13, డిసెంబర్ 2010, సోమవారం

ఆలయ రక్షణ భారం దేవుడిదే

ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
--హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌.పి.ఎఫ్‌.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్‌ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్‌ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్‌ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.

-----------------------------------------------------------------

చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకూ, డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థనీ నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి