద్వైత భావనని మనసులో పెంచగలదు.’లోకా స్సమస్తా స్సుఖినోభవంతుఅన్న ఋషివాక్యాన్ని పునఃప్రతిష్ఠించగలదు. అలాంటి అమేయమైన రామనామాన్ని బరువనుకోకుండా, ఎవఱూ చెప్పలేదనకుండా, నిత్యం జపిద్దాం. ఇహపరాలు రెండింటిలో సార్ధకత్వాన్ని పొందుదాం.  

ఏమైనా తప్పులుంటే పెద్దలు క్షమించి సరిదిద్దగలరు. రామనామం పట్ల, ఆ నామానికున్న శక్తి పట్ల నా తోటివాళ్ళ నిర్లక్ష్యాన్ని, నిరాసక్తతని చూసి ఆవేదనతో రాస్తున్నాను.

భవదీయుడు, మనోహర్ చెనికల....

28, ఆగస్టు 2011, ఆదివారం

శిష్యలక్షణములు

శ్రీ గురుభ్యోన్నమః

అందరికీ నమస్కారములు

ఇతః పూర్వము మనము గురువు, ఆచార్యుడు అన్న విషయం పై చర్చ జరిపి ఉన్నాం.
అలానే శిష్యునికు ఉండవలసిన ముఖ్య లక్షణములను గురించి తెలుసుకునే ప్రయత్నం
ఇది.

శాస్త్రంలో శిష్యునకు ఉండవలసిన లక్షణములు ఈ క్రింది విధంగా చెప్పబడింది.

ఈ క్రింది ఐదు లక్షణములు శిష్యునకు ఉండవలసినవి.
1) అనన్యసాధ్యత్వము
2) ఆర్తి
3) అధ్యవసాయము
4) ఆదరము
5) అనసూయ

1) అనన్యసాధ్యత్వము : సాధ్యాసాధ్యాలయందు ఆసక్తి లేకుండా తాను ఆశ్రయించిన
గురువు/ఆచార్యుని ద్వారా ఏది పొందవలెనో దానిమీదనే దృష్టి పెట్టి ఉండే
లక్షణము:
2) ఆర్తి : ఎట్టి పరిస్థితులలోనూ తాను పొందవలసిన దానికి దూరముగా జరుగక,
వ్యతిరిక్త పరిస్థితులలో కూడా తాను పొందవలసిన దానిపైననే ధ్యాస తప్ప ఇంకొక
మార్గముపై ధ్యాసలేకుండుట.
3) అధ్యవసాయము : తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తాను
తప్పక పొందవలెనన్న గట్టిపూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టి
పరచుకునేలక్షణము కలిగు ఉండుట.
4) ఆదరము : తాను తెలుసుకోవలసిన విద్య లేదా పొందవలసిన దానిని గూర్చిన విషయ
పరిజ్ఙానము సంపాదించుకొనే పథంలో ఆ విషయములను ఎవరు చెప్పిననూ చెప్పినవాడు
తక్కువ వాడా లేక ఎక్కువ వాడా అన్నది ఆలోచించక ఆదరముతో వినుట. వినయముతో
ఉండుట.
5) అనసూయ : తాను తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోయినను, పొందవలసినది
పొందలేకపోయినను, తానది పొందలేకపోయాను కాబట్టి దానియందు దోషములనెంచక దాని
గుణములను కీర్తించుట. ఇతరులు పొందిన గుణములను చూసి సంతోషించి
ప్రోత్సహించుట.

ఈ పై ఐదు లక్షణములు కలవారు ఆచార్యుని పొందటానికి సంపూర్ణ అర్హులు,
యోగ్యులు.

సర్వం శ్రీ ఉమా మహేశ్వరపరబ్రహ్మార్పణమస్తు

--

7, డిసెంబర్ 2010, మంగళవారం

మాస శివరాత్రి అంటే ఏమిటి ? : ఒక చర్చ

ప్రశ్న :

సభాయై నమః

మున్ముందుగా మాస శివరాత్రి సాధారణంగా ఏరోజు జరుపుకుంటారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చతుర్దసి తరువాత వచ్చే అమావాస్య అని అనుకుంటున్నాను. తెలిసిన వారు సరిదిద్ద గలరు.

తరువాత విషయంగా శివరాత్రిని మాసానికి ఒకసారి చేసుకోవడం వెనకాల విశేషమేమిటో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చేదే అని. ఇలా మాసమునకు ఒకసారి శివరాత్రి చేసుకోవడం వెనకాల ఉన్న ప్రాశస్త్యం తెలిసిన వారు వివరించ మనవి.

--భవదీయుడు
_______________________________________

సమాధానము



నమస్తే!

ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టనములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు. ఉన్నవేమో తెలీదు.) ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి (దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]

ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు చీకట్లను తొలగించడానికి జ్యోతీరూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ, కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా జరుపుకోవాలని(జన్మానికో శివరాత్రి అని నానుడి) పెద్దలు నిశ్చయం చేశారు.

మీ ప్రశ్నకు పూర్తిగా సమాధానము చెప్పకపోయి ఉండవచ్చు. నాకు తెలిసినంత మేరకు మాత్రమే చెప్పాను కాని అంతా చెప్పినట్లు కాదు. ఇంకా విజ్ఙులైన పెద్దలు మరికొన్ని విశేష విషయములేమన్నా ఉన్నవేమో తెల్పండి, తప్పులేమైనాఉంటే సరిదిద్ధండి.

సూర్యనాగేంద్రకుమార్ అయ్యగారి

2, అక్టోబర్ 2009, శుక్రవారం

భగవత్ పూజావిధానము-2


పూజ ఎందుకు చెయ్యాలి ? - 1


మతాన్ని కాపాడ్డమంటే మతాన్ని ఆచరించడమే. ఎవరూ మాట్లాడని భాష ఏ విధంగా నైతే మృతభాష కింద లెక్కో అదే విధంగా ఎవరూ ఆచరించని మతం, ఎవరికీ బోధపడని మతం కూడా మృతమతం కిందనే లెక్క. ఆ మతానికి ఎంత చరిత్రయినా ఉండొచ్చు. ఎంతమందైనా ఆ మతం పేరుతో జనాభా లెక్కల్లో నమోదై ఉండొచ్చు. లేదా ఆ మతానికి సంబంధించి ఎన్ని పవిత్ర గ్రంథాలైనా గ్రంథాలయాల్లో మూలుగుతూ ఉండొచ్చు. ఏమీ లాభం లేదు. అది మృతమతమే అవుతుంది. మతంలో రకరకాలవాళ్ళని మనం చూస్తూంటాం. "ఫలానా మతస్థుల" మని చెప్పుకొని అంతటితో ఆగిపోయేవాళ్ళు కొందఱు. "మామతదేవుణ్ణి నమ్ముతా కానీ పూజలూ గట్రా ఏమీ చెయ్యను. దేవుడికి నా కష్టసుఖాలు తెలియవా ? నేను పూజ చేసి మఱీ చెప్పాలా ?" అనేవాళ్ళు కొందఱు. "ఏదో శక్తి ఉందని నమ్ముతా కానీ దేవుడంటే మా మతదేవుడిలానే ఉంటాడంటే ఎందుకో నమ్మలే"నని ఇంకొందఱు. "దేవుణ్ణి నమ్ముతా, గుళ్ళకీ, గోపురాలకీ కూడా వెళతా. కానీ మా మతం గుఱించి నాకేమీ తెలియదు." అనేవాళ్ళు కొందఱు. "దేవుడున్నాడని నమ్ముతా కానీ సంప్రదాయాల మీదా, శాస్త్రం మీదా విశ్వాసం లే" దనేవాళ్ళు ఇంకొందఱు. జాగ్రత్తగా గమనిస్తే ఈ విధమైన వాగ్ధోరణిలో నిద్రాణమైన నాస్తికత్వాన్ని, లేదా ప్రచ్ఛన్న నాస్తికత్వాన్ని, భావి నాస్తికత్వాన్ని మనం వాసన పట్టవచ్చు. మన గతానుభవాల్ని బట్టి - ఇలా మాట్లాడేవాళ్ళంతా ఏదో ఒక దురదృష్టకరమైన రోజున మతం మారే అవకాశం గానీ, నాస్తికులుగా పరిణమించే అవకాశం గానీ ఉందని ఊహించవచ్చు. ఇలాంటివాళ్ళతో నిండిపోయిన జీవన్ మతం పూర్తిగా మృతమతం కాకపోయినా జీవన్ మృతమతం అనీ, మ్రియమాణ మతం (dying faith) అనీ చెప్పుకోవచ్చు.

క్రమం తప్పని అనునిత్య, దైనందిన భగవత్ పూజ ఆచరణాత్మకమైన మతావలంబనకి తొలిమెట్టు. పూజ ద్వారా పైన పేర్కొన్న సందిగ్ధ జనాభాశ్రేణుల్లోంచి మనం బయటపడి నిజమైన నిజాయితీ గల మతావలంబకులుగా మారతాం. వర్తమానంలో పెక్కుమంది యౌవనులు తాము దైవభక్తులమని గానీ, రోజూ పూజ చేస్తామని గానీ, తమకి ఇతరత్రా మతవిశ్వాసాలున్నాయని గానీ చెప్పుకోవడానికి సంకోచించే వాతావరణం నెలకొని ఉంది. సామూహికంగా భజనల్లో పాల్గొని మనసారా భగవంతుడి లీలల్ని నలుగుఱిలో ఎలుగెత్తి గానం చేయడానికి, దేవుడి ముందు వినయంగా సాష్టాంగపడ్డానికీ కూడా సిగ్గుపడేవాళ్ళున్నారు. బొట్టు పెట్టుకోవడం చాదస్తమనుకునేవాళ్ళున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది సినిమా హీరోల/ హీరోయిన్ ల ప్రభావం. మన సమకాలీన సినిమాలన్నీ పూర్తిగా Godless. సినిమా కథల్లో హీరోని చూపించే విధానం - అతన్నొక సూపర్ మ్యాన్ గా, స్పైడర్ మ్యాన్ గా దేవుణ్ణీ, అదృష్టాన్ని నమ్ముకోని శిలాకర్కశమైన ఆత్మవిశ్వాసం గలవాడుగా, అసలు అతనే దేవుడన్నట్లు చూపిస్తారు. కానీ అలాంటి మగవాళ్ళెవరూ ప్రపంచంలో లేరు. తన భార్యాబిడ్డలకి తప్ప మగవాడెవరికీ దేవుడు కాదు. వాస్తవ జీవితంలో అందఱమూ కమెడియన్లమే. ప్రతి మగవాడూ ప్రాథమికంగా ఒక తల్లి ఒళ్ళో బిడ్డ మాత్రమే. ఒకడికి ఒకటుంటే ఇంకొకటుండదు. జగదేకవీరుడైన అర్జునుడే 18 అక్షౌహిణుల సైన్యాన్ని చూసి బెంబేలెత్తి శ్రీకృష్ణుణ్ణి శరణుజొచ్చాడు. ప్రపంచంలోకెల్లా సాటిలేని బలశాలి (పరిగెత్తుతున్న రైళ్ళని వెనక్కి లాగేసేవాడు) అని పేరుపొందిన కీ.శే. కోడి రామమూర్తిగారు తాను చిన్నప్పట్నుంచి ఆంజనేయస్వామి భక్తుణ్ణని చెప్పుకున్నారు.

