5, డిసెంబర్ 2010, ఆదివారం

ఉపాసనామార్గాలన్నీ భగవత్‌ ప్రసాదితాలే సుమా !

ఒక పిల్లవాడికి "అమ్మా ! నాన్నా !" అనే పిలుపులు ఎవఱు నేర్పుతారు ? తల్లిదండ్రులే కదా. ఆ బిడ్డడికీ, తమకూ మధ్య ఉన్న వావి (సంబంధం) తెలిసినవారు వారు. ఆ పిలుపుల ద్వారా ఆ సంబంధాన్ని వారు ఆ పిల్లవాడికి తెలియజెబుతారు. అదే విధంగా "భగవాన్, దేవుడు, దైవం" అనే ఈ మాటలు కూడా మనకు నేర్పినది బహుశా భగవంతుడే సాక్షాత్తు ! లేకపోతే భగవద్ భావనని కల్పించుకునే పాటి తెలివి ఎక్కడిది మనిషికి ? ఊరికే అవిశ్వాసులు ఊదరగొట్టడం తప్ప ! ఊహించుకోవడానికీ, కల గనడానికీ సహితం ఒక ఆధారం కావాలి. ఉదాహరణకు - తాను చనిపోయినట్లు కల గనజాలినవాళ్ళెవఱున్నారు ? ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికి మానవ మనస్సుకు ఏ జాడా దొఱకదు గదా !

ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ కథామృతంలోని ఒక సంభాషణ నా స్మృతిపథంలో మెదుల్తున్నది. ఆ పుస్తక రచయిత శ్రీ గుప్తా శ్రీరామకృష్ణులకు సమకాలికులూ, శిష్యులున్ను. శ్రీ పరమహంసగారితో తన ప్రథమ సమావేశాన్ని "మణి" అనే మారుపేరు పెట్టుకొని అక్షరబద్ధం కావించారు. అప్పటిదాకా ఆయన బ్రహ్మసమాజ మతస్థుడుగా ఉన్నారు. అందుకని ఆ సమయానికి క్షవరం చేయించుకుంటున్న శ్రీ పరమహంసగారి దగ్గఱ కూర్చుని "మట్టి, చెక్క, ఱాయి ఇలాంటి పదార్థాలతో చేసిన విగ్రహాల్ని పూజించడం పొఱపాటు కదండీ ! అవి దేవుడు కాదు గదా ! అది తప్పు అని సామాన్యప్రజలకు తెలియకపోతే మనం వెళ్ళి చెప్పాలి కదండీ !" అన్నారు. అందుకు శ్రీ పరమహంస నవ్వి "విగ్రహం అని ఎవఱు చెప్పారోయ్ ! చిన్మయప్రతిమ !" అన్నారు. మణికి చిన్మయప్రతిమ కాన్సెప్టు అర్థం కాలేదు. అప్పుడు పరమహంస "ఒకటి తప్పు, అని, ఇంకొకటి ఒప్పు అని నీకెలా తెలుసు ? నువ్వేమైనా దేవుణ్ణి చూశావా ?" అని అడిగారు. తాను గొప్ప ఇంగ్లీషు విద్యావంతుణ్ణి అనే అహంకారం ఉండేది మణికి.శ్రీ పరమహంస వేసిన ఈ ఒక్క ప్రశ్నతో అతని అహంకారం అధః పాతాళానికి క్రుంగిపోయింది. బడికే వెళ్ళని శ్రీ పరమహంసకు పాదాక్రాంతుడయ్యాడా కలకత్తా బాబు. అప్పుడు శ్రీ పరమహంస అతనికిలా వివరించారు "ఒక మార్గం తప్పు అనీ, ఇంకొక మార్గం ఒప్పు అనీ మనం ఎలా చెబుతాం ? భగవంతుడే ఆయా మానవుల పరిపక్వతను బట్టి వివిధ ఆరాధనా పద్ధతుల్ని సృష్టించి (ఉపదేశించి) ఉన్నాడు"

ఆయనే మఱో సందర్భంలో మాట్లాడుతూ "ఒక తల్లి తన సంతానంలో ఒక్కొక్కఱి వయస్సు, ఆరోగ్యాన్నీ బట్టి ఒక్కొక్క రకంగా అన్నం పెట్టినట్లే భగవంతుడు కూడా ఆయా మానవజాతుల స్థాయిని బట్టి వివిధ మతాల్ని కల్పించి ఉన్నాడు." అని అనుగ్రహభాషణ చేశారు.

మనం చదివే విష్ణుసహస్రనామాలూ, రుద్రం, దేవీసప్తశతి ఇవన్నీ ఋషుల ద్వారా భగవంతుడు మనపై ప్రేమతో అనుగ్రహించినటువంటివి. మఱో రకంగా చేస్తే ఫలితం తక్కువ. పైగా అలాంటి అనధికృత స్వతంత్రత (unauthorized liberty) నిషిద్ధ పాషండ మతం అనిపించుకుంటుంది. ఉపాసనా పద్ధతుల్ని బ్రాహ్మణులు గానీ, లేదా వారిలాంటి మఱో మానవ ఏజన్సీ గానీ సృష్టించలేదనేది, అవి నేరు (direct) గా భగవదాదేశమనీ నాక్కూడా అనుభవమే. చాలా కాలం క్రితం నేనొకసారి శివుడిమీద వేఱే విధంగా నామాలు కల్పించి వ్రాయగా ఆయన స్వప్నదర్శనమిచ్చి నాపై కోపించి వాటిని ధ్వంసం చేయమని సూచించారు.

కామెంట్‌లు లేవు:

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి