7, సెప్టెంబర్ 2011, బుధవారం

ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పునాదులపై పునర్ నిర్మించడం

కొన్నేళ్ళ క్రితం ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక నల్లజాతి క్రీడాకారుడు (పేరు గుర్తులేదు) హైదరాబాదులో పత్రికలవారికి ముఖాముఖీ ఇస్తూ "ఆఫ్రికా, ఇండియా రెండూ ఐరోపేయుల వలసపాలనలో వందలాది సంవత్సరాలు మగ్గిన ప్రాంతాలే. కానీ మీకూ, మాకూ చాలా తేడా ఉందని ఇక్కడికొచ్చినాక గ్రహించాను. వలసపాలనలో మేము మా సర్వస్వమూ పోగొట్టుకున్నాం. మా కట్టూబొట్టూ, ఆచారవ్యవహారాలూ, మతమూ, భాషా అన్నీ పోయాయి, మేమిప్పుడు క్రైస్తవమతాన్ని అవలంబిస్తూ, ఇంగ్లీష్, ఫ్రెంచిలాంటి ఐరోపేయ భాషలు మాట్లాడుతూ జీవిస్తున్నాం. కానీ మీ దేశంలో మీ భాషలు ఇంకా జీవించే ఉన్నాయి. మీ మతం కూడా జీవించే ఉంది. మీ ఆడవాళ్ళు ఇప్పటికీ చీరల్లోనే కనిపిస్తున్నారు. మీ శాస్త్రాలూ, ఆచారాలూ, దేవాలయాలూ అన్నీ సలక్షణం (intact) గా ఉన్నాయి. వందలాది సంవత్సరాల వలసపాలన మిమ్మల్నేమీ చేయలేకపోయింది." అంటూ అభినందించాడు.

అతను కొంతే గమనించాడనీ, పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేదనీ మనకి తెలుసు. మన మతమూ, భాషలూ, ఆచార వ్యవహారాలూ, శాస్త్రాలూ ఎంత ప్రమాదంలో ఉన్నాయో మనకి మాత్రమే తెలుసు.

ఇలా ప్రమాదంలో పడ్డ భారతీయ శాస్త్రాల్లో ఆయుర్వేదం కూడా ఒకటి. ఇది 4 రకాలుగా ప్రమాదంలో పడింది. ఒకటి - ఈ శాస్త్రానికి ప్రభుత్వపోషణ కఱువవుతున్నది. ప్రభుత్వం కొత్త ఆయుర్వేద కళాశాలల్ని గానీ, వైద్యశాలల్ని గానీ స్థాపించడం మానేసింది. ఉన్నవాటికి సరైన నిధులూ, సిబ్బందీ సౌకర్యాలూ లేవు. తద్ద్వారా ప్రజాదరణ కూడా అడుగంటుతున్నది. ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలమ్మే కొట్లు తగ్గిపోతున్నాయి. వాటిని కూడా మామూలు అల్లోపతీ మందుల దుకాణాలవాళ్లే అమ్ముతున్నారు.

రెండో కోణం - ఆయుర్వేదం ప్రధానంగా వనమూలికల మీద ఆధారపడ్డ వైద్యం. అడవుల్ని నఱికేయడం వల్లా, గ్రామకంఠాల్ని స్థానికులు దురాక్రమించి నానా ఇతరేతర అవసరాలకి వాడుతూండడం వల్లా అక్కడ సహజంగా పెఱిగే మొక్కలూ, వనమూలికలూ పునరుత్పత్తికి నోచుకోక నశించిపోతున్నాయి. ఉదాహరణకి - స్త్రీలకి ఋతుసమయంలోనూ, ఋత్వంతం (మెనోపాజ్) లోనూ అధిక రక్తస్రావం కాకుండా నిరోధించే తుఱకవేపాకు అనే మొక్క ఇప్పుడు అరుదైపోయింది. అందుకోసమే ఉపయోగపడే రెడ్డివారి నానుబ్రాలు అనే మఱో మొక్క కూడా అలాగే అదృశ్యమైపోతోంది. దాన్తో ఇప్పుడు ఇలాంటివాటన్నింటికీ ఖరీదైన అల్లోపతీ మందులు వాడుతూ, శస్త్రచికిత్సలు చేయించుకుంటూ జనం శాశ్వతంగా మంచాన పడుతున్నారు. ఇలాంటి అద్భుతమైన వనమూలికలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.అలనాటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు ఇలాంటి వనౌషధుల ప్రాశస్త్యాన్ని గుర్తించి 1988 లో అనుకుంటా, తిరుపతిలో ఒక ఆయుర్వేదిక్ హెర్బేరియమ్‌ని (వనమూలికల ఉద్యానవనం) స్థాపించారు. కానీ అనంతరకాలంలో అధికారంలోకి వచ్చినవాళ్ళు ఆ హెర్బేరియమ్ ని ఏం చేశారో, రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్నారో ఏంటో ఏమీ తెలియదు.

మూడో కోణం - ఆయుర్వేదం మీద నాస్తికులూ, తదితర సంస్కృతివ్యతిరేకులూ (anti-culture elements), అల్లోపతీ మందుల ఉత్పాదకులైన బహుళ జాతీయ సార్థవాహాలూ పనిగట్టుకొని దుర్బుద్ధితో, ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం. ఇది అంతర్జాతీయ స్థాయిలో విచక్షణారహితంగా చెలరేగిపోతోంది. ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో పాదరసం, బంగారం, వెండి, సీసం లాంటి ఘనలోహాల్ని (hard metals) ప్రమాదకర స్థాయిల్లో మిశ్రమం చేస్తున్నారనీ, అవి వాడితే శరీరం లోపలి కీలక అవయవాలు శాశ్వతంగా దెబ్బ దింటాయనీ ప్రచారం చేస్తూ అమెరికా యూరప్ జనాల్ని భయభ్రాంతులకి గుఱి చేస్తున్నారు. ఈ దుష్ప్రచార ఫలితంగా ఇటీవల యూరోపియన్ యూనియన్ ఆయుర్వేద మందుల్ని నిషేధించింది. త్వరలో అమెరికా చేత కూడా నిషేధింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరం గా జఱుగుతున్నాయి.

నాలుగో పార్శ్వం - ఆయుర్వేదాన్ని ఇతర వైద్యవిధానాలతో కలుషితం చేయడం. కొందఱు ఆయుర్వేద వైద్యులైతే ఆయుర్వేద మందుల్లో ఉత్తేజకాల్ని (steroids) కలిపి పక్కప్రభావాలకి కారకులవుతూ శాస్త్రానికి చాలా చెడ్డపేరు తెస్తున్నారు.

ఆయుర్వేదానికి వంకలు లేవని వాదించడం నా ఉద్దేశం కాదు. అయితే ప్రతివైద్యవిధానం లోనూ ఏదో ఒక లోపం ఉన్నది. ఉదాహరణకి - శరీరాన్ని కోయకుండా అల్లోపతివాళ్ళు ఏ చికిత్సా చేయలేరు. కానీ తెఱవబడ్డ యంత్రాలు తెఱవక ముందున్ననాటి పనితీరు (functioning) ని యథాతథంగా చూపించలేవు ఎట్టి పరిస్థితుల్లోనూ ! అటువంటప్పుడు కేవలం ఆయుర్వేదాన్నే విమర్శించడమూ, దుష్ప్రచారం చేయడమూ సబబు కాదు. అయితే విమర్శలు ఇలా వస్తున్నాయి గనుక ఆయుర్వేద వైద్యులూ, ఔషధ ఉత్పాదకులూ తమ వ్యూహాల్ని కాస్త మార్చుకుంటే బావుంటుంది. లోకుల సంతృప్తి కోసమైనా ఘనలోహాల మిశ్రమం లేకుండా ఔషధాల్ని తయారు చేయాలి. ఏ లోపలి అవయవం ఎలా పనిచేస్తుందో సరైన అవగాహన కల్పించే పాఠ్యపుస్తకాలు ఆయుర్వేదంలో లేవు. ఉన్నవి ఈ కాలపు అవగాహనకి సరిపోవు. అటువంటప్పుడు వాటిని ఇతర వైద్యవిధానాల నుంచి గ్రహించడంలో తప్పులేదు.ఆయుర్వేద వైద్యులిచ్చే మందులు తప్పకుండా పని చేస్తాయి. కానీ ఎలా పనిచేస్తాయో వారు ఈ కాలపు పరిభాషలో వివరించలేరు. ఆయుర్వేదవైద్యులు ఆధునిక రోగనిదాన (డయాగ్నాస్టిక్) పరికరాల్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆ పరికరాల ద్వారా తెలియవచ్చిన పరీక్షా ఫలితాలకి అనుగుణంగా మందుల్ని ఉత్పాదించాల్సి ఉంటుంది.

ఇవన్నీ ఎవఱూ గంభీరంగా పట్టించుకుంటున్నట్లు కనిపించదు. అసలు ఆయుర్వేదంలో పరిశోధనే స్తంభించిపోయినట్లు కనిపిస్తోంది. పరిశోధన కుంటువడ్డ శాస్త్రానికి భవిష్యత్తు లేదు. మన పూర్వీకులకి ఏమీ తెలియదనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అనీ తెలుసు ననుకోవడమూ అంతే మూర్ఖత్వం. కనుక మన పూజ్య పూర్వీకుల కానుక, జాతికి గర్వకారణమూ అయిన ఈ వేదాంగం ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రయోగశాలల్ని నెలకొల్పి సరికొత్త పద్ధతులలో, పరిశోధనాత్మకంగా నూతన జవసత్త్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

garlic for strengthening elasticity of blood vessels by producing H2S gas inside the blood vessels -published in recent Science or Nature mag

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి