2, అక్టోబర్ 2009, శుక్రవారం

భగవత్ పూజావిధానము-2


పూజ ఎందుకు చెయ్యాలి ? - 1


మతాన్ని కాపాడ్డమంటే మతాన్ని ఆచరించడమే. ఎవరూ మాట్లాడని భాష ఏ విధంగా నైతే మృతభాష కింద లెక్కో అదే విధంగా ఎవరూ ఆచరించని మతం, ఎవరికీ బోధపడని మతం కూడా మృతమతం కిందనే లెక్క. ఆ మతానికి ఎంత చరిత్రయినా ఉండొచ్చు. ఎంతమందైనా ఆ మతం పేరుతో జనాభా లెక్కల్లో నమోదై ఉండొచ్చు. లేదా ఆ మతానికి సంబంధించి ఎన్ని పవిత్ర గ్రంథాలైనా గ్రంథాలయాల్లో మూలుగుతూ ఉండొచ్చు. ఏమీ లాభం లేదు. అది మృతమతమే అవుతుంది. మతంలో రకరకాలవాళ్ళని మనం చూస్తూంటాం. "ఫలానా మతస్థుల" మని చెప్పుకొని అంతటితో ఆగిపోయేవాళ్ళు కొందఱు. "మామతదేవుణ్ణి నమ్ముతా కానీ పూజలూ గట్రా ఏమీ చెయ్యను. దేవుడికి నా కష్టసుఖాలు తెలియవా ? నేను పూజ చేసి మఱీ చెప్పాలా ?" అనేవాళ్ళు కొందఱు. "ఏదో శక్తి ఉందని నమ్ముతా కానీ దేవుడంటే మా మతదేవుడిలానే ఉంటాడంటే ఎందుకో నమ్మలే"నని ఇంకొందఱు. "దేవుణ్ణి నమ్ముతా, గుళ్ళకీ, గోపురాలకీ కూడా వెళతా. కానీ మా మతం గుఱించి నాకేమీ తెలియదు." అనేవాళ్ళు కొందఱు. "దేవుడున్నాడని నమ్ముతా కానీ సంప్రదాయాల మీదా, శాస్త్రం మీదా విశ్వాసం లే" దనేవాళ్ళు ఇంకొందఱు. జాగ్రత్తగా గమనిస్తే ఈ విధమైన వాగ్ధోరణిలో నిద్రాణమైన నాస్తికత్వాన్ని, లేదా ప్రచ్ఛన్న నాస్తికత్వాన్ని, భావి నాస్తికత్వాన్ని మనం వాసన పట్టవచ్చు. మన గతానుభవాల్ని బట్టి - ఇలా మాట్లాడేవాళ్ళంతా ఏదో ఒక దురదృష్టకరమైన రోజున మతం మారే అవకాశం గానీ, నాస్తికులుగా పరిణమించే అవకాశం గానీ ఉందని ఊహించవచ్చు. ఇలాంటివాళ్ళతో నిండిపోయిన జీవన్ మతం పూర్తిగా మృతమతం కాకపోయినా జీవన్ మృతమతం అనీ, మ్రియమాణ మతం (dying faith) అనీ చెప్పుకోవచ్చు.

క్రమం తప్పని అనునిత్య, దైనందిన భగవత్ పూజ ఆచరణాత్మకమైన మతావలంబనకి తొలిమెట్టు. పూజ ద్వారా పైన పేర్కొన్న సందిగ్ధ జనాభాశ్రేణుల్లోంచి మనం బయటపడి నిజమైన నిజాయితీ గల మతావలంబకులుగా మారతాం. వర్తమానంలో పెక్కుమంది యౌవనులు తాము దైవభక్తులమని గానీ, రోజూ పూజ చేస్తామని గానీ, తమకి ఇతరత్రా మతవిశ్వాసాలున్నాయని గానీ చెప్పుకోవడానికి సంకోచించే వాతావరణం నెలకొని ఉంది. సామూహికంగా భజనల్లో పాల్గొని మనసారా భగవంతుడి లీలల్ని నలుగుఱిలో ఎలుగెత్తి గానం చేయడానికి, దేవుడి ముందు వినయంగా సాష్టాంగపడ్డానికీ కూడా సిగ్గుపడేవాళ్ళున్నారు. బొట్టు పెట్టుకోవడం చాదస్తమనుకునేవాళ్ళున్నారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది సినిమా హీరోల/ హీరోయిన్ ల ప్రభావం. మన సమకాలీన సినిమాలన్నీ పూర్తిగా Godless. సినిమా కథల్లో హీరోని చూపించే విధానం - అతన్నొక సూపర్ మ్యాన్ గా, స్పైడర్ మ్యాన్ గా దేవుణ్ణీ, అదృష్టాన్ని నమ్ముకోని శిలాకర్కశమైన ఆత్మవిశ్వాసం గలవాడుగా, అసలు అతనే దేవుడన్నట్లు చూపిస్తారు. కానీ అలాంటి మగవాళ్ళెవరూ ప్రపంచంలో లేరు. తన భార్యాబిడ్డలకి తప్ప మగవాడెవరికీ దేవుడు కాదు. వాస్తవ జీవితంలో అందఱమూ కమెడియన్లమే. ప్రతి మగవాడూ ప్రాథమికంగా ఒక తల్లి ఒళ్ళో బిడ్డ మాత్రమే. ఒకడికి ఒకటుంటే ఇంకొకటుండదు. జగదేకవీరుడైన అర్జునుడే 18 అక్షౌహిణుల సైన్యాన్ని చూసి బెంబేలెత్తి శ్రీకృష్ణుణ్ణి శరణుజొచ్చాడు. ప్రపంచంలోకెల్లా సాటిలేని బలశాలి (పరిగెత్తుతున్న రైళ్ళని వెనక్కి లాగేసేవాడు) అని పేరుపొందిన కీ.శే. కోడి రామమూర్తిగారు తాను చిన్నప్పట్నుంచి ఆంజనేయస్వామి భక్తుణ్ణని చెప్పుకున్నారు.

కానీ ఇందాక పేర్కొన్న ఊహాకల్పిత మేషో మగవాళ్ళు, ఈ ఎనిమిది పలకల (8-pack bodies) వికారులు, ఆధ్యాత్మిక బికారులు మన మగపిల్లలకీ, ఆడపిల్లలకీ ఆదర్శమై కూర్చున్నారు. దాన్తో దేవుణ్ణి నమ్మడం, ఆయన మీద ఆధారపడ్డం హీనమైనదనే తప్పుడు భావన సమాజంలో వ్యాపించింది. తద్విరుద్ధమైన ఆలోచనలూ, ప్రవర్తన డైనమిజమ్ గా ప్రచారంలోకి వచ్చాయి. "భగవదనుగ్రహం చేత విజయం సాధించాను, దైవకృప వల్ల జీవితంలో పైకొచ్చాను" అని మాట్లాడేవాణ్ణి అసమర్థుడుగా చూడ్డం అలవాటు చేసుకున్నారు. దైవప్రమేయం లేకుండానే జీవితాలూ, జగత్తూ ఉన్నాయనే ఘోర అజ్ఞాన భ్రమలో వీళ్ళు బతుకుతున్నారు. దైవభక్తులైన యువకులకి ఆడపిల్లల్లో సెక్స్ అప్పీల్ తగ్గిపోయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మన బ్లాగుల్లో కూడా దేవుణ్ణి నమ్మని (కనీసం అలా చెప్పుకుంటున్న) బ్లాగర్లకి ఆడవాళ్ళలో పాపులారిటీ ఎక్కువ. అయితే దేవుణ్ణి నమ్మని, ఆయనకి భయపడని, ఆయన మీద ఆధారపడని మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళకి భద్రత గుండుసున్నా అనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ఆడవాళ్ళపై నానాటికీ పెరిగిపోతున్న దారుణ మారణ హింసాకాండలకీ, ఈ ఆధునిక తప్పుడు Godless మేషో పురుషత్వ ప్రదర్శనకీ మధ్య ఉన్న సూక్ష్మ, రహస్య సంబంధాన్ని గ్రహించలేకపోతున్నారు.

మనం పూజలు మానెయ్యడానికి గల రెండో కారణం - స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగం ద్వారా విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన కుహనా సెక్యులర్ విలువలు. సంస్కృతీ, మతమూ, దేవుడూ వేఱు కాదు. మతాన్ని బహిష్కరించడమంటే దేవుణ్ణి బహిష్కరించడమే. ప్రభుత్వాన్ని irreligious చెయ్యడమంటే దాన్ని Godless, uncultured చెయ్యడం కిందనే లెక్క. ప్రభుత్వం ద్వారా ప్రచారం చెయ్యబడ్డ ఈ సర్కారీ సిద్ధాంతం అనతికాలంలోనే ప్రైవేట్ సంస్థలకి కూడా ప్రాకింది. ఆ తరువాత ఆ ప్రైవేట్ సంస్థల్లోంచి కుటుంబాలక్కూడా ప్రాకింది. మతం ప్రైవేట్ విషయమని వాదించడం మొదలుపెట్టారు. అసలు సెక్సే ప్రైవేట్ విషయం కానప్పుడు, సెక్సు కోసం చట్టాలే ఉన్నప్పుడు, ఒకరికొకరు రాసుకుంటున్న వేగులే ప్రైవేట్ విషయం కానప్పుడు చరిత్రతో సహా అన్ని జీవితరంగాల్లోను, ఆఖరికి జాతీయతా భావనలో కూడా ముఖ్యమైన పాత్ర గల మతం ఎలా ప్రైవేట్ అవుతుందనే ప్రశ్నకి సమాధానం లేదు. మన మెజారిటీ మనస్తత్త్వ రీత్యా ఈ దేశానికి సెక్యులరిజమ్ నప్పదు. మనకి కాస్తో కూస్తో నప్పేది బహుశా సర్వమత "సమభావనే". కానీ నెహ్రూ వంటి కొద్దిమంది (మైనారిటీ) మేధావులు ప్రభుత్వం మీద గుత్తాధిపత్యం కొట్టేసి వాళ్ళ సెక్యులరిజమ్/ నాస్తిక భావనల్ని మతవిశ్వాసాలు గల మెజారిటీ మీద రుద్ది ఆ తరువాతే అదే కరెక్టని వాదించడం మొదలుపెట్టారు.

మూడో కారణం - ఇటీవలి కాలంలో హిందువులకి పట్టిన డబ్బు మేనియా.

నాలుగో కారణం - దైవభక్తి అనేది ముసలితనానికి సంబంధించినదనే అపోహ. మావాడికి ఉపనయనం చేసినప్పుడు - అనేకమంది (బ్రాహ్మలే) "అప్పుడే ఉపనయనమేంటి ? వాడికింకా వయసు ఏం మించిపోయిందని ? ఇప్పుడే పూజలూ గట్రా ఏంటి ? "అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి వాళ్ళు మాట్లాడకూడని మాటలివి. అసలు, ఉపనయనం ఆలస్యమైనందుకు మేము ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాల్సి వచ్చింది. బ్రాహ్మల పరిస్థితే ఇలా ఉంటే ఇహ మిహతా జనాభా పరిస్థితేంటి ?

నేను చెప్పేదేంటంటే - మనం నిజంగా హిందూ మతావలంబకులం కావాలంటే ఆ పనిని ముందు మనింటినుంచే మొదలుపెట్టాలి. అలా చెయ్యాలంటే మనం మన సాంప్రదాయిక వంశపారంపర్య పూజల్ని తప్పనిసరిగా ప్రతిరోజూ నిర్వర్తించి తీఱాలి. ఇందునిమిత్తం అఱవయ్యేళ్ళ సర్కారీ సిద్ధాంతాలు నూఱిపోసిన ఆత్మన్యూనతా (inferiority complex) భావాల నుంచి, సినిమాలవాళ్ళు నూఱిపోస్తున్న పిచ్చకొట్టుడు, బండలాగుడు మేషో పురుషత్వ భావనల నుంచి బయటపడాలి. మన దివ్యపిత అయిన భగవంతునికి మనల్ని మనం సవినయంగా సమర్పించుకొని సర్వశరణాగతి చెయ్యాలి. తరతరాల హిందూ సంకెలలో మనం లంకెలమనీ, మన తరువాత కూడా హిందూ తరాలనేవి ఉన్నాయని, ఉండాలని అనుకొని నిత్యపూజలు మొదలుపెట్టాలి.

ప్రతి మతావలంబకులకీ ఒక తప్పనిసరి ఆధ్యాత్మిక దినచర్య విధించబడింది. ముస్లిములు అయిదుసార్లు నమాజు చెయ్యాలి. ఇంట్లో ప్రార్థనలు చేసినా, చెయ్యకపోయినా ప్రతి క్రైస్తవుడూ ఆదివారం పూట చర్చికెళతాడు. అలాంటి దినచర్య హిందూమతంలో కూడా విధించబడినప్పటికీ హిందువుల్లో కనీసం ఒక్కశాతమైనా రోజుకొకసారైనా భగవంతుణ్ణి స్మరిస్తారో లేదో నాకు అనుమానమే. దైవభక్తి ముసలితనానికి సంబంధించినదనే అపోహే ఇందుక్కారణం. చిన్నప్పుడు లేనిది పెద్దప్పుడు హఠాత్తుగా వచ్చిపడదు. The spirit of teens sustains man for a lifetime.

మఱికొంత తరువాత....

భగవత్ పూజావిధానము-1

హిందూమతంలో ప్రార్థనలుండవు. స్తోత్రాలూ, పూజలూ, ఉపాసనలూ మాత్రమే ఉంటాయి. అయితే అలాగని ప్రార్థనల మీద హిందూమతంలో నిషేధమేమీ లేదు. కానీ మన పూర్వులు వాటిని అంతగా ఇష్టపడకపోవడానికి, కొన్ని కారణాలుండి ఉండొచ్చు. మొదటిది - మానవ ప్రార్థనలన్నీ కోరికల మయం. కానీ మోక్ష పురుషార్థం కొఱకు ఆ కోరికల్ని జయించమనే హిందూమతం చెబుతున్నది. రెండోది - ప్రార్థనలన్నీ వాక్కుల మయం. కానీ ఆత్మ/ పరమాత్మ వాక్కుల కతీతం, అవాఙ్మానస గోచరం. నిజంగా మనసు నిండినప్పుడు వాక్కులు మూగబోతాయి. కనుక వాగ్ భూయిష్ఠమైన ఉపాసన, వాగ్ భూయిష్ఠ ప్రేమలాగే సాధారణంగా ఉపరితలీయం (superficial) గా ఉంటుంది. ప్రార్థనలు చేసేవారు భగవంతుడికి చెప్పినదే చెబుతూ, మాట్లాడినదే మాట్లాడుతూ తమ మనస్సుల్ని తాత్కాలికంగా ప్రశాంతపఱచుకుంటారు తప్ప భగవత్ తత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆయన మహిమను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించరు. అంటే వారి సావధానానికి భగవంతుడు కేంద్రం కావడం మానేసి తమకు తామే కేంద్రమవుతారు. మఱికొన్నిసార్లు ఈ వాక్కర్మ మన మనస్సుల్ని మఱింత కల్లోలితం కావిస్తుందే తప్ప ప్రశాంతపఱచదు కూడా. అన్నింటి కంటే ముఖ్యమైన కారణం కూడా ఒకటి ఉండొచ్చు ననుకుంటున్నాను. అది, సంస్కృతంలో తప్ప ఇంకే భాషలో దేవుణ్ణి ప్రార్థించినా ఆ ప్రార్థనలకి మంత్రబలం ఉండదు కనుక ఆ విధమైన సాధన వృథా అవుతుందేమోననే అంతర్గత సంకోచం.

అందుచేత మనవారు మనసా, వాచా, కర్మణా భగవంతుడికి జీవాత్మను అంకితం చేసే నిమిత్తం పూజావిధానాల్ని నిర్దేశించారు. మనసులో భగవంతుడు, మాటలో మంత్రము, చేతిలో భగవత్ పూజాద్రవ్యాలు - వెరశి సర్వతోముఖ భగవత్ సాన్నిధ్య సాధనే పూజ. ఈ పూజావిధానాలు ఎప్పుడు ఎవరి ప్రోక్తంగా మొదలయ్యాయో తెలియదు. ఇవి బహుశా అనాది. యజ్ఞ-యాగాదులూ, హోమాలూ చేసేటప్పుడు కూడా హోమగుండానికి బొట్లు పెట్టి, చుట్టూ ముగ్గులేసి దీపం వెలిగించి పసుపు- కుంకుమలతోను, పూలతోను అర్చించాలనీ, నైవేద్యం సమర్పించాలనీ నియమం ఉంది కనుక ఈ పద్ధతి వేదకాలం నుంచే అనూచానంగా వస్తున్నదని తెలుస్తోంది.

అలాగే దేవుణ్ణి మానవరూపంలో ఉపాసించడం (anthropomorphic worship) కూడా వైదిక సంప్రదాయమే. వేదసూక్తాలలో ప్రతిదేవుణ్ణి, దేవతనీ విపులంగా వారి శరీర లక్షణాలతో, అలవాట్లతో సహా వర్ణించారు. కనుక కొంతమంది ధర్మద్వేషులు ప్రచారం చేసినట్లు మన వేదఋషులు క్రైస్తవుల్లా, మహ్మదీయుల్లా పూర్తి నిర్గుణోపాసకులు కారు. వారు కూడా మనలాగానే విగ్రహారాధకులే. వేదిక్ హిందూయిజమ్ (వేదిక్ రెల్జన్), పురాణిక్ హిందూయిజమ్, మాడర్న్ హిందూయిజమ్, బ్రాహ్మణిజమ్ అంటూ ధర్మద్వేషులు చేస్తున్న విభజన పూర్తిగా అశాస్త్రీయం, చరిత్రవిరుద్ధం, వాస్తవదూరం కూడా. పరిశోధకులు ఎవరి వ్యక్తిగత తిక్కల కనుగుణంగా వారు వివిధ నామాలు తగిలించినా స్వభావతః అవన్నీ ఒకటే. క్షుద్రోపాసనతో సహా ఇప్పుడున్నవన్నీ అప్పుడూ ఉన్నాయి, అప్పుడున్నవి ఇప్పుడు పూర్తిగా లేకపోయినా !

వేదాలు ఎంత ప్రాచీనమైనా, ఆ కాలం నుంచి మనం ఇప్పుడు ఎంత దూరంగా వచ్చేసినా, ఆ సూక్తాల్లో మనకు దర్శనమిచ్చే దేవతల్లో అనేకమందిని మనం ఇప్పుడు కూడా రోజూ పూజిస్తున్నాం. కనుక మన ఈనాటి పూజలన్నీ వైదికమే. ఆ గ్రహాలే ఈ గ్రహాలు. ఆ సూర్యుడే ఈ సూర్యుడు. ఆ చంద్రుడే ఈ చంద్రుడు. ఆ భూదేవే ఈ భూదేవి. ఆ గణపతే ఈ గణపతి. ఆ రుద్రుడే ఈ రుద్రుడు. ఆ ఉమాదేవే ఈ ఉమాదేవి. ఆ విష్ణువే ఈ విష్ణువు. ఆ లక్ష్మే ఈ లక్ష్మి. ఆ సరస్వతే ఈ సరస్వతి. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మ. ఇహ పంచభూతాల సంగతి, దిక్పాలకుల సంగతి చెప్పనక్కఱలేదు. వేదాలు నేర్చుకునే అవకాశం పూర్వకాలంలో అధిక సంఖ్యాకులకి లేకపోయినా ఈ దేవీదేవుళ్ళని అందఱూ నమ్మేవారు కనుక, ఈ పూజలు అందఱూ చేసుకునేవారు కనుక వారు వైదికులైనట్లే లెక్క. జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సు లాంటి వేదాంగాలు కూడా లక్షణంగా రక్తమాంసాలతో, జవసత్త్వాలతో బతికే ఉన్నాయి, ఇప్పటికీ వేలాది ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలల్లోను, కళాశాలల్లోను అందఱికీ శుభ్రంగా నేర్పిస్తున్నారు. కనుక వేదమతమూ, హిందూమతమూ ఒకటి కాదని వాదించే ఆధునిక ధర్మద్వేషులకి ఈ వాస్తవాల్ని వివరించి తగినట్లుగా బుద్ధి గఱపాల్సి ఉంది.

ప్రపంచంలో మానవత్వం పూర్తిగా చనిపోయినప్పుడే హిందూధర్మం కూడా చనిపోతుంది. అలా కానప్పుడు దానికి చావు లేదు. ఎందుకంటే ఈ మార్గం ప్రకృతి-ప్రసాదితమైన, మానవ సహజ ప్రేరణల మీద, మానవీయ సహజాతాల (instincts) మీదా ఆధారపడినట్టిది. ఇది మనుషుల మీద వారి స్వభావాలకి విరుద్ధంగా రుద్ధబడిన ప్రవర్తనా నియమావళి (Code) కాదు. ప్రేమాస్పదుల ప్రతిరూపాలు మనకి అత్యంత ప్రియతమాలు. వారి ఛాయాచిత్రాల్ని చట్రం కట్టించి ఇంట్లో గోడకి తగిలిస్తాం. బల్లసొఱుగుల (desks) లో దాచుకుంటాం. చేజోళ్ళ (wallets) లో భద్రపఱచుకుంటాం. మనకే అధికారం ఉంటే వారి విగ్రహాన్ని వీథి మొగసాలలో ప్రతిష్ఠిస్తాం కూడా ! ఒకవేళ ఆ ప్రియతముడు భగవంతుడే అయితే ? ఆయన ప్రతిరూపాన్ని మన దగ్గఱ పెట్టుకొని అనునిత్యం చూసుకుందామనుకోమా ? హైందవేతర ప్రపంచంలో ఆ ప్రేరణ లేనివారెవరైనా మిలియన్లాదిగా ఉంటే అప్పుడు హిందువులు నిజంగానే మూర్ఖులు.

హిందూమతం కంటే మానవత్వం గల మతమేదీ లేదు. దేవుడిలో మానవుణ్ణి చూసి పూజించమనే మతం ఇదొక్కటే. అలాగే మానవుడిలో దేవుణ్ణి చూడమని చెప్పే మతమూ ఇదొక్కటే. మనిషిలో దేవుడున్నాడన్నవాణ్ణి దైవద్రోహిగా భావించి ఇతరమతాల్లో చంపినా చంపుతారు. పూజ అంటే అసలర్థం గౌరవించడం ! మనం పూజ పేరుతో చేసే అర్ఘ్యం, పాద్యం, ఆరతి, నైవేద్యం మొదలైన విధివిధానం యావత్తు భగవంతుణ్ణి మానవుడుగా భావించి గౌరవించి చేసే సేవ. మన యింటికొచ్చిన మానవుణ్ణి ఎలా గౌరవిస్తామో అలాగే భగవంతుణ్ణి కూడా భయభక్తులతో గౌరవిస్తే ఆయన సంతోషిస్తాడని చెప్పడమే ఈ విధివిధానంలోని ప్రధానోద్దేశ్యం. ఈ పూజ అనే అలవాటు మనకి తోటి మానవుల పట్ల కూడా ఎలా నడచుకోవాలనేదానికి ఒక మార్గదర్శనం.

మఱికొంత తరువాత...

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి