7, నవంబర్ 2009, శనివారం

ఆ ఋణం తీఱుద్దామా ? లేక ఇంకా ఋణాల ఊబిలో కూరుకుపోదామా ?

ಎನಿತು ಜನ್ಮದಲಿ ಎನಿತು ಜೀವರಿಗೆ ಎನಿತು ನಾವು ಋಣಿಯೋ
ತಿಳಿದು ನೋಡಿದರೆ ಬಾಳು ಎಂಬುದಿದು ಋಣದ ರತ್ನಗಣಿಯೋ"


(ఎనితు జన్మదలి ఎనితు జీవరిగె ఎనితు నావు ఋణియో
తిళిదు నోడిదరె బాళు ఎంబుదిదు ఋణద రత్నగణియో)


"ఎన్ని జన్మల్లో ఎందఱు జీవులకి మనం ఋణగ్రస్తులమో
కనిపెట్టి చూస్తే ఈ జీవితమనేది ఋణరత్నాల నిక్షేపమేమో"


అంటారు ప్రముఖ కన్నడకవి శ్రీ ఎమ్.ఎస్. శివరుద్రప్ప. మనిషి పుడుతూనే దేవఋణం, పితృఋణం, ఋషిఋణం అని మూడురకాల ఋణాలతో జన్మిస్తాడని మన పూర్వగ్రంథాలు తెలుపుతున్నాయి. వివిధ దేవతలు మన శరీరంలోని వివిధ అవయవాలకి అధిష్ఠాన దేవతలై ఈ రూపాన్ని మనకి ప్రసాదించారు. వారే పంచభూతాల్లోను, సమస్త ప్రకృతిలోను నివసిస్తున్నారు. అందుచేత లోపలా, వెలుపలా కూడా వారే ఉన్నారు. వారు లోపల ఉన్నప్పుడు జీవశక్తులనీ, వెలుపల ఉన్నప్పుడు ప్రకృతిశక్తులనీ పిలవబడతారు. ఆ విధంగా వారు మనతో నిత్యనివాసం చేస్తున్నారు. కనుక దేవఋణాన్ని జప తపో ధ్యాన హోమ యజ్ఞాదుల ద్వారాను, పూజాదికాల ద్వారాను తీర్చాలి. అప్పుడు వారు సంతుష్టి చెంది మన జీవితానికి కావాల్సిన ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తారు.

పితృదేవతలు మన తండ్రుల వృషణాలలో నివసించి మన పుట్టుకకి కారణమయ్యారు. పైపైన చూడ్డానికి మన జన్మకి నిమిత్త కారకుడు మన తండ్రి అయినప్పటికీ, తెఱ వెనుకనున్న అసలు కారకులు పితృదేవతలే. వారి అనుగ్రహం లేకపోతే భార్యాభర్తలు ఎంత హోమ్ వర్క్ చేసినా ఏమీ లాభం లేదు. వారు మన పూర్వీకులు కారు. పితృలోకం అని ఒకటుంది. చనిపోయినవారు తమ పాపపుణ్యాల అనుసారంగా ఊర్ధ్వ, అధో లోకాలకి వెళ్ళబోయేముందు అక్కడ మజిలీ చేస్తారు. ఆ లోకానికి అధిపతులు పితృదేవతలు. అందుచేత వారిని సంతృప్తిపఱచడం కోసం ప్రతి సంవత్సరమూ తద్దినాలు పెట్టాలి. లేకపోతే వారు ఆగ్రహిస్తారు. విధివిహితంగా వివాహం చేసుకొని పెద్దల వంశాన్ని కొనసాగించడమే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గం.

ఇహపోతే ఋషిఋణం. దీన్ని ఒక రకంగా గురుఋణం అని చెప్పుకోవచ్చు. మానవులకి నాగరికత లేని రోజుల్లో భగవదాదేశం మీద వారి మధ్య జన్మించి వారికి ప్రాథమికమైన మంచి, చెడు, శుచీ, శుభ్రం, వావి-వరుస, రాజ-ప్రజా ధర్మాలూ, పతి-పత్నీధర్మాలూ, పితాపుత్ర ధర్మాలూ, గురుశిష్య ధర్మాలూ, దైవభక్తి, పాపభీతి గట్రా బోధించి, చూపించి వెళ్ళిన ఆదిమ గురువులున్నారు. వారికే ఋషులని పేరు. వారి బోధల్ని అచంచల విశ్వాసంతో వేలాది సంవత్సరాల పాటు మానవజాతి అనుసరించడం వల్లనే మానవ నాగరికత ఇప్పుడు ఇంత మహోన్నత స్థితికి చేఱుకుంది. అయితే ఇప్పుడు వాటిని ధైర్యంగా ఉల్లంఘిస్తున్నారు కనుక ఇది త్వరలో సంపూర్ణంగా పతనం (collapse) అవుతుంది. ఆ తరువాత ఆ ఆదిగురువులే పతనమైన ధర్మాల్ని తిరిగి నిలబెట్టడం కోసం భావి-అనాగరికుల మధ్యకి దిగిరావాల్సి వస్తుంది. వారికి సేవ చేద్దామంటే వారిప్పుడు మనకి లభించరు కనుక వారి గ్రంథాల్ని మనం అధ్యయనం చెయ్యడం, ఇతరులకి అధ్యాపనం చెప్పడం, ఆచరించడం - ఇవే వారి ఋణాన్ని తీర్చుకునే మార్గాలు.

నా దృష్టిలో ఇంకో ఋణం ఉంది. అది ప్రకృతిఋణం. ప్రకృతి జగదంబా స్వరూపం. ఓమ్ ప్రకృత్యై నమః అంటారు లక్ష్మీ అష్టోత్తరంలో ! కనుక ఇక్కడ ప్రతివిషయాన్ని శ్రీ అమ్మవారు తన ప్రేమామృతంతో రంగరించి సృష్టించి ఉన్నారు. ఒక వడ్లగింజని తీసుకొని పరిశీలించండి. ఆ గింజలు తన మానవ బిడ్డలకి చేఱాలనే ఆ తల్లి తపన మీకర్థమవుతుంది. ఎంత పకడ్బందీగా ఆవిడ ఒక్కొక్క గింజని ప్యాకేజి చేసిపెట్టిందో చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. భగవంతుడు/ భగవతి తన మీద కుఱిపిస్తున్న ఈ వాత్సల్యానికి ప్రతిగా మనిషి ఏం చేస్తున్నాడు ? అవే ఆహార పదార్థాల్ని కల్తీ చేసి తోటి మానవులకి సరఫరా చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడు/ భగవతి ప్రత్యక్షమై " ఏరా ! నేను నీకు పరిశుద్ధమైన ప్రేమతో అందించిన ఆహారాన్ని అదే విధమైన ప్రేమతో నీ తోటి మానవులకి అందించాల్సిన అవసరం లేదా ? లేదని నువ్వంటే నీలాగే నేను కూడా నీకు కలుషితాహారాన్నే ప్రసాదిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా ?" అనడిగితే వీడి సమాధానమేంటి ?

మన పూర్వీకులు మనకొదిలిపోయిన పరిశుద్ధమైన నీటిని, గాలినీ, పరిసరాల్నీ మనం అలాగే ఉంచుతున్నామా ? వారు మనకి వాటిని ఎలా అందించారో అలాగే మనమూ భావితరాలకి అందిస్తే అదే నిజంగా దేవ, పితృఋణాల్ని తీర్చడం అవ్వదా ?

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి