9, జూన్ 2012, శనివారం

విద్రోహాన్ని పెంచనున్న ‘రాజ్యాంగ సమీక్ష’!

తగాదా పడుతున్న ఉభయ పక్షాల మధ్య తగవు తీర్చడానికి మధ్యవర్తులు అవసరం. ‘జమ్మూకాశ్మీర్’ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు ఆ రాష్ట్రం విషయంలో తమకూ మరెవరికో మధ్య వివాదం కొనసాగుతున్నట్టు గుర్తించినట్టయింది! ఇలా గుర్తించడం మన రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమైన అంశం! ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య తగాదా ఏమిటి?? దాదాపు పంతొమ్మిది నెలల క్రితం నియుక్తులైన ఈ మధ్యవర్తి మహాశయులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన పరిష్కార నివేదిక గత నెల 24వ తేదీన బయటపడింది! కాశ్మీర్‌లోని విచ్ఛిన్నవాదుల ఆకాంక్షలకు పాకిస్తాన్ అనుకూల విద్రోహపు తండాల మనోభావాలకు ఈ నివేదిక అద్దంపడుతోంది! ఈ నివేదికలోని సిఫార్సులను అమలుజరిపినట్టయితే జమ్మూకాశ్మీర్ కథ క్రీస్తుశకం 1947వ, 1952వ సంవత్సరాల మధ్య నడచిన విద్రోహకాండకు పునరావృత్తికాగలదు. ఎటొచ్చీ ఈ పునరావృత్త గాధలో కాశ్మీర్ లోయలోని హిందువులు మాత్రం ఉండరు!

1947 అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్ రాజు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని మిగిలిన భారతదేశంలో విలీనం చేయడం చారిత్రక వాస్తవం. అందువల్ల కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం లేదు! కానీ ఆ తరువాత పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండిపోవడమే వివాద కారణం! దాన్ని రాబట్టుకోవడం మాత్రమే వివాద పరిష్కారం! కానీ దాన్ని రాబట్టుకొని వివాదాన్ని పరిష్కరించే మాటను మన ప్రభుత్వాలు మరచిపోయాయి. 1993లో పాకిస్తాన్ ప్రభుత్వంవారు కాశ్మీర్‌లో ‘హక్కుల’కు భంగం కలుగుతోందన్న తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించారు! అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు అభ్యర్థన మేరకు ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ప్రతినిధి బృందంవారు ఐక్యరాజ్యసమితికి వెళ్లి పాకిస్తానీ తీర్మానాన్ని వమ్ముచేసి రాగలిగారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలోని భాగమన్న సత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి!

1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి! మూడవ దేశం ప్రమేయం లేదు! అందువల్ల 1994నాటి తీర్మానం ప్రకారం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతున్న కాశ్మీర్ భూభాగాలు జమ్మూకాశ్మీర్‌తో ఏకీకృతం అయినట్టయితే కథాకధిత కాశ్మీర్ సమస్య లేదు! కానీ ఇలా ఏకీకృతం చేసే విషయం మన ప్రభుత్వాలు మరచిపోయాయి. అందువల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్ఠవేసిన పాకిస్తానీ బీభత్సకారులు జమ్మూకాశ్మీర్‌లోని దేశంలోని ఇతర ప్రాంతాలలోకి చొరబడుతున్నారు. దశాబ్దులుగా జమ్మూకాశ్మీర్‌లోను ఇతర ప్రాంతాలలోను పాకిస్తాన్ సృష్టిస్తున్న బీభత్సకాండ మాత్రమే సమస్య! ఈ బీభత్సకాండ ఫలితంగా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలోను, కాశ్మీర్ లోయ ప్రాంతంలోను అనాదిగా జీవించిన హిందువులు హత్యాకాండకు, అత్యాచారాలకు తరిమివేతకు గురిఅయినారు! ఈ హిందువులు భారతదేశ భక్తులు. జమ్మూకాశ్మీర్- పాకిస్తాన్ చైనా ఆక్రమిత భూభాగంతోసహా- భారతదేశంలో కొనసాగాలని భావిస్తున్నారు. 1947నుండి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు, 1990 నుండి లోయ ప్రాంతంలోని హిందువులు తమ సంస్థలకు దూరమై శరణార్ధి శిబిరాలలోను కాశ్మీర్ వెలుపలి ప్రాంతాలలోను జీవచ్ఛవ జీవన యాత్రను సాగిస్తున్నారు. అందువల్ల పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను నిర్మూలించడం జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతికి ప్రధాన పరిష్కారం. బీభత్సకాండ అణగారిపోయినట్టయితే లోయ ప్రాంత హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెడతారు! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో ఏకీకృతం చేసినట్టయితే జమ్ములో ఉంటున్న పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంత హిందువులు కూడా జన్మస్థలాలకు తిరిగి వెడతారు! ‘మధ్యవర్తుల’ నివేదికలో ఈ బీభత్సకాండ నిర్మూలనకోసం చేసిన సిఫార్సులు లేవు! నిర్వాసిత హిందువులు.. మధ్యవర్తులకు కాని కేంద్రానికి కాని గుర్తులేదని ఇలా స్పష్టమైంది!

ఇలా అసలు సమస్యను వదలివేసిన మధ్యవర్తులు జమ్మూకాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను సమీక్షించాలని సూచించారు. అలాగే 1950 తరువాత వివిధ సమయాలలో జమ్మూకాశ్మీర్‌కు వర్తింపచేసిన భారత రాజ్యాంగ విషయాలను కూడ సమీక్షించాలని మధ్యవర్తుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలవల్ల జమ్మూకాశ్మీర్ ప్రజలకు జరిగిన నష్టం ఏమిటన్నది మధ్యవర్తుల బృందం సూచించలేదు! అలాగే భారత రాజ్యాంగంలోని వివిధ అంశాలు మిగిలిన రాష్ట్రాలతోపాటు కాశ్మీర్‌కు వర్తించడంవల్ల ఆ రాష్ట్ర ప్రజలలో కలిగే ఇబ్బందులు ఏమిటో కూడ మధ్యవర్తులు విశే్లషించలేదు. 1953 సంవత్సరానికి ముందు కాశ్మీర్‌కు ఉండిన ప్రతిపత్తిని పునరుద్ధరించడం సాధ్యంకాదని చెప్పిన మధ్యవర్తుల ‘నివేదిక’. మరోవైపు దీన్ని సాధ్యం చేయడానికి అవసరమైన ‘సమీక్ష’లను సిఫార్సుచేసింది! ‘సమీక్ష’ కోరుతున్న వారు బీభత్సకారులను సమర్ధిస్తున్న ‘హురియత్’ కాన్ఫరెన్స్ వంటి ముఠాలవారు! నిజానికి సమీక్ష మాత్రమే ఈ ముఠాల లక్ష్యంకాదు! మన దేశంనుండి జమ్మూకాశ్మీర్‌ను విడగొట్టడానికి జరుగుతున్న కుట్రకు ఈ ‘సమీక్ష’ దోహదపడగలదని మాత్రమే ఈ ముఠాలు భావిస్తున్నాయి! కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ అనుకూల బీభత్స ముఠాలు సమాంతర పాలన నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఈ ముఠాల మద్దతును కూడ కట్టుకొనడంవల్ల ఎన్నికలలో విజయం సాధించవచ్చునన్నది ‘రాజ్యాంగ నిబద్ధత’కల రాజకీయ పార్టీల ఆశ. ఫలితంగా ఈ ‘సమీక్ష’కు అనుగుణమైన అనేక కోరికలను ఈ పార్టీలు దశాబ్దులుగా వెళ్లబుచ్చుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’వారు జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి- అటానమీ- గురించి ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగం 370వ అధికరణ కాశ్మీర్‌కు ప్రసాదించిన ‘ప్రత్యేక ప్రతిపత్తి’వల్ల, ఈ ‘ప్రత్యేక ప్రతిపత్తి’ - స్పెషల్ స్టాటస్-కి 1950వ దశకంలో ఆ అధికరణంలో లేని అర్ధాలు కల్పించడంవల్ల, ఇలా అర్ధాలు కల్పించిన వారిని నిలదీసిన వారు లేకపోవడంవల్ల 1953 వరకు కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అని పిలిచేవారు. అలాగే కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం ఏర్పడి ఉన్నాయి! ప్రముఖ జాతీయ సమైక్యతావాది, స్వాతంత్ర సమరయోధుడు ‘జనసంఘ్’ నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చేసిన బలిదానం ఫలితంగా కాశ్మీర్ ‘ప్రధానమంత్రి’ పదవిని ‘ముఖ్యమంత్రి పదవి’గా మార్చడం అనివార్యం అయింది. ఒకే దేశంలో ‘ఇద్దర ప్రధానమంత్రులు’ ఉండడం 1953 సంవత్సరపు పూర్వస్థితి! తమ ‘స్వయం ప్రతిపత్తి’ ద్వారా 1953 నాటికి ముందున్న రాజ్యాంగ వైపరీత్యాన్ని మళ్లీ సృష్టించాలన్నది ‘నేషనల్ కాన్ఫరెన్స్’ వారి వ్యూహం. ఇందుకు అనుగుణంగా ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 1990 దశకంలోను, ఈ శతాబ్ది ఆరంభంలోను అనేకసార్లు తీర్మానంను ఆమోదించింది.

మరో మాజీ ముఖ్యమంత్రి ముఫ్తిమహమ్మద్ సరుూద్, ఆయన కుమార్తె మెహబూబాముఫ్తి నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీవారు కోరుతున్న ‘స్వయంపాలన’- సెల్ఫ్‌రూల్-‘ప్రత్యేక ప్రతిపత్తి’కంటే మరింత ప్రమాదకరమైనది! ఈ ‘స్వయం పాలన’ ప్రతిపాదనను నిజానికి అప్పటి పాకిస్తాన్ నియంత పర్‌వేజ్ ముషారఫ్ 2005వ సంవత్సరంలో ప్రకటించాడు. దీన్ని ‘పిడిపి’వారు అందిపుచ్చుకున్నారు! భారత వ్యతిరేకతను పాకిస్తాన్ అనుకూలతను ప్రకటించినప్పుడు మాత్రమే లోయ ప్రాంతంలోని వోటర్లు తమ పార్టీని గెలిపిస్తారన్న ‘భ్రాంతి’ దీనికి కారణం. నిజానికి ‘లోయ’ ప్రాంతం ప్రజలలో అత్యధికులు దేశభక్తులు, బీభత్సకాండను వ్యతిరేకిస్తున్నారు. కానీ వేల సంఖ్యలోను బీభత్సకారులకు భయపడి మెజారిటీ ప్రజలు తమ భావాలను వ్యక్తంచేయడం లేదు. ‘భ్రాంతి’కి లోబడి ఉన్న ‘పిడిపి’ మాత్రం ‘హురియత్’ కాన్ఫరెన్స్‌కు చెందిన ముదురు ముఠా - హార్డ్ లైన్ ఫ్యాక్షన్- వారికి అనుకూలంగా ప్రవర్తిస్తోంది. ఈ హురియత్ ముదురు ముఠావారు జమ్మూకాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలని వాంఛిస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల విధేయతను ప్రకటించడం లేదు. ‘స్వయంపాలన’లో భాగంగా కాశ్మీర్‌కు కొత్త ద్రవ్య వినిమయ విధానం- మానిటరీ సిస్టమ్- కావాలట! భారతీయ కరెన్సీ స్థానంలో కాశ్మీరీ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలట!

ఇలా పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పోటాపోటీగా 1953 పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల-ఇంటర్ లొక్యూటర్స్-ను నియమించడానికి నేపధ్యం ఇది. ‘అటానమీ’ కావాలని కోరుతూ జమ్మూకాశ్మీర్ శాసనసభ చేసిన తీర్మానాన్ని 2010 ఆగస్టులో పార్లమెంటు తిరస్కరించింది. ఆ తరువాత సెప్టెంబర్‌లో కేంద్రం కాశ్మీర్ ప్రశాంతికోసం అష్ట సూత్ర ప్రణాళికను ప్రకటించింది! ఈ ప్రణాళికలోని ఒక అంశం ‘మధ్యవర్తులు’ అన్నివర్గాల ప్రజలతోను చర్చలు జరపాలన్నది. పత్రికా రచయిత దిలీప్ పడ్‌గావ్‌కర్, కేంద్ర ప్రభుత్వపు సమాచారశాఖ కమిషనర్ ఎమ్.ఎమ్.అన్సారీ, ఓ స్వచ్చంద సంస్థకు చెందిన రాధాకుమార్ ఈ మధ్యవర్తులు! ఈ మధ్యవర్తులు ప్రధానంగా చర్చలు జరిపింది ‘అటానమీ’. ‘సెల్ఫ్‌రూల్’ వాదులలోను, ‘హురియత్’ వంటి విచ్ఛిన్న ముఠాలతోను మాత్రమే! పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌నుంచి, కాశ్మీర్ లోయనుంచి తరిమివేతకు సరైన దాదాల పది లక్షల మంది బాధితుల ప్రతినిధులను ఈ మధ్యవర్తులు పట్టించుకోలేదు!

దశాబ్దులపాటు వర్తింపచేయడం వల్ల మూడువందల డెబ్బయవ అధికరణం స్ఫూర్తి నీరుకారిపోయిందని మధ్యవర్తుల బృందం నిర్ణయించడం విస్మయకరమేకాదు, అర్థ రహితం కూడ! ‘‘అటానమీ’, ‘స్వయంపాలన’కోరుతున్న వారిని సంతుష్టీకరించడానికి వీలుగా మధ్యవర్తులు ఈ ‘సమీక్ష’ను సిఫార్సుచేశారు! కాశ్మీర్‌కు వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వపు చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను ‘సమీక్ష’ చేయడమంటే కొన్నింటిని తొలగించ వస్తుందన్నది ధ్వని! సుప్రీంకోర్టు న్యాయాధికార పరిధిని, కంట్రోలర్ ఆడిటర్ జనరల్- సిఏజి-వారి ఆర్థిక అధికార పరిధిని తొలగించాలనడం, గవర్నర్‌ను నియమించే అధికారాన్ని రాష్టప్రతి పాలనను విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేకుండా చేయడం వంటివి ‘స్వయంపాలన’ సమర్ధకులు, ‘స్వయంప్రతిపత్తి’ విధానకర్తలు కోరుతున్న కోర్కెలు! సమీక్షకోసం ఏర్పడే ‘రాజ్యాంగ సంఘం’వారు వీరితో జరిపే చర్చల సందర్భంగా ఈ విద్రోహవాంఛలు మళ్లీ విస్తృతంగా ప్రచారవౌతాయి.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి