19, సెప్టెంబర్ 2010, ఆదివారం

యోగాలు ఎలా పుట్టాయి ?

మానవుడు దేవుని చేరే మార్గమే యోగం. ఆ విధానాన్ని కూడా యోగమనే అంటారు. యోగాలు ఎలా పుట్టాయి అని ఆలోచిస్తే ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి. మనిషి తానున్న చోటినుంచే ఎక్కడకైనా వెళ్లగలడు. అలాగే, తనకున్న దానినుంచే ఇంకొక ఉన్నతమైనదానిని అందుకోగలడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ విలక్షణుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తిని బట్టి వారి వ్యక్తిత్వంలోని విలక్షణతను బట్టి ఆయాయోగాలు వారికి సరిఫోతాయి. అందరికీ అన్ని యోగాలు సరిపోవు అనడానికి ఇదే కారణం.

మనిషి అనేవాడు దేహం-ప్రాణం-హృదయం-కర్మేంద్రియ-జ్జానేంద్రియ-మనో-బుద్ది-ఆత్మల కలయిక.

మనిషికి కర్మేంద్రియాలున్నాయి. వీటిద్వారా భగవంతుని అందుకునేది కర్మయోగం. కొందరు పని చెయ్యకుండా క్షణం ఊరుకోలేరు. వారి జీవితం అంతా కర్మ మయంగా ఉంటుంది. అటువంటివారికి కర్మయోగం సరిపోతుంది. అంటే వీరు Action-oriented people.

మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి. వీటి ద్వారా దేవుని చేరుకునేది జ్ఞానయోగం. కొందరిలో బుద్ది చాలా తీక్షణంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపైన ఆధారపడకుండా, ఏ బంధాలలోనూ ఇమడకుండా, పూర్తిస్వతంత్రంగా ఉండాలనే గట్టి వ్యక్తిత్వం కలవాళ్ళకు సరిపోయేది జ్ఞానయోగం. ఇది ఎక్కువగా పురుషులకు సరిపోతుంది. వీరు ultimate freedom-lovers.


మనిషికి స్పందించే హృదయం ఉంది. దానిద్వారా కలిగే ప్రేమతత్వంతో భగవంతునిచేర్చేది భక్తియోగం. సున్నిత మనస్కులకు, దయాస్వభావులకు, ఒకరిపైన ఆధారపడే స్వభావం ఉన్నవారికి సరిపోయేది భక్తి యోగం. ఇది ఎక్కువగా స్త్రీలకు సరిపోతుంది. వీరు sentimental and loving people.

మనిషికి శరీరం ఉంది. కొందరికి దేహస్పృహ ఎక్కువగా ఉంటుంది. దేహాన్ని దాటి వాళ్ళ ఆలోచనలు ముందుకు పోలేవు. వీరికి ముందుగా కావలసింది హఠయోగం. శరీరంలో కఫ శ్లేష్మాది కల్మషాలు ఎక్కువగా ఉన్నవారికి వాటి ప్రక్షాళణ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వీరు body-oriented people.

మనిషికి మనస్సు ఉంది. దానిద్వారా పరమాత్ముని చేరుకోవటం రాజయోగం. మనో మయ జీవులకు ఆలోచనాపరులకు రాజయోగం చక్కగా సరిపోతుంది. వీరు mind-oriented, thoughtful people.

మనిషికి ప్రాణశక్తి ఉన్నది. దానిద్వారా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని చేరుకోవటం కుండలినీ యోగం. ప్రాణ సాధకులకు, ప్రాణ శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ యోగం బాగా సరిపోతుంది. వీరు energy-oriented people.

ఇతర మతాలవలె అందరినీ ఒకే గాటన కట్టకుండా, ఎవరి వీలును బట్టి వారికి దారిచూపడమే మన సనాతన మతం యొక్క విశిష్టత. నువ్వున్న చోటినుంచి ముందుకు నడువు, నువ్వున్న చోటినుంచి పైకి ఎదుగు అని మన మతం చెబుతుంది.

ఆ క్రమంలో పుట్టినవే వివిధ యోగ ప్రక్రియలు.

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి