26, జూన్ 2012, మంగళవారం

చారిత్రిక అనుభవాలనుంచి హిందువులు గుణపాఠాలు నేర్వాలి

పాశ్చాత్య విద్యా వ్యామోహం ఒక తీయని విషం. అది ఆధునికీకరణ పేరుతో అమలవుతున్న భస్మాసుర హస్తం. అది మనల్ని కరకరా నమిలి మింగడానికి సిద్ధంగా ఉన్న కలిపురుషుడి కరాళదంష్ట్ర. ప్రతివారినీ బాగు చేసేస్తామని ప్రచారం ద్వారా మభ్యపెట్టి, వాళ్ళ చేతికి ఒక లాటరీ టిక్కెట్టిచ్చి, వారందఱినీ తమ పూర్వస్థానాల నుంచి భ్రష్టుల్ని చేసి, ఆఖరికి వారిలో కొద్దిమందిని మాత్రం బాగుచేసి మిగతా కోట్లాదిమందిని పేదలుగా, అనాథలుగా మిగిల్చే ఒక మోసపూరిత ప్రక్రియ. ఉదాహరణకి, మన రాష్ట్రంలో యావత్తు విద్యావిధానమూ జనాన్ని అమెరికా, ఆస్ట్రేలియా పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందఱమూ ఇంగ్లీషు నేర్చుకొని రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోదామనే పిఱికి ఎస్కేపిస్టు ఫిలాసఫీని ఇది ప్రచారం చేస్తోంది. పాఠశాలలకి పేర్లు కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగానే పెడుతున్నారు, తల్లిదండ్రుల్ని ఆకర్షించే ఉద్దేశంతో ! కెనడీ హై అట, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ అట. చైతన్య టెక్నో అట.... వీటిల్లో చదివే పిల్లలంతా భావి అమెరికన్లు గా భావించుకోబడుతున్నారు గనుక వీటిల్లో తెలుగనే సబ్జెక్ట్ ఉండదు. తెలుగు రావడం ఈ కాబోయే బ్రౌన్ అమెరికన్లకి అవమానం గదా !

ఈ హైప్ వెనక ఉన్న వాస్తవమేంటంటే, నిజానికి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, యూరప్ లోనూ ప్రస్తుతం పెద్దగా ఉద్యోగాలేమీ లేవు. వాళ్ళకే లేవు. ఇంక మనకేమిస్తారు ? గత కొద్ది సంవత్సరాలుగా ఆ దేశాలు గొప్ప ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. అందులోంచి అవి ఎప్పుడు బయటపడతాయో ఎవఱికీ తెలీదు. వాళ్ళు ఏటా మనకు జారీ చేస్తున్న వీసాలు కేవలం కొద్దివేలల్లోనే ! అయినా ఆ లక్ష్యంతోనే మిలియన్లాదిమంది చదువుకుంటున్నారు దేశీ బ్రౌన్ అమెరికన్ స్కూళ్ళల్లో ! కానీ అక్కడికి పోవడాన్ని ఘనపఱుస్తూ ఆ వలసవాద, వలసదారీ భావజాలాన్ని మనకు అమ్మజూపుతున్నాయి ఈ విద్యాసంస్థలు. "చచ్చినోడి కళ్ళు చేరెడేసి బాబూ, రండి, రండి ! భలే మంచి బేరము" అని కేకేస్తూ ! మన తెలివితేటలు మన దేశాభివృద్ధికీ, మన సాంస్కృతిక వారసత్వానికీ పనికొచ్చే విధంగా మన విద్యావిధానం ఉండాలి. చైనాకి పనికిరావాలని జపాన్ వాళ్లు చదువు నేర్చుకోరు. ఫ్రాన్సుకి పనికొచ్చే ఉద్దేశంతో స్పెయిన్ వాళ్ళు చదువు నేర్చుకోరు. కానీ ఇండియాలో - ముఖ్యంగా ఆంధ్రాలో అంతా తారుమారుగా చిత్రవిచిత్రంగా నడుస్తోంది.

గతంలో మన రాష్ట్రంలో ఒక సనాతన సామాజిక వర్గం ఇలాంటి వ్యామోహాల్లో పడి ఎలా అధః పతనం చెందిందో మనకు కనువిప్పు కావాలి.  

స్వాతంత్ర్యానికి ముందు బ్రాహ్మణులకు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వ్యావసాయిక ఎస్టేట్లు ఉండేవి.బ్రాహ్మణులు ఒక బలీయమైన వ్యవసాయకులంగా ఉండేవారు. వనపర్తి, ఉర్లామ్, పోలవరం లాంటి చోట్ల వారు రాజాలుగా, జమీందార్లుగా కూడా ఉండేవారు. ఇంత స్థాయిలో కాకపోయినా ప్రతి బ్రాహ్మణుడికీ ఎంతో కొంత పొలం ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణుల రాజకీయ నాయకత్వానికి వారి దేశభక్తితో పాటు ఈ భూస్వామ్యం కూడా ఒక కారణం. దేశం ఎంతగా బ్రాహ్మణుల్ని అనుసరించేది అంటే - మొట్టమొదటి లోక్‌సభ (1952) కు ఎన్నికైన MP లలో 340 మంది బ్రాహ్మణులేనంటే ఈనాటివారికి దిగ్భ్రాంతి కలగొచ్చు. పత్రికలూ, పుస్తక ప్రచురణ, రేడియోల్లాంటి మీడియా కూడా బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేది. స్వాతంత్ర్యానంతరం కేవలం ఒకటి=రెండు దశాబ్దాల్లోనే ఈ స్థితిమత్త్వం నెమ్మదినెమ్మదిగా అదృశ్యమౌతూ వచ్చింది. ఇందులో బ్రిటీషువారు రాజకీయ కక్షలతో చేసినదాని కంటే, లేదా భూసంస్కరణల పేరుతో దేశీ ప్రభుత్వాలు లాక్కున్నదానికంటే బ్రాహ్మణులు అనాలోచితంగా దూరదృష్టిలేమితో స్వయంగా చేసుకున్నదాని పాత్రే చాలాఎక్కువ. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాటు ఏంటి ? అంటే, వారు ఒక దశలో బ్రిటీషువారిచ్చే ఉద్యోగాల కోసం, లేదా లా చదవడం కోసం ఉన్న భూములమ్మేసి పట్టణాలకు చేఱుకోవడం. లేదా ఆ పొలాల్ని ఎవఱో ఇతర కులస్థులకు కౌలుకిచ్చేసి పట్టణాలకు చేఱుకోవడం. ఆ తరువాత ఆ భూములతో, ఆ ఊళ్ళతో సంబంధాలు తెగిపోవడం. ఆ తరువాత వారి వారసులు ఆ పొలాల్ని ఐనకాడికి అమ్మేసుకుని శాశ్వతంగా పట్టణాలలో స్థిరపడ్డం. ఈ క్రమంలో - క్రమం తప్పని ఆదాయంగా భావించి ఏ నెలజీతపు ఉద్యోగాల కోసమైతే తాము ఎగబడ్డారో అవి, తమకొచ్చినంత సులభంగా తమ సంతానానికి రాని పరిస్థితి తలెత్తడం. ఏతావతా రెంటికీ చెడ్డ రేవడిలా, ఇటు పొలమూ లేక, అటు అనుకున్నంత స్థాయిలో జీవితానికి కుదిరికా లేక బ్రాహ్మణులు దెబ్బదిన్నారు. వారు సలామ్ చేయదగ్గ భూస్వాముల స్థాయి నుంచి అందఱికీ సలాములు కొట్టే నెలజీతగాళ్ళ స్థాయికి పడిపోయారని గమనించాలి. అయితే కులపరంగా తరతరాలుగా ఉన్న సాంస్కృతికస్థాయి, సంప్రదాయాల మూలంగా వారు పూర్తిగా నాశనం కావడం జఱగలేదు. ఆ అడ్వాంటేజిలు లేని ఇతరులు ఆంగ్లవిద్య అనే ఈ లాటరీ టిక్కెట్టు కొనుక్కుని ఏమవుతారో తల్చుకుంటే భయమేస్తుంది.

ఒకప్పుడు బ్రాహ్మణులు త్రొక్కిన ఆ తప్పుదారినే, తెలిసో, తెలియకో ఇప్పుడు అందఱూ త్రొక్కుతున్నారు. వ్యవసాయ కులాలన్నీ పాశ్చాత్యవిద్యావ్యామోహంతో, MNC ఉద్యోగాల వ్యామోహంతో పొలాల్ని వదిలేసి నగరాల బాట పట్టుతున్నాయి. పొలాల్ని ఒకసారి వదిలిపెడితే ఇహ మళ్లీ వాటిల్లో అడుగుపెట్టడం అసాధ్యం. పొలాన్ని అమ్మగలం గానీ, కొనాలనుకున్నప్పుడు మళ్లీ కొనలేం. ఎన్ని చెప్పినా ఈ దేశంలో Land is power. అది పోగొట్టుకున్నవారికి రాజకీయాధికారం కూడా దూరమైపోతుంది. కనుక ఇప్పుడు మనం అగ్రకులాలూ, రాజకీయంగా బలవత్తరులైన కులాలూ అనుకుంటున్నవన్నీ ఒక యాభయ్యేళ్లల్లో పేదలుగా, మధ్యతరగతిగా మారే సంభావ్యత ఉంది. ఇది హిందూధర్మం మీద కూడా ప్రభావం చూపవచ్చు. 

బ్రాహ్మణులు చేసిన పొఱపాట్లను ఇతరులు పునరావృత్తం చేయకూడదు. తల్లిని నమ్మినవాడూ, భూమిని నమ్మినవాడూ చెడడనే నానుడిని మనసా వాచా కర్మణా విశ్వసించి ఎన్ని ఇబ్బందులున్నా మనం మన జీవనవిధానాన్ని కాపాడుకోవాలి.

16, జూన్ 2012, శనివారం

తెలుగుహిందువులంతా ఒకే వోట్ బ్యాంకుగా మారాలి

ఇప్పుడు జఱిగిన ఉపఎన్నికల్లో జగన్ పార్టీకి 50 శాతం కన్నా ఎక్కువ వోట్లు పడ్డాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అతను అధికారాన్ని చేపట్టడం ఖాయం. ఈ వోట్లలో 10 శాతం క్రైస్తవులవి, ఇంకో 10 శాతం ముస్లిములవీ, మఱో 10 శాతం హిందూ రెడ్లవీ కాక మిగతావి తక్కిన హిందూ కులాలవి. కనుక చాలావఱకూహిందువుల వోట్లతోనే అతను అధికారాన్ని చేపట్టగలడని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

హిందువుల విషయానికొస్తే హిందువులకు ఈ మైనారీటీ నాయకత్వ పార్టీలు తప్ప వేఱే దిక్కు లేని పరిస్థితి దాపఱించింది. ఆంధ్రాలో స్థానికంగా హిందువుల కోసం పోరాడే పార్టీ ఏదీ లేదు.  హిందువుల పార్టీలు ఆచరణలో కులపార్టీలు మాత్రమే. అంటే మనకి కులపార్టీలు తప్ప మతపార్టీలేమీ లేవు. మైనారిటీలకు కాంగ్రెస్ ఉంది ఉమ్మడివేదికగా. ఇప్పుడు దాని స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ఆక్రమించింది. అదొక్కటే తేడా.

తెలుగుదేశాన్ని ప్రజలు తెలుగుహిందువుల పార్టీగా చూడ్డం లేదు. దాన్ని సాదా సీదా కులపార్టీగానే చూస్తున్నారు. అది అన్ని ఎన్నికల్లోనూ వరసపెట్టి ఘోరంగా ఓడిపోవడానికి ఇదే కారణం. మఱోపక్క ప్రజాస్వామ్యంలో ఇతర కులాల మద్దతు లేకుండా, వాళ్ళందఱినీ కలుపుకు పోకుండా ఏ ఒక్క కులమూ స్వతంత్రంగా ఆధిపత్యంలో ఉండడం అసాధ్యమనే తెలివిడీ, వివేకమూ హిందూ అగ్రకులాలలో పూర్తిగా లోపించాయి. ఈ విషయమై నగరాల్లో కొంత చైతన్యం ఉంది. కానీ గ్రామాలకి పోయి చూస్తే అక్కడి అగ్రకులాల ప్రజలు యథాప్రకారంగా తమ సంకుచిత కులతత్త్వంలో, మతపరమైన అజ్ఞానంలోబ్రతుకుతున్నారు.

ఈ పరిస్థితి మారాలంటే వోటర్లలో విస్తృతమైన పోలరైజేషన్ రావాలి. అలా రావాలంటే హిందువుల రాజకీయ పార్టీలు కూడా తమ వంతు జాగృతిని వోటర్లలో కలిగించాలి. ఊరికే సెక్యులర్ పోజులివ్వడం వల్ల ఏమీ లాభంలేదు. ఇలాంటి పోజుల మూలానే వై.ఎస్. హయాంలో హిందూ దేవాలయాలకు జఱిగిన అపకారం గుఱించి మాట్లాడకుండా గమ్మున కూర్చున్నాయి అప్పట్లో హిందువుల సెక్యులర్ పార్టీలు. అలా వోట్లని  పోలరైజ్ చేసి లాభపడగల సువర్ణావకాశాన్ని అవి జాఱవిడుచుకున్నాయి.భవిష్యత్తులో కూడా YSRCP లాంటి మైనారిటీ నాయకత్వ పార్టీలు తమ మతోన్మాదం కొద్దీ, హిందువులంటే తమకున్న చిన్నచూపు కొద్దీ వై.ఎస్.ఆర్. చేసిన పొఱపాట్లనే యథాపూర్వంగా పునరావృత్తం చేస్తాయనడంలో సందేహం లేదు. వాళ్ళు తాము చేసే అపచారాలతో, తప్పులతో హిందువులకు చాలా అవకాశాలిస్తారు.  కానీ వాటిని హిందూ ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకెళ్ళి,  వోట్ల పోలరైజేషన్ ని సాధించే సత్తా, ఉద్దేశమూ తెలుగుదేశంలాంటి హిందూ పార్టీలకుందా ? అనేది సందేహాస్పదం. ఎందుకంటే వాటి ట్రాక్ రికార్డు మఱోలా ఉన్నట్లు కనిపిస్తోంది.

9, జూన్ 2012, శనివారం

విద్రోహాన్ని పెంచనున్న ‘రాజ్యాంగ సమీక్ష’!

తగాదా పడుతున్న ఉభయ పక్షాల మధ్య తగవు తీర్చడానికి మధ్యవర్తులు అవసరం. ‘జమ్మూకాశ్మీర్’ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు ఆ రాష్ట్రం విషయంలో తమకూ మరెవరికో మధ్య వివాదం కొనసాగుతున్నట్టు గుర్తించినట్టయింది! ఇలా గుర్తించడం మన రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమైన అంశం! ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య తగాదా ఏమిటి?? దాదాపు పంతొమ్మిది నెలల క్రితం నియుక్తులైన ఈ మధ్యవర్తి మహాశయులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పరిష్కార నివేదిక గత నెల 24వ తేదీన బయటపడింది! కాశ్మీర్‌లోని విచ్ఛిన్నవాదుల ఆకాంక్షలకు పాకిస్తాన్ అనుకూల విద్రోహపు తండాల మనోభావాలకు ఈ నివేదిక అద్దంపడుతోంది! ఈ నివేదికలోని సిఫార్సులను అమలుజరిపినట్టయితే జమ్మూకాశ్మీర్ కథ క్రీస్తుశకం 1947వ, 1952వ సంవత్సరాల మధ్య నడచిన విద్రోహకాండకు పునరావృత్తికాగలదు. ఎటొచ్చీ ఈ పునరావృత్త గాధలో కాశ్మీర్ లోయలోని హిందువులు మాత్రం ఉండరు!

1947 అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్ రాజు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని మిగిలిన భారతదేశంలో విలీనం చేయడం చారిత్రక వాస్తవం. అందువల్ల కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం లేదు! కానీ ఆ తరువాత పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండిపోవడమే వివాద కారణం! దాన్ని రాబట్టుకోవడం మాత్రమే వివాద పరిష్కారం! కానీ దాన్ని రాబట్టుకొని వివాదాన్ని పరిష్కరించే మాటను మన ప్రభుత్వాలు మరచిపోయాయి. 1993లో పాకిస్తాన్ ప్రభుత్వంవారు కాశ్మీర్‌లో ‘హక్కుల’కు భంగం కలుగుతోందన్న తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు! అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రతినిధి బృందంవారు ఐక్యరాజ్యసమితికి వెళ్లి పాకిస్తానీ తీర్మానాన్ని వమ్ముచేసి రాగలిగారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలోని భాగమన్న సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి!

1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి! మూడవ దేశం ప్రమేయం లేదు! అందువల్ల 1994నాటి తీర్మానం ప్రకారం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతున్న కాశ్మీర్ భూభాగాలు జమ్మూకాశ్మీర్‌తో ఏకీకృతం అయినట్టయితే కథాకధిత కాశ్మీర్ సమస్య లేదు! కానీ ఇలా ఏకీకృతం చేసే విషయం మన ప్రభుత్వాలు మరచిపోయాయి. అందువల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్ఠవేసిన పాకిస్తానీ బీభత్సకారులు జమ్మూకాశ్మీర్‌లోని దేశంలోని ఇతర ప్రాంతాలలోకి చొరబడుతున్నారు. దశాబ్దులుగా జమ్మూకాశ్మీర్‌లోను ఇతర ప్రాంతాలలోను పాకిస్తాన్ సృష్టిస్తున్న బీభత్సకాండ మాత్రమే సమస్య! ఈ బీభత్సకాండ ఫలితంగా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోను, కాశ్మీర్ లోయ ప్రాంతంలోను అనాదిగా జీవించిన హిందువులు హత్యాకాండకు, అత్యాచారాలకు తరిమివేతకు గురిఅయినారు! ఈ హిందువులు భారతదేశ భక్తులు. జమ్మూకాశ్మీర్- పాకిస్తాన్ చైనా ఆక్రమిత భూభాగంతోసహా- భారతదేశంలో కొనసాగాలని భావిస్తున్నారు. 1947నుండి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు, 1990 నుండి లోయ ప్రాంతంలోని హిందువులు తమ సంస్థలకు దూరమై శరణార్ధి శిబిరాలలోను కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలలోను జీవచ్ఛవ జీవన యాత్రను సాగిస్తున్నారు. అందువల్ల పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను నిర్మూలించడం జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతికి ప్రధాన పరిష్కారం. బీభత్సకాండ అణగారిపోయినట్టయితే లోయ ప్రాంత హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెడతారు! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో ఏకీకృతం చేసినట్టయితే జమ్ములో ఉంటున్న పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు కూడా జన్మస్థలాలకు తిరిగి వెడతారు! ‘మధ్యవర్తుల’ నివేదికలో ఈ బీభత్సకాండ నిర్మూలనకోసం చేసిన సిఫార్సులు లేవు! నిర్వాసిత హిందువులు.. మధ్యవర్తులకు కాని కేంద్రానికి కాని గుర్తులేదని ఇలా స్పష్టమైంది!

ఇలా అసలు సమస్యను వదలివేసిన మధ్యవర్తులు జమ్మూకాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను సమీక్షించాలని సూచించారు. అలాగే 1950 తరువాత వివిధ సమయాలలో జమ్మూకాశ్మీర్‌కు వర్తింపచేసిన భారత రాజ్యాంగ విషయాలను కూడ సమీక్షించాలని మధ్యవర్తుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలవల్ల జమ్మూకాశ్మీర్ ప్రజలకు జరిగిన నష్టం ఏమిటన్నది మధ్యవర్తుల బృందం సూచించలేదు! అలాగే భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలు మిగిలిన రాష్ట్రాలతోపాటు కాశ్మీర్‌కు వర్తించడంవల్ల ఆ రాష్ట్ర ప్రజలలో కలిగే ఇబ్బందులు ఏమిటో కూడ మధ్యవర్తులు విశే్లషించలేదు. 1953 సంవత్సరానికి ముందు కాశ్మీర్‌కు ఉండిన ప్రతిపత్తిని పునరుద్ధరించడం సాధ్యంకాదని చెప్పిన మధ్యవర్తుల ‘నివేదిక’. మరోవైపు దీన్ని సాధ్యం చేయడానికి అవసరమైన ‘సమీక్ష’లను సిఫార్సుచేసింది! ‘సమీక్ష’ కోరుతున్న వారు బీభత్సకారులను సమర్ధిస్తున్న ‘హురియత్’ కాన్ఫరెన్స్ వంటి ముఠాలవారు! నిజానికి సమీక్ష మాత్రమే ఈ ముఠాల లక్ష్యంకాదు! మన దేశంనుండి జమ్మూకాశ్మీర్‌ను విడగొట్టడానికి జరుగుతున్న కుట్రకు ఈ ‘సమీక్ష’ దోహదపడగలదని మాత్రమే ఈ ముఠాలు భావిస్తున్నాయి! కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ అనుకూల బీభత్స ముఠాలు సమాంతర పాలన నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ ముఠాల మద్దతును కూడ కట్టుకొనడంవల్ల ఎన్నికలలో విజయం సాధించవచ్చునన్నది ‘రాజ్యాంగ నిబద్ధత’కల రాజకీయ పార్టీల ఆశ. ఫలితంగా ఈ ‘సమీక్ష’కు అనుగుణమైన అనేక కోరికలను ఈ పార్టీలు దశాబ్దులుగా వెళ్లబుచ్చుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’వారు జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి- అటానమీ- గురించి ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగం 370వ అధికరణ కాశ్మీర్‌కు ప్రసాదించిన ‘ప్రత్యేక ప్రతిపత్తి’వల్ల, ఈ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ - స్పెషల్ స్టాటస్-కి 1950వ దశకంలో ఆ అధికరణంలో లేని అర్ధాలు కల్పించడంవల్ల, ఇలా అర్ధాలు కల్పించిన వారిని నిలదీసిన వారు లేకపోవడంవల్ల 1953 వరకు కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అని పిలిచేవారు. అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం ఏర్పడి ఉన్నాయి! ప్రముఖ జాతీయ సమైక్యతావాది, స్వాతంత్ర సమరయోధుడు ‘జనసంఘ్’ నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానం ఫలితంగా కాశ్మీర్ ‘ప్రధానమంత్రి’ పదవిని ‘ముఖ్యమంత్రి పదవి’గా మార్చడం అనివార్యం అయింది. ఒకే దేశంలో ‘ఇద్దర ప్రధానమంత్రులు’ ఉండడం 1953 సంవత్సరపు పూర్వస్థితి! తమ ‘స్వయం ప్రతిపత్తి’ ద్వారా 1953 నాటికి ముందున్న రాజ్యాంగ వైపరీత్యాన్ని మళ్లీ సృష్టించాలన్నది ‘నేషనల్ కాన్ఫరెన్స్’ వారి వ్యూహం. ఇందుకు అనుగుణంగా ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 1990 దశకంలోను, ఈ శతాబ్ది ఆరంభంలోను అనేకసార్లు తీర్మానంను ఆమోదించింది.

మరో మాజీ ముఖ్యమంత్రి ముఫ్తిమహమ్మద్ సరుూద్, ఆయన కుమార్తె మెహబూబాముఫ్తి నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీవారు కోరుతున్న ‘స్వయంపాలన’- సెల్ఫ్‌రూల్-‘ప్రత్యేక ప్రతిపత్తి’కంటే మరింత ప్రమాదకరమైనది! ఈ ‘స్వయం పాలన’ ప్రతిపాదనను నిజానికి అప్పటి పాకిస్తాన్ నియంత పర్‌వేజ్ ముషారఫ్ 2005వ సంవత్సరంలో ప్రకటించాడు. దీన్ని ‘పిడిపి’వారు అందిపుచ్చుకున్నారు! భారత వ్యతిరేకతను పాకిస్తాన్ అనుకూలతను ప్రకటించినప్పుడు మాత్రమే లోయ ప్రాంతంలోని వోటర్లు తమ పార్టీని గెలిపిస్తారన్న ‘భ్రాంతి’ దీనికి కారణం. నిజానికి ‘లోయ’ ప్రాంతం ప్రజలలో అత్యధికులు దేశభక్తులు, బీభత్సకాండను వ్యతిరేకిస్తున్నారు. కానీ వేల సంఖ్యలోను బీభత్సకారులకు భయపడి మెజారిటీ ప్రజలు తమ భావాలను వ్యక్తంచేయడం లేదు. ‘భ్రాంతి’కి లోబడి ఉన్న ‘పిడిపి’ మాత్రం ‘హురియత్’ కాన్ఫరెన్స్‌కు చెందిన ముదురు ముఠా - హార్డ్ లైన్ ఫ్యాక్షన్- వారికి అనుకూలంగా ప్రవర్తిస్తోంది. ఈ హురియత్ ముదురు ముఠావారు జమ్మూకాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలని వాంఛిస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల విధేయతను ప్రకటించడం లేదు. ‘స్వయంపాలన’లో భాగంగా కాశ్మీర్‌కు కొత్త ద్రవ్య వినిమయ విధానం- మానిటరీ సిస్టమ్- కావాలట! భారతీయ కరెన్సీ స్థానంలో కాశ్మీరీ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలట!

ఇలా పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పోటాపోటీగా 1953 పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల-ఇంటర్ లొక్యూటర్స్-ను నియమించడానికి నేపధ్యం ఇది. ‘అటానమీ’ కావాలని కోరుతూ జమ్మూకాశ్మీర్ శాసనసభ చేసిన తీర్మానాన్ని 2010 ఆగస్టులో పార్లమెంటు తిరస్కరించింది. ఆ తరువాత సెప్టెంబర్‌లో కేంద్రం కాశ్మీర్ ప్రశాంతికోసం అష్ట సూత్ర ప్రణాళికను ప్రకటించింది! ఈ ప్రణాళికలోని ఒక అంశం ‘మధ్యవర్తులు’ అన్నివర్గాల ప్రజలతోను చర్చలు జరపాలన్నది. పత్రికా రచయిత దిలీప్ పడ్‌గావ్‌కర్, కేంద్ర ప్రభుత్వపు సమాచారశాఖ కమిషనర్ ఎమ్.ఎమ్.అన్సారీ, ఓ స్వచ్చంద సంస్థకు చెందిన రాధాకుమార్ ఈ మధ్యవర్తులు! ఈ మధ్యవర్తులు ప్రధానంగా చర్చలు జరిపింది ‘అటానమీ’. ‘సెల్ఫ్‌రూల్’ వాదులలోను, ‘హురియత్’ వంటి విచ్ఛిన్న ముఠాలతోను మాత్రమే! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి, కాశ్మీర్ లోయనుంచి తరిమివేతకు సరైన దాదాల పది లక్షల మంది బాధితుల ప్రతినిధులను ఈ మధ్యవర్తులు పట్టించుకోలేదు!

దశాబ్దులపాటు వర్తింపచేయడం వల్ల మూడువందల డెబ్బయవ అధికరణం స్ఫూర్తి నీరుకారిపోయిందని మధ్యవర్తుల బృందం నిర్ణయించడం విస్మయకరమేకాదు, అర్థ రహితం కూడ! ‘‘అటానమీ’, ‘స్వయంపాలన’కోరుతున్న వారిని సంతుష్టీకరించడానికి వీలుగా మధ్యవర్తులు ఈ ‘సమీక్ష’ను సిఫార్సుచేశారు! కాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను ‘సమీక్ష’ చేయడమంటే కొన్నింటిని తొలగించ వస్తుందన్నది ధ్వని! సుప్రీంకోర్టు న్యాయాధికార పరిధిని, కంట్రోలర్ ఆడిటర్ జనరల్- సిఏజి-వారి ఆర్థిక అధికార పరిధిని తొలగించాలనడం, గవర్నర్‌ను నియమించే అధికారాన్ని రాష్టప్రతి పాలనను విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేకుండా చేయడం వంటివి ‘స్వయంపాలన’ సమర్ధకులు, ‘స్వయంప్రతిపత్తి’ విధానకర్తలు కోరుతున్న కోర్కెలు! సమీక్షకోసం ఏర్పడే ‘రాజ్యాంగ సంఘం’వారు వీరితో జరిపే చర్చల సందర్భంగా ఈ విద్రోహవాంఛలు మళ్లీ విస్తృతంగా ప్రచారవౌతాయి.

7, జూన్ 2012, గురువారం

కదిలెను 'కోదండపాణి'...

నాటక, కథ, నవలా రచయితగా ఐదు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. రంగస్థల నటుడిగా కూడా ఆయన కళాభిమానులకు సుపరిచితులే. ఆయనే నెమలికంటి తారక రామారావు. రామాయణ కావ్యంలో మనకు తెలియని కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన తాజాగా రచించిన 'కోదండపాణి' నాటకం ఇటీవల భాగ్యనగరిలో మూడు రోజుల ప్రదర్శనలు జరుపుకుంది. రామాయణం విశిష్టతను, ఆ మహాకావ్యంపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేయడమే తమ నాటక ప్రధాన ఉద్దేశమంటున్న తారకరామారావుతో కాసేపు...

మాట పుట్టినపుడే రామాయణం పుట్టింది. వాల్మీకి నోట నుంచి రామాయణం వెలువడినపుడు బ్రహ్మాండమైన వెలుగు వ్యాపించినట్లు మహాకవి కాళిదాసు పేర్కొన్నాడు. రామాయణం ఒక పౌరాణిక గ్రంథం మాత్రమే కాదు. మనిషి ఎలా జీవించాలో నేర్పింది..మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు శ్రీరాముడే ఆదర్శనీయుడు. ఆడిన మాట తప్పనివాడు, పితృ వాక్యపరిపాలకుడు, ఏకపత్నివ్రతుడు వంటి పరమోత్తమ గుణ సంపన్నుడైన శ్రీరాముడి ధర్మప్రవృత్తిని ఆధునిక సమాజానికి అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం ఈ 'కోదండపాణి' నాటకంలో చేశాను.

మానవ విలువలు పతనావస్థకు దిగజారిన ఈ కాలంలో రామాయణ మహాకావ్యాన్ని నాటకంగా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ఈ రచనకు పూనుకున్నాను. భ్రమర కీటక న్యాయం, మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం వంటివి రామాయణ గా«థకు అన్వయించాను. తెలిసిన రామాయణ గా«థను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఇలపావులూరి పాండురంగారావు రచించిన 'రామాయణంలో స్త్రీ పాత్రలు', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, డాక్టర్ గుండి వెంకటాచార్యులు రచించిన 'వాల్మీకి, రంగనాథ రామాయణాల తులనాత్మక పరిశీలన', విశ్వనాథ అచ్యుత దేవరాయలు రచించిన 'సీత' నవల తదితర అనేక పరిశోధనా గ్రంథాలను పరిశీలించి ఈ 'కోదండపాణి' నాటకాన్ని తయారుచేయడం జరిగింది.

రాముడు 'కోదండపాణే'
రామాయణంలో ధనుస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మూడు ధనుస్సుల ప్రస్తావన రామాయణంలో వస్తుంది. సీతా కల్యాణంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతను పరిణయమాడతాడు. పరశురాముడి దగ్గర ఉన్నది విష్ణుధనుస్సు. అది కూడా రాముడు సంధించాడు. అధర్వణ వేదంలోని మంత్రాలన్నీ కోదండంలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే కోదండం ధరించిన వాడు మహాబలవంతుడై ఉండాలి. సూర్యవంశంలో మొట్టమొదటిసారి కోదండం ధరించిన వాడు శ్రీరాముడు ఒక్కడే కాబట్టే కోదండపాణి అయ్యాడు. రాముడిని మనం ఎన్నిపేర్లతో పిలిచినా ఆయన అసలు పేరు మాత్రం కోదండపాణే.

పాయసం పంపకం
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననానికి సంబంధించి కూడా ఆసక్తికర ఘట్టం ఉంది. దశరధుడు తనకు పుత్రకామేష్టి యాగం ద్వారా లభించిన దివ్యపాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచడు. రాముడు పూర్ణాంశంలో సగం. అందుకే పెద్దభార్య కౌసల్యకు పాయసంలో సగం అందచేస్తాడు. మిగిలిన పాయసాన్ని మూడు భాగాలు చేసి అందులో రెండుభాగాలను సుమిత్రకు, ఒక భాగాన్ని కైకేయికి ఇస్తాడు. అందుకే సుమిత్రకు కవలలు-లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. ఇందులో ఒకడు రాముడి వెంట, ఒకడు భరతుడి వెంట ఉంటారు.

నరుడు కాదు నారాయణుడు
సమస్త సంపదలను, సౌభాగ్యాన్ని లంకలో పొదుపుకున్న రావణుడు మర్కట బుద్ధి కలవాడు కావడంతో సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు. రాముడు మనకు ఆదర్శనీయుడు. మనం ఇలా ఉండకూడదు అని రావణుడిని చూసి నేర్చుకోవాలి. అయోధ్య నుంచి లంకకు వచ్చి తనపై యుద్ధానికి సిద్ధమైన రాముడి గొప్పతనాన్ని రావణుడు చివరిలో గ్రహిస్తాడు. వచ్చిన వాడు నరుడు కాదు నారాయణుడని తెలుసుకుని అతని చేతిలో తనకు మరణం తధ్యమని నిశ్చయించుకుంటాడు. తన భర్తను సంహరించడానికి వచ్చిన రాముడిని చూడాలనుకుంటుంది అతని భార్య మండోదరి. అలాగే యుద్ధానికి ముందు రోజు రాత్రి రాముడిని కలుసుకుంటుంది.

శని పాత్ర ప్రత్యేకత
అలాగే ఈ నాటకంలో మరో విశిష్టపాత్ర శనిదేవుడిది. అడవిలో వేటకు వెళ్లిన దశరథుడు సంధించిన శబ్దభేదికి మునికుమారుడు మరణించగా అతని తండ్రి నీకూ పుత్రశోకం లభిస్తుందని శాపం ఇవ్వడం కూడా శని ప్రభావం వల్లనే. వాల్మీకి- మానిషాద శ్లోక ఆవిర్భావం నుంచి ప్రారంభమయ్యే నాటకంలో దశావతారాల విశిష్టత, సీతారాములకల్యాణం, వనవాసంలో సీతారాముల జీవితం, వనవాసంలో తార రాముడికి శాపం ఇవ్వడం వంటివి కొత్త కోణంలో చూపాము. రావణబ్రహ్మ మందిరంలో శని పాత్రతో నాటకం ముగించడం కూడా ఓ కొత్త ప్రయోగం.

విస్తృత ప్రదర్శనలకు సన్నాహాలు
శ్రీకళానికేతన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో డిఎస్ఎన్ మూర్తి దర్శకత్వం వహించిన 'కోదండపాణి' నాటకంలో మొత్తం 26 పాత్రలు ఉంటాయి. నాటకం నిడివి 2.30 గంటలు. 14 మంది సాంకేతిక నిపుణులు, ఓ డజను మంది నృత్య కళాకారులు పనిచేశారు. ఈ నాటక ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయంతో రాష్ట్ర రాజధానిలో మూడు రోజుల ప్రదర్శన ఇచ్చాము. భద్రాచలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్(తంజావూరు), సౌత్ సెంట్రల్ కల్చరల్ జోన్(నాగపూర్)లను ఈ నాటక ప్రదర్శనకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నాం.

ఢిల్లీకి చెందిన భారత రంగ మహోత్సవ్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) వారు ప్రతి ఏటా జనవరిలో 14 రోజుల పాటు నిర్వహించే జాతీయ నాటక మహోత్సవాల కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి కూడా ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా 'కోదండపాణి' నాటక ప్రదర్శనలు ఇవ్వడానికి మేము సిద్ధం. 040-23833878 ఫోన్ నెంబర్‌లో నన్ను సంప్రదించి కళాభిమానులు తమ సూచనలు, ప్రోత్సాహం అందచేయవచ్చు.

తెలిసిన రామాయణ గాథను, తెలియని ఎన్నో విషయాలను విశ్లేషిస్తూ ఈ నాటకం సాగుతుంది. రామాయణం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు వధించడం సబబు కాదు కదా వంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడంతోపాటు రామాయణంలోని రహస్యాల పరమార్థాన్ని కూడా ఈ నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి