7, సెప్టెంబర్ 2009, సోమవారం

అమ్మవారిని దూషించకుండా జాగ్రత్తపడదాం !

"వెధవడబ్బుదేముందండీ....."

ఈ తరహా సంభాషణలు అప్పుడప్పుడు మన చెవిన పడుతూంటాయి. "వెధవ" డబ్బట ! డబ్బు లేకపోతే మన నడ్డి లేవడం అసాధ్యం అని తెలిసీ కొంతమంది దానిమీద ఇలా నోరు పారేసుకుంటూ ఉంటారు. "అయ్యా ! డబ్బు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ దేవి, దాన్ని దూషించడం మహాపచారం మొఱ్ఱో !" అని మన పూర్వులు నెత్తీనోరూ కొట్టుకున్నా మనవాళ్ళకిదే ధోరణి. అందుకే ఇలా అమ్మవారిని పరోక్షంగా దూషించీ, దూషించీ మన దేశం దరిద్రదేశం అయిందేమోనని మనసులో నాకొక మూలనచింత.

డబ్బు దేవత ఎలా అయింది ? అనడిగితే, దాన్తో మనం ప్రకృతివనర్లని స్వాధీనం చేసుకుని అనుభవిస్తాం కనుక. ప్రకృతివనర్లే డబ్బుగా రూపాంతరం చెందుతాయి గనుక. "ప్రకృతిం వికృతిం విద్యామ్..." అంటుంది శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఆ స్తోత్రంలో అమ్మవారికున్న మొట్టమొదటి పేరే "ప్రకృతి" అని చెప్పబడింది అంటే ఆలోచించండి.

"వెధవ" అనేది మొదట్లో దూషణ (abuse) కాకపోయినా తరువాతి కాలంలో దూషణగా మారింది. వెధవ అంటే నిజానికి వితంతువు అని అర్థం. ఆ రోజుల్లో యౌవనవితంతువులకి పునర్వివాహ అవకాశం లేక బలవంతపు బ్రహ్మచర్యాలు పాటించడం చేతకాక కంటికి నచ్చినవాడితో పారిపోయేవారు. అందుకని వాళ్ళని సమాజం ఇలా దూషించేది. ఇప్పుడు మగవాళ్ళని కూడా ఆ పదంతోనే దూషిస్తున్నారనుకోండి. అదే వేఱే విషయం. ఆ పదాన్ని డబ్బుకి - నిత్యసుమంగళి, శాశ్వతసౌభాగ్యవతి, పరమపతివ్రతాశిరోమణియైన అమ్మవారికి అన్వయించడం భావ్యం కాదు గదా !

తెలుగులో టైప్ చేయండి

కైఫీయతులు

  © బ్లాగర్ టెంప్లేట్ "ప్సై" రూపొందించినవారు Ourblogtemplates.com 2008

ఈ పుట పైభాగానికి వెళ్ళడం కోసం ఇక్కడ నొక్కండి