కానీ ఇందాక పేర్కొన్న ఊహాకల్పిత మేషో మగవాళ్ళు, ఈ ఎనిమిది పలకల (8-pack bodies) వికారులు, ఆధ్యాత్మిక బికారులు మన మగపిల్లలకీ, ఆడపిల్లలకీ ఆదర్శమై కూర్చున్నారు. దాన్తో దేవుణ్ణి నమ్మడం, ఆయన మీద ఆధారపడ్డం హీనమైనదనే తప్పుడు భావన సమాజంలో వ్యాపించింది. తద్విరుద్ధమైన ఆలోచనలూ, ప్రవర్తన డైనమిజమ్ గా ప్రచారంలోకి వచ్చాయి. "భగవదనుగ్రహం చేత విజయం సాధించాను, దైవకృప వల్ల జీవితంలో పైకొచ్చాను" అని మాట్లాడేవాణ్ణి అసమర్థుడుగా చూడ్డం అలవాటు చేసుకున్నారు. దైవప్రమేయం లేకుండానే జీవితాలూ, జగత్తూ ఉన్నాయనే ఘోర అజ్ఞాన భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. దైవభక్తులైన యువకులకి ఆడపిల్లల్లో సెక్స్ అప్పీల్ తగ్గిపోయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మన బ్లాగుల్లో కూడా దేవుణ్ణి నమ్మని (కనీసం అలా చెప్పుకుంటున్న) బ్లాగర్లకి ఆడవాళ్ళలో పాపులారిటీ ఎక్కువ. అయితే దేవుణ్ణి నమ్మని, ఆయనకి భయపడని, ఆయన మీద ఆధారపడని మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళకి భద్రత గుండుసున్నా అనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఆడవాళ్ళపై నానాటికీ పెరిగిపోతున్న దారుణ మారణ హింసాకాండలకీ, ఈ ఆధునిక తప్పుడు Godless మేషో పురుషత్వ ప్రదర్శనకీ మధ్య ఉన్న సూక్ష్మ, రహస్య సంబంధాన్ని గ్రహించలేకపోతున్నారు.

మనం పూజలు మానెయ్యడానికి గల రెండో కారణం - స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగం ద్వారా విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన కుహనా సెక్యులర్ విలువలు. సంస్కృతీ, మతమూ, దేవుడూ వేఱు కాదు. మతాన్ని బహిష్కరించడమంటే దేవుణ్ణి బహిష్కరించడమే. ప్రభుత్వాన్ని irreligious చెయ్యడమంటే దాన్ని Godless, uncultured చెయ్యడం కిందనే లెక్క. ప్రభుత్వం ద్వారా ప్రచారం చెయ్యబడ్డ ఈ సర్కారీ సిద్ధాంతం అనతికాలంలోనే ప్రైవేట్ సంస్థలకి కూడా ప్రాకింది. ఆ తరువాత ఆ ప్రైవేట్ సంస్థల్లోంచి కుటుంబాలక్కూడా ప్రాకింది. మతం ప్రైవేట్ విషయమని వాదించడం మొదలుపెట్టారు. అసలు సెక్సే ప్రైవేట్ విషయం కానప్పుడు, సెక్సు కోసం చట్టాలే ఉన్నప్పుడు, ఒకరికొకరు రాసుకుంటున్న వేగులే ప్రైవేట్ విషయం కానప్పుడు చరిత్రతో సహా అన్ని జీవితరంగాల్లోను, ఆఖరికి జాతీయతా భావనలో కూడా ముఖ్యమైన పాత్ర గల మతం ఎలా ప్రైవేట్ అవుతుందనే ప్రశ్నకి సమాధానం లేదు. మన మెజారిటీ మనస్తత్త్వ రీత్యా ఈ దేశానికి సెక్యులరిజమ్ నప్పదు. మనకి కాస్తో కూస్తో నప్పేది బహుశా సర్వమత "సమభావనే". కానీ నెహ్రూ వంటి కొద్దిమంది (మైనారిటీ) మేధావులు ప్రభుత్వం మీద గుత్తాధిపత్యం కొట్టేసి వాళ్ళ సెక్యులరిజమ్/ నాస్తిక భావనల్ని మతవిశ్వాసాలు గల మెజారిటీ మీద రుద్ది ఆ తరువాతే అదే కరెక్టని వాదించడం మొదలుపెట్టారు.

మూడో కారణం - ఇటీవలి కాలంలో హిందువులకి పట్టిన డబ్బు మేనియా.

నాలుగో కారణం - దైవభక్తి అనేది ముసలితనానికి సంబంధించినదనే అపోహ. మావాడికి ఉపనయనం చేసినప్పుడు - అనేకమంది (బ్రాహ్మలే) "అప్పుడే ఉపనయనమేంటి ? వాడికింకా వయసు ఏం మించిపోయిందని ? ఇప్పుడే పూజలూ గట్రా ఏంటి ? "అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి వాళ్ళు మాట్లాడకూడని మాటలివి. అసలు, ఉపనయనం ఆలస్యమైనందుకు మేము ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాల్సి వచ్చింది. బ్రాహ్మల పరిస్థితే ఇలా ఉంటే ఇహ మిహతా జనాభా పరిస్థితేంటి ?

నేను చెప్పేదేంటంటే - మనం నిజంగా హిందూ మతావలంబకులం కావాలంటే ఆ పనిని ముందు మనింటినుంచే మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే మనం మన సాంప్రదాయిక వంశపారంపర్య పూజల్ని తప్పనిసరిగా ప్రతిరోజూ నిర్వర్తించి తీఱాలి. ఇందునిమిత్తం అఱవయ్యేళ్ళ సర్కారీ సిద్ధాంతాలు నూఱిపోసిన ఆత్మన్యూనతా (inferiority complex) భావాల నుంచి, సినిమాలవాళ్ళు నూఱిపోస్తున్న పిచ్చకొట్టుడు, బండలాగుడు మేషో పురుషత్వ భావనల నుంచి బయటపడాలి. మన దివ్యపిత అయిన భగవంతునికి మనల్ని మనం సవినయంగా సమర్పించుకొని సర్వశరణాగతి చెయ్యాలి. తరతరాల హిందూ సంకెలలో మనం లంకెలమనీ, మన తరువాత కూడా హిందూ తరాలనేవి ఉన్నాయని, ఉండాలని అనుకొని నిత్యపూజలు మొదలుపెట్టాలి.

ప్రతి మతావలంబకులకీ ఒక తప్పనిసరి ఆధ్యాత్మిక దినచర్య విధించబడింది. ముస్లిములు అయిదుసార్లు నమాజు చెయ్యాలి. ఇంట్లో ప్రార్థనలు చేసినా, చెయ్యకపోయినా ప్రతి క్రైస్తవుడూ ఆదివారం పూట చర్చికెళతాడు. అలాంటి దినచర్య హిందూమతంలో కూడా విధించబడినప్పటికీ హిందువుల్లో కనీసం ఒక్కశాతమైనా రోజుకొకసారైనా భగవంతుణ్ణి స్మరిస్తారో లేదో నాకు అనుమానమే. దైవభక్తి ముసలితనానికి సంబంధించినదనే అపోహే ఇందుక్కారణం. చిన్నప్పుడు లేనిది పెద్దప్పుడు హఠాత్తుగా వచ్చిపడదు. The spirit of teens sustains man for a lifetime.

మఱికొంత తరువాత....

భగవత్ పూజావిధానము-1

హిందూమతంలో ప్రార్థనలుండవు. స్తోత్రాలూ, పూజలూ, ఉపాసనలూ మాత్రమే ఉంటాయి. అయితే అలాగని ప్రార్థనల మీద హిందూమతంలో నిషేధమేమీ లేదు. కానీ మన పూర్వులు వాటిని అంతగా ఇష్టపడకపోవడానికి, కొన్ని కారణాలుండి ఉండొచ్చు. మొదటిది - మానవ ప్రార్థనలన్నీ కోరికల మయం. కానీ మోక్ష పురుషార్థం కొఱకు ఆ కోరికల్ని జయించమనే హిందూమతం చెబుతున్నది. రెండోది - ప్రార్థనలన్నీ వాక్కుల మయం. కానీ ఆత్మ/ పరమాత్మ వాక్కుల కతీతం, అవాఙ్మానస గోచరం. నిజంగా మనసు నిండినప్పుడు వాక్కులు మూగబోతాయి. కనుక వాగ్ భూయిష్ఠమైన ఉపాసన, వాగ్ భూయిష్ఠ ప్రేమలాగే సాధారణంగా ఉపరితలీయం (superficial) గా ఉంటుంది. ప్రార్థనలు చేసేవారు భగవంతుడికి చెప్పినదే చెబుతూ, మాట్లాడినదే మాట్లాడుతూ తమ మనస్సుల్ని తాత్కాలికంగా ప్రశాంతపఱచుకుంటారు తప్ప భగవత్ తత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆయన మహిమను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించరు. అంటే వారి సావధానానికి భగవంతుడు కేంద్రం కావడం మానేసి తమకు తామే కేంద్రమవుతారు. మఱికొన్నిసార్లు ఈ వాక్కర్మ మన మనస్సుల్ని మఱింత కల్లోలితం కావిస్తుందే తప్ప ప్రశాంతపఱచదు కూడా. అన్నింటి కంటే ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉండొచ్చు ననుకుంటున్నాను. అది, సంస్కృతంలో తప్ప ఇంకే భాషలో దేవుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థనలకి మంత్రబలం ఉండదు కనుక ఆ విధమైన సాధన వృథా అవుతుందేమోననే అంతర్గత సంకోచం.

అందుచేత మనవారు మనసా, వాచా, కర్మణా భగవంతుడికి జీవాత్మను అంకితం చేసే నిమిత్తం పూజావిధానాల్ని నిర్దేశించారు. మనసులో భగవంతుడు, మాటలో మంత్రము, చేతిలో భగవత్ పూజాద్రవ్యాలు - వెరశి సర్వతోముఖ భగవత్ సాన్నిధ్య సాధనే పూజ. ఈ పూజావిధానాలు ఎప్పుడు ఎవరి ప్రోక్తంగా మొదలయ్యాయో తెలియదు. ఇవి బహుశా అనాది. యజ్ఞ-యాగాదులూ, హోమాలూ చేసేటప్పుడు కూడా హోమగుండానికి బొట్లు పెట్టి, చుట్టూ ముగ్గులేసి దీపం వెలిగించి పసుపు- కుంకుమలతోను, పూలతోను అర్చించాలనీ, నైవేద్యం సమర్పించాలనీ నియమం ఉంది కనుక ఈ పద్ధతి వేదకాలం నుంచే అనూచానంగా వస్తున్నదని తెలుస్తోంది.

అలాగే దేవుణ్ణి మానవరూపంలో ఉపాసించడం (anthropomorphic worship) కూడా వైదిక సంప్రదాయమే. వేదసూక్తాలలో ప్రతిదేవుణ్ణి, దేవతనీ విపులంగా వారి శరీర లక్షణాలతో, అలవాట్లతో సహా వర్ణించారు. కనుక కొంతమంది ధర్మద్వేషులు ప్రచారం చేసినట్లు మన వేదఋషులు క్రైస్తవుల్లా, మహ్మదీయుల్లా పూర్తి నిర్గుణోపాసకులు కారు. వారు కూడా మనలాగానే విగ్రహారాధకులే. వేదిక్ హిందూయిజమ్ (వేదిక్ రెల్జన్), పురాణిక్ హిందూయిజమ్, మాడర్న్ హిందూయిజమ్, బ్రాహ్మణిజమ్ అంటూ ధర్మద్వేషులు చేస్తున్న విభజన పూర్తిగా అశాస్త్రీయం, చరిత్రవిరుద్ధం, వాస్తవదూరం కూడా. పరిశోధకులు ఎవరి వ్యక్తిగత తిక్కల కనుగుణంగా వారు వివిధ నామాలు తగిలించినా స్వభావతః అవన్నీ ఒకటే. క్షుద్రోపాసనతో సహా ఇప్పుడున్నవన్నీ అప్పుడూ ఉన్నాయి, అప్పుడున్నవి ఇప్పుడు పూర్తిగా లేకపోయినా !

వేదాలు ఎంత ప్రాచీనమైనా, ఆ కాలం నుంచి మనం ఇప్పుడు ఎంత దూరంగా వచ్చేసినా, ఆ సూక్తాల్లో మనకు దర్శనమిచ్చే దేవతల్లో అనేకమందిని మనం ఇప్పుడు కూడా రోజూ పూజిస్తున్నాం. కనుక మన ఈనాటి పూజలన్నీ వైదికమే. ఆ గ్రహాలే ఈ గ్రహాలు. ఆ సూర్యుడే ఈ సూర్యుడు. ఆ చంద్రుడే ఈ చంద్రుడు. ఆ భూదేవే ఈ భూదేవి. ఆ గణపతే ఈ గణపతి. ఆ రుద్రుడే ఈ రుద్రుడు. ఆ ఉమాదేవే ఈ ఉమాదేవి. ఆ విష్ణువే ఈ విష్ణువు. ఆ లక్ష్మే ఈ లక్ష్మి. ఆ సరస్వతే ఈ సరస్వతి. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మ. ఇహ పంచభూతాల సంగతి, దిక్పాలకుల సంగతి చెప్పనక్కఱలేదు. వేదాలు నేర్చుకునే అవకాశం పూర్వకాలంలో అధిక సంఖ్యాకులకి లేకపోయినా ఈ దేవీదేవుళ్ళని అందఱూ నమ్మేవారు కనుక, ఈ పూజలు అందఱూ చేసుకునేవారు కనుక వారు వైదికులైనట్లే లెక్క. జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు లాంటి వేదాంగాలు కూడా లక్షణంగా రక్తమాంసాలతో, జవసత్త్వాలతో బతికే ఉన్నాయి, ఇప్పటికీ వేలాది ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలల్లోను, కళాశాలల్లోను అందఱికీ శుభ్రంగా నేర్పిస్తున్నారు. కనుక వేదమతమూ, హిందూమతమూ ఒకటి కాదని వాదించే ఆధునిక ధర్మద్వేషులకి ఈ వాస్తవాల్ని వివరించి తగినట్లుగా బుద్ధి గఱపాల్సి ఉంది.

ప్రపంచంలో మానవత్వం పూర్తిగా చనిపోయినప్పుడే హిందూధర్మం కూడా చనిపోతుంది. అలా కానప్పుడు దానికి చావు లేదు. ఎందుకంటే ఈ మార్గం ప్రకృతి-ప్రసాదితమైన, మానవ సహజ ప్రేరణల మీద, మానవీయ సహజాతాల (instincts) మీదా ఆధారపడినట్టిది. ఇది మనుషుల మీద వారి స్వభావాలకి విరుద్ధంగా రుద్ధబడిన ప్రవర్తనా నియమావళి (Code) కాదు. ప్రేమాస్పదుల ప్రతిరూపాలు మనకి అత్యంత ప్రియతమాలు. వారి ఛాయాచిత్రాల్ని చట్రం కట్టించి ఇంట్లో గోడకి తగిలిస్తాం. బల్లసొఱుగుల (desks) లో దాచుకుంటాం. చేజోళ్ళ (wallets) లో భద్రపఱచుకుంటాం. మనకే అధికారం ఉంటే వారి విగ్రహాన్ని వీథి మొగసాలలో ప్రతిష్ఠిస్తాం కూడా ! ఒకవేళ ఆ ప్రియతముడు భగవంతుడే అయితే ? ఆయన ప్రతిరూపాన్ని మన దగ్గఱ పెట్టుకొని అనునిత్యం చూసుకుందామనుకోమా ? హైందవేతర ప్రపంచంలో ఆ ప్రేరణ లేనివారెవరైనా మిలియన్లాదిగా ఉంటే అప్పుడు హిందువులు నిజంగానే మూర్ఖులు.

హిందూమతం కంటే మానవత్వం గల మతమేదీ లేదు. దేవుడిలో మానవుణ్ణి చూసి పూజించమనే మతం ఇదొక్కటే. అలాగే మానవుడిలో దేవుణ్ణి చూడమని చెప్పే మతమూ ఇదొక్కటే. మనిషిలో దేవుడున్నాడన్నవాణ్ణి దైవద్రోహిగా భావించి ఇతరమతాల్లో చంపినా చంపుతారు. పూజ అంటే అసలర్థం గౌరవించడం ! మనం పూజ పేరుతో చేసే అర్ఘ్యం, పాద్యం, ఆరతి, నైవేద్యం మొదలైన విధివిధానం యావత్తు భగవంతుణ్ణి మానవుడుగా భావించి గౌరవించి చేసే సేవ. మన యింటికొచ్చిన మానవుణ్ణి ఎలా గౌరవిస్తామో అలాగే భగవంతుణ్ణి కూడా భయభక్తులతో గౌరవిస్తే ఆయన సంతోషిస్తాడని చెప్పడమే ఈ విధివిధానంలోని ప్రధానోద్దేశ్యం. ఈ పూజ అనే అలవాటు మనకి తోటి మానవుల పట్ల కూడా ఎలా నడచుకోవాలనేదానికి ఒక మార్గదర్శనం.

మఱికొంత తరువాత...

5, సెప్టెంబర్ 2009, శనివారం

Every Package comes with a Baggage

అనగనగా ఒక మంత్రాల చింతక్కకి ఇద్దఱు మనవరాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలోనే కాలం చెయ్యడంతో శ్రీమతి చింతక్క అన్నీ తానే అయి వాళ్ళని పెంచింది. వాళ్ళలో చిన్నమ్మాయి పెంకె ఘటం.ఆమె ముసలమ్మ చెప్పిన మాటేదీవినేది కాదు. పెద్దమ్మాయి మాత్రం చింతక్క చెప్పినట్లే నడుచుకుని ఊళ్ళో మంచిపేరు తెచ్చుకుంది. ఒకసారి చింతక్క పెద్దమ్మాయిని, "నీ యింట్లో తీసినవస్తువు తీసినచోట ఉండదు. ఇంటినిండా ఎక్కడ పడితే అక్కడ అశుద్ధాలు ఉంటాయి.నీ యింట్లో ఎప్పుడూ ఏడుపులూ పెడబొబ్బలూ గోల..." అని ఆశీర్వదించింది. పెద్దమ్మాయి హతాశురాలైంది. ఇదేం ఆశీర్వాదమో అర్థం కాలేదు. అదే చింతక్క చిన్నమ్మాయిని "నీ యిల్లెప్పుడూ సర్దినది సర్దినట్లు అతిశుభ్రంగా ఉంటుంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది." అని ఆశీర్వదించింది. చిన్నది ఆ ఆశీర్వాదానికి ఉబ్బి తబ్బిబ్బయింది. కొంతకాలం గడిచాక వాళ్ళిద్దఱికీ పెళ్ళిళ్ళయ్యాయి. చింతక్క చనిపోయింది. కాపురానికి వెళ్ళిన పెద్దమ్మాయికి వరుసగా ఆఱుగుఱు పిల్లలు పుట్టారు. వాళ్ళ ఏడుపులతో, పెడబొబ్బలతో, అల్లరితో ఆమె యిల్లంతా దద్దఱిల్లసాగింది. చిన్నమ్మాయికి పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. అందుచేత ఆమె యిల్లు ఎప్పుడూ అతిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేది. ఎక్కడి వస్తువులు అక్కడ కదలకుండా రూపు చెడకుండా ఉండేవి. అవ్వ ఆశీర్వాదాల్లోని అంతరార్థం అప్పుడు బోధపడింది అక్కాచెల్లెళ్ళకి.

ప్రపంచంలో పనికిరాని పదార్థమంటూ ఏదీ లేదు. కనుక చెత్త కూడా ఏమీ లేదు. కాబట్టి మన శుభ్రతా నియమాలు వర్తించే దేశలాలాల పరిధి అతిసంకుచితం. "Dirt is not dirt, but only something in the wrong place" అన్నారు Lord Palmerston ఒక సందర్భంలో ! కనుక శుభ్రత కంటే శుచి ముఖ్యం. శుచి అంటే మానసిక శుభ్రత. మనం మాట్లాడే ప్రతి వంకరమాట వల్లా, మనం చేసే ఒక్కొక్క కుటిల చేష్ట వల్లా ఆత్మ తేజస్సు ఒక్కొక్క పొఱగా మఱుగున పడిపోతూ ఉంటుంది. అది అలా మఱుగున పడిపోవడానికే 'పాపం' అని పేరు. ఆత్మ అంటే ఎవరో కాదు,"అసలైన మనం". మాజీ దేవుళ్ళమైన మనం ఇలా జీవులుగా మారిపోవడానికి కారణం పాపం. మనిషికి పాపాలు మాత్రమే అంటుకుంటాయి. పుణ్యమంటూ ఏమీ లేదు. పుణ్యం పేరుతో మనం చేసే ప్రతి పనీ ఆత్మ చుట్టూ పేఱుకుపోయిన అవనసరపు పాప పదార్థపు పొఱల్ని తొలగించి వాటి కింద మఱుగున పడ్డ ఆ స్వకీయ (original) తేజస్సుని వెలికి తేవడానికే.

శ్లో|| అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచి : ||

పుండరీకాక్ష ! పుండరీకాక్ష !! పుండరీకాక్ష !!!

తా|| పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, పుండరీకాక్షుని తలచినవాడు లోపలా, బయటా కూడా శుచియే అవుతాడు. (పుండరీకాక్ష ! అని ముమ్మారు బిగ్గఱగా పలుకు)

అతిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని, అనుగ్రహాన్ని కోల్పోతాం. కొన్ని దేవాలయాల్లో విపరీతంగా ఉక్కపోస్తుంది. అలాగని అలాంటి గుళ్ళకు వెళ్ళొచ్చాక స్నానం చెయ్యడం గాని ఒళ్ళు కడుక్కోవడం గాని చెయ్యకూడదు. ఆ గుడిలోని దేవుడి అనుగ్రహ దృష్టి మన శరీరాలకు తాకి ఉంటుంది గనుక వెంటనే స్నానం చెయ్యడమంటే ఆ అనుగ్రహాన్ని వదిలించుకోవడమే అవుతుంది.

అద్దె (కిరాయి) ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ యిల్లు కడక్కూడదని పెద్దలు చెబుతారు. కడిగితే ఆ యింటి యజమానికి దరిద్రం చుట్టుకుంటుం దంటారు. ఇంకొందఱు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతారు. దేవాలయం ఎలాంటిదో మనయిల్లు కూడా అలాంటిదే. మన యింట్లో కూడా అదృశ్యంగా దేవతలు (వివిధ శక్తులు) సంచరిస్తారు. వాళ్ళు మనంపూజించినవాళ్ళు కాకపోయినా మన పూర్వీకులు పూజించినవాళ్ళయి ఉంటారు. చెప్పులు వేసుకుని తిరిగే యిళ్ళలోంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. కొన్నిసార్లు ఒకే ఒక్క తరం లోపల అలాంటి యిళ్ళు దయనీయమైన దరిద్రాన్ని రుచిచూస్తాయి. "మాకు బయటికి వేసుకునే చెప్పులు వేఱు, ఇంట్లో వేసుకునే చెప్పులు వేఱు" అని కొందఱు సర్దుకో జూస్తారు. కాని అటువంటి తేడా ఉన్నట్లు పెద్దలు చెప్పలేదు.

కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం, పనిమనుషులతో కూడా అలా చెప్పి చేయించడం- ఇవన్నీ పనివాళ్ళ శాపాలకు కారణమౌతాయి. అతిశుభ్రతని పాటించే స్త్రీలు సంతాన గోపాలస్వామి శాపానిక్కూడా గుఱవుతారు. వారు సాధారణంగా పరమ పిసినిగొట్లయి ఉంటారు. వారికి బొత్తిగా సంతానం లేకపోవడమో, లేదా ఒక్క సంతానమే మిగలడమో జఱుగుతుంది. మఱికొందఱు, తినే అన్నాన్ని అసహ్యించుకుంటారు. దాన్ని ఎంగిలిగా, అంటుగా భావిస్తారు. అందుకని అన్నం చేతికి అంటకుండా బిరుసుగా వండమని వంటచేసేవారిని హెచ్చఱిస్తారు. అలా వండకపోతే రాద్ధాంతానికి దిగుతారు. వారు ఒక గ్లాసెడు నీళ్ళు దగ్గఱ పెట్టుకుని అన్నాన్ని తాకినప్పుడల్లా ఆ చేతిని ఆ గ్లాసులో ముంచుతూంటారు. ఆ విధంగా అన్నాన్ని అసహ్యించుకోవడం ద్వారా వాళ్ళు అన్నపూర్ణాదేవి శాపానికి గుఱవుతారు.

అతిశుభ్రస్థులు యావత్‌ప్రపంచాన్నీ ఒక మహా బ్యాక్టీరియాగాను, బృహద్ వైరస్‌గాను విలోకిస్తారు. ఇది తోటి మనుషుల్ని సైతం అకారణంగా అసహ్యించుకోవడానికి దారితీస్తుంది. ఆఖరికి మనిషి స్పర్శే, మనిషి పొడే కిట్టకుండా పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళందఱి శాపాలూ తప్పనిసరిగా తగుల్తాయి.

విశ్వం (Universe) అంతా అమ్మవారి స్వరూపం. ఆహారరూపంలో అందఱమూ భూమిలో నుంచే వచ్చాం. మళ్ళీ అందులోకే వెళ్ళిపోతాం. చనిపోయాక ఇతరులకు ఆహారంగా మారతాం.

"అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద: !

అహమన్నమ్ అహమన్నమ్ అహమన్నమ్." (తైత్తిరీయోపనిషత్తు)

తా|| 'అన్నం తినేవాణ్ణీ నేనే. (ఇతర జీవులకు) అన్నాన్నీ నేనే' అంటున్నాడొక ఋషి.

ప్రపంచాన్ని అసహ్యించుకోవడం అమ్మవారినే అసహ్యించుకోవడం కిందికొస్తుంది. అలాగే మనుషుల్నిఅసహ్యించుకోవడం ఆమె భర్త అయిన సర్వాంతర్యామిని (పరమాత్ముణ్ణి) అసహ్యించుకోవడం కిందికొస్తుంది. వారి శాపాల నుంచితప్పించుకోలేరు. ప్రపంచంలో సంపద ఉన్న చోటల్లా ముఱికి కూడా ఉంటుంది. మనకు శుభ్రతే ముఖ్యమైతేఎడార్లు చాలా శుభ్రంగా ఉంటాయి. అక్కడికి పోయి బతకొచ్చు. ఇల్లు కట్టే చోట ఇసుకా, సిమెంటూ చెల్లాచెదఱుగా పడి ఉంటాయి. పంటలు పండే భూములు బుఱద బుఱదగా ఉంటాయి.

మానసికంగా ఆస్పత్రిలో జీవించడం మానేద్దాం. రోగాల్ని, డాక్టర్లనీ, వైరసులనీ కాసేపు మర్చిపోదాం. ప్రపంచాన్ని ప్రేమిద్దాం. జీవుల్ని ప్రేమిద్దాం. తోటి మనుషుల్ని ప్రేమిద్దాం.

2, సెప్టెంబర్ 2009, బుధవారం

సవాళ్ళు ఎన్నో - సమాధానం ఒక్కటే !

తల్లి-తండ్రి-గురువు-దైవం (मां - बाप - गुरु और भगवान)

తల్లి ద్వారా తండ్రిని, తండ్రి ద్వారా గురువుని, గురువు ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవాలి. వీరిలో మొదటి ముగ్గుఱి పారంపర్యాన్ని గౌరవించి అనుసరించడమే హిందూధర్మ సారాంశం. ఇదే ఇహముందు మన (హిందువుల) వాదం, నినాదం అవ్వాలి. స్వాతంత్ర్యోద్యమంలో "వందేమాతరం" లా ఇదే ఇహముందు మనల్ని నడిపే పవిత్ర అష్టాక్షరీమంత్రం అవ్వాలి.

౧. అయ్యవారే తప్ప అమ్మవారు లేరనే మతాలవారికి ఇదే మన సమాధానం.

౨. జంతువుల్లో మాదిరి మనుషుల్లో కూడా అమ్మ తప్ప అయ్య అవసరం లేదనే ర్యాడికల్ ఫెమినిస్టులకి ఇదే సమాధానం.

౩. గురువు స్థానాన్ని దిగజార్చి విద్యని వ్యాపారంగా మార్చిన విద్యావ్యాపారులకి ఇదే సమాధానం.

౪. గురువుని అందఱిలాంటి జీతబత్తేల ఉద్యోగిగా, బంట్రోతుగా మార్చిన నీచప్రభుత్వాలకి ఇదే సమాధానం.

౫. మాతాపితృ భావనకి విరుద్ధమైన (హోమోసెక్స్ లాంటి) అసహజ సంబంధాల్ని ప్రోత్సహించేవారికి ఇదే సమాధానం.

౬. ఒకపక్క తల్లిదండ్రుల ద్వారా పరిచితమైన జాతీయత మీద ఆధారపడి బతుకుతూనే మఱోపక్క ఆ తల్లిదండ్రుల్నే విడగొట్టేందుకు అవసరమైన పరమచండాల చట్టాలు చేస్తూ కుటుంబవిషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటూ అలా కుటుంబాలపై తన అధికారాల్ని అక్రమంగా విస్తరించుకుంటూ పోతున్న భ్రష్ట ప్రభుత్వాల దుష్ట నిరంకుశత్వానికి ఇదే మన సమాధానం.

("అయ్యా ! మీ అధికారం తల్లికంటే, తండ్రి కంటే, గురువు కంటే దైవం కంటే మాకు గొప్పది కాదు" అని ముక్కు గుద్ది ప్రభుత్వాలకి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. చెప్పితీఱతాం)

ఇహముందు ఏ ఉత్తరం వ్రాసినా, ఏ పుస్తకం వ్రాసినా, ప్రచురించినా "జై శ్రీరామ్" లాంటి ఇష్టదైవ నామాలతో పాటు కొంచెం శ్రమ తీసుకొని "తల్లి-తండ్రి-గురువు-దైవం" అని కూడా వ్రాయడం అలవాటు చేసుకుందాం. ఆ విధంగా మన హిందూధర్మ మూలసిద్ధాంతాన్ని అందఱికీ చాటి చెబుదాం. ప్రతి హిందూ పండుగలోను, ఉత్సవంలోను, ఊరేగింపులోను ఈ నినాదాన్ని బిగ్గఱగా పలుకుదాం, అందఱిచేతా పలికిద్దాం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